త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోండి..

Supreme Court | పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు అంశంలో తెలంగాణ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు సోమ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రెండు రాష్ట్రాలు మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ సూచించారు. ఈ కేసు విచార‌ణ‌ను వ‌చ్చే సోమ‌వారానికి వాయిదా వేశారు.

A

Telangana | Published On Jan 5, 2026, 4.12 pm IST

Supreme Court | మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోండి..
Advertisement
  • పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌లసాగ‌ర్ ప్రాజెక్టు అంశంపై సీజేఐ సూచ‌న‌
  • ప్రాజెక్టుపై స్టే ఇవ్వాల‌న్న తెలంగాణ ప్ర‌భుత్వం..
  • కేవ‌లం ప్లాన్ రూపొందిస్తున్నామ‌న్న ఏపీ స‌ర్కారు..
  • మ‌ళ్లీ సోమ‌వారం విచార‌ణ‌

Supreme Court | పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు అంశంలో తెలంగాణ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు సోమ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రెండు రాష్ట్రాలు మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ సూచించారు. ఈ కేసు విచార‌ణ‌ను వ‌చ్చే సోమ‌వారానికి వాయిదా వేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టును ఏపీ ప్ర‌భుత్వం చేప‌డుతుందంటూ తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌గా.. పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ప్రాజెక్టుపై స్టే ఇవ్వాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీ కోరారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావ‌రిలో రాష్ట్ర వాటా త‌గ్గుతుంద‌ని ప్ర‌భుత్వం వాద‌న‌లు వినిపించింది. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టు మూడు ప‌రిష్కారాల‌ను సూచించింది.

సివిల్ సూట్ ఫైల్ చేస్తేనే స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుప‌వ‌చ్చ‌న్న సీజేఐ

ఈ సంద‌ర్భంగా సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉంది కదా..? ప్లానింగ్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్‌కి ఏపీ నిధులే వృధా అవుతాయి కదా? అంటూ ప్ర‌శ్నించారు. కేంద్రం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింద‌ని.. పిటిషన్ విచారణ అర్హతను పరిశీలిస్తున్నామ‌ని.. సివిల్ సూట్ ఫైల్ చేస్తేనే సమగ్రంగా విచారణ జరపవచ్చ‌న్నారు. ప్రాజెక్టు అడ్డుకోవాల‌నే అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వ కమిటీ పరిశీలించేలా చూడమని ఆదేశాలు ఇస్తామ‌ని, మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాల‌ని సీజేఐ సూచించారు. తెలంగాణ త‌ర‌ఫున అభిషేక్ సింఘ్వీ వాద‌న‌లు వినిపిస్తూ.. వరద జలాల పేరుతో తెలంగాణ‌కు కేటాయించిన నీటి వాటాను త‌ర‌లించేకుపోయే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఏక‌ప‌క్షంగా ప్రాజెక్టు నిర్మాణం చేప‌డుతున్నార‌ని.. వెంట‌నే స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం క‌ల్పించుకొని స్టే ఇవ్వాల‌ని కోరారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి వాటా ఉంద‌ని, పోలవరం-నల్లమల్లసాగర్ ప్రాజెక్టుతో త‌మ వాటా త‌గ్గుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

క‌మిటీకి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే అధికారం లేదు..

ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర జల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఏపీ పట్టించుకోవడం లేద‌ని, సీడబ్ల్యూసీ చైర్మన్‌ నేతృత్వంలో ఇటీవల కమిటీని ఏర్పాటు చేశార‌ని, ఈ కమిటీకి ప్రాజెక్టును ఆపే అధికారం లేద‌న్నారు. కోర్టు జోక్యం చేసుకొని ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని కోరారు. ఇక ఏపీ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది ముక‌ల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించారు. పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌లసాగ‌ర్ ప్రాజెక్టులో నిబంధ‌నలు ఉల్లంఘించ‌లేద‌ని.. కేవ‌లం ప్లాన్ రెడీ చేస్తున్నామ‌న్నారు. జ‌లాలు వృథా అవుతున్నాయ‌ని.. వాటిని సీమ‌కు అందించాల‌నుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇది రాష్ట్ర ప్రాజెక్టేన‌ని.. జాతీయ ప్రాజెక్టు కాద‌న్నారు. అవ‌స‌రాల‌పై ప్లానింగ్ చేసుకునే అధికారం త‌మ‌కుంద‌ని.. పీఎఫ్ఆర్‌, డీపీఆర్‌ల‌ను త‌యారు చేస్తున్న‌ట్లు చెప్పారు. అయితే, సుప్రీంకోర్టు సూచ‌ల‌న‌పై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తెలుసుకునేందుకు స‌మ‌యం కావాల‌ని సింఘ్వీ కోర‌గా.. కోర్టు విచార‌ణ సోమ‌వారానికి వాయిదా వేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement