త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jantar Mantar Protest | మహిళా ఆందోళనకారుల‌ను వేధించార‌ని ఆరోప‌ణ‌లు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

Jantar Mantar Protest | జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఆందోళన సందర్భంగా మహిళా నిరసనకారులపై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలపై తొలుత విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసుల దాడులు, నిరసనకారులపై హింసకు సంబంధించిన ఆరోపణలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ.. మహిళా నిరసనకారుల ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో విచారించాలని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ సోమవారం సూచించారు.

P

Telangana | Published On Aug 24, 2026, 2.49 pm IST

Jantar Mantar Protest | మహిళా ఆందోళనకారుల‌ను వేధించార‌ని ఆరోప‌ణ‌లు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
Advertisement

Jantar Mantar Protest | జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఆందోళన సందర్భంగా మహిళా నిరసనకారులపై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలపై తొలుత విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసుల దాడులు, నిరసనకారులపై హింసకు సంబంధించిన ఆరోపణలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ.. మహిళా నిరసనకారుల ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో విచారించాలని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ సోమవారం సూచించారు. ఆగస్టు 18న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. మహిళా నిరసనకారులపై జరిగినట్లు ఆరోపిస్తున్న లైంగిక హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన, త‌దిత‌ర ఫిర్యాదులను కమిటీ ముందుగా పరిశీలించాల్సి ఉంటుందని సీజేఐ స్పష్టం చేశారు. ఈ అంశాలపై సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు.

జులై 20న నిరసనతో వెలుగులోకి..

జులై 20న జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల ఆందోళన సందర్భంగా మహిళా నిరసనకారులపై పోలీసు సిబ్బంది లైంగిక వేధింపులు, అసభ్యంగా ప్ర‌వ‌ర్తించార‌న్న ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారించాల‌ని సీనియర్‌ న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనాన్ని కోరారు. మహిళా ఆందోళనకారులు పోలీసులపై లైంగిక వేధింపులు, అసభ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక రిట్‌ పిటిషన్‌ దాఖలైందని న్యాయమూర్తి జాయ్‌మాల్య బాగ్చీ తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదులను స్వీకరించేందుకు నోడల్‌ అధికారులను నియమించే అధికారం కమిటీ చైర్‌పర్సన్‌కు ఇచ్చినట్లు సీజేఐ సూర్యకాంత్‌ తెలిపారు. నోడల్‌ అధికారుల నియామకం పూర్తయిన తర్వాత ఫిర్యాదులు దాఖలు చేసే విధానాన్ని బహిరంగంగా ప్రకటిస్తామని చెప్పారు.

ఐదుగురు సభ్యులతో కమిటీ

జంతర్‌మంతర్‌ ఆందోళనల్లో పోలీసులు, నిరసనకారుల నుంచి చోటుచేసుకున్నట్లు వచ్చిన హింస ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు ఇటీవల ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. పోలీసులు బలప్రయోగం చేశారనే ఆరోపణలతో పాటు నిరసనకారులపై జరిగినట్లు పేర్కొంటున్న లక్ష్యిత హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన, మహిళలపై ఇతర వేధింపులపై కమిటీ విచారణ చేపట్టనుంది. ముఖ్యంగా మహిళా నిరసనకారుల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి.. పోలీసుల బలప్రయోగం, అసభ్య ప్రవర్తన ఆరోపణలపై వీలైనంత త్వరగా మధ్యంతర నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement
Advertisement