త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | కాంగ్రెస్‌ ప్రభుత్వానిది అప్పుడైనా.. ఇప్పుడైనా ద్రోహ చరిత్రే: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్‌

Srinivas Goud | మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట‌లు వింటే అబ‌ద్ధం కూడా ఎల్లంపల్లిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంద‌ని మాజీ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) విమ‌ర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును (Yellampalli Project) తామే నిర్మించామ‌ని గొంతు చించుకొని అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవని మండిప‌డ్డారు.

G

Telangana | Published On Aug 2, 2026, 9.31 am IST

Srinivas Goud | కాంగ్రెస్‌ ప్రభుత్వానిది అప్పుడైనా.. ఇప్పుడైనా ద్రోహ చరిత్రే: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్‌
Advertisement

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్‌: మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట‌లు వింటే అబ‌ద్ధం కూడా ఎల్లంపల్లిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంద‌ని మాజీ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) విమ‌ర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును (Yellampalli Project) తామే నిర్మించామ‌ని గొంతు చించుకొని అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవని మండిప‌డ్డారు. కాంగ్రెస్‌ సర్కారు చెబుతున్న గొప్పలన్నీ ఒట్టి మాటలేన‌ని, ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేద‌న్నారు. ఇప్ప‌టికీ ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకున్నారే తప్ప.. తమ ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలాలు లేవని విమ‌ర్శించారు.

రూ.3 వేల కోట్లు ఖ‌ర్చుచేసినా..

`ఎల్లంపల్లి ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా 2004లో రూ.3,177 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాజెక్టుపై రూ.3,347.27 కోట్లు ఖర్చు చేసినా.. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మొత్తంగా 20.16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌లో తెలంగాణ ఏర్పడే నాటికి ఏనాడూ 5 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయలేదంటే.. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. భూసేకరణ పూర్తి చేయకపోవడం, ముంపు బాధితులకు పునరావాసం కల్పించకపోవడం, అవసరమైన హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడం వంటి కారణాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరో రూ.2,052.73 కోట్లను ఖర్చు చేసి పెండింగ్‌ పనులను పూర్తి చేసింది. చివరకు 2016లో బరాజ్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది. ఈ వాస్తవాలను దాచిపెట్టి.. ఎల్లంపల్లి మేమే కట్టినం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇక ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు విషయానికి వస్తే.. 2007లో రూ.17,875 కోట్లతో జీవో ఇచ్చి, కేవలం 19 నెలల్లోనే ఎలాంటి గణనీయమైన పని చేయకుండానే అంచనా వ్యయాన్ని రూ.38,500 కోట్లకు పెంచారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే నాటికి అంచనా వ్యయం రూ.40,300 కోట్లకు చేరింది. అసలు పని చేయకుండానే అంచనాలు ఎలా పెరిగాయి?.

త‌ట్టెడు మ‌ట్టి తీయకుండానే..

నాలుగేండ్ల‌లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి.. తట్టెడు మట్టి తీయకుండానే పదేళ్ల పాటు సర్వే, మొబిలైజేషన్‌ పేరుతో రూ.2,328 కోట్లు ఖర్చు చేసింది మీ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వమే కాదా?. కాంగ్రెస్‌ ప్రభుత్వానిది అప్పుడైనా.. ఇప్పుడైనా ద్రోహ చరిత్రే. కేసీఆర్ గారు మిషన్ మోడ్ తో ప్రాజెక్టులు పూర్తిచేస్తే, మీరు కమిషన్ మోడ్ తో ప్రాజెక్టులను ఖతం పట్టించారు. మీరే పనులు ప్రారంభించి.. మీరే పడావు పెట్టిన ప్రాణహిత ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడటం అంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఇక ఇప్పుడు కూడా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతామని చెబుతూ 32 నెలలు గడిచినా.. తట్టెడు మట్టి ఎందుకు తీయలేదో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పాలి.

కనీసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కూడా దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్న మీరు.. తెలంగాణ నీటి ప్రయోజనాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మీ తీరు ఎలా ఉందంటే.. కూటిలో రాయలేనోడు ఏట్లో రాయితీస్తాడన్నట్టుగా ఉంది. గాయత్రి పంపుల నుంచి పైకి ఉబికి వస్తున్న గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు కావా?. రాంపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా తరలిస్తున్న జలాలు కాళేశ్వరం జలాలు కావా?. ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరు వరకు నీళ్లు ఎలా వెళ్తున్నాయి?. కాళేశ్వరం వ్యవస్థను వాడుకుంటూ.. కాళేశ్వరం ప్రాజెక్టే లేదన్నట్టుగా మాట్లాడటం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?` అని శ్రీనివాస్ గౌడ్‌ ప్ర‌శ్నించారు.

Advertisement
Advertisement