త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Somashila | సోమశిలలో 1,600 ఎకరాల్లో రిక్రియేషన్‌ హబ్ : మంత్రి జూపల్లి

Somashila | తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

P

Telangana | Published On Jul 7, 2026, 6.20 pm IST

Somashila | సోమశిలలో 1,600 ఎకరాల్లో రిక్రియేషన్‌ హబ్ : మంత్రి జూపల్లి
Advertisement

Somashila | తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యాటక అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని వారసత్వ సంపద, సంస్కృతి, అడవులు, వన్యప్రాణులు, నదులు, జలాశయాలను వినియోగించుకుని ఆకర్షణీయ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. సోమశిలలోని సుమారు 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని వినియోగించుకునేలా సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. పర్యాటక సదుపాయాలు, వసతి కేంద్రాలు, వాటర్‌ఫ్రంట్‌ అనుభవాలు, వెడ్డింగ్‌ డెస్టినేషన్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

గ్రాండ్‌ టూరిజం కార్నివాల్‌

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, కళలను ఒకే వేదికపై ప్రదర్శించేలా గ్రాండ్‌ టూరిజం కార్నివాల్‌ నిర్వహణ ప్రతిపాదనపై సమీక్షించారు. దుబాయిలోని గ్లోబల్‌ విలేజ్‌ తరహా నమూనాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లో సిటీ టూర్‌ బస్సులు, హెరిటేజ్‌ వాక్స్‌, నైట్‌ బజార్లు, సౌండ్‌ అండ్‌ లైట్‌ షోలు, వింటేజ్‌ కార్స్‌ మ్యూజియం ఏర్పాటుపై చర్చించారు. చార్మినార్‌, లాడ్‌బజార్‌, కోటి, పుత్లీబౌలి ప్రాంతాల్లో హెరిటేజ్‌ వాక్స్‌ నిర్వహించాలని సూచించారు. అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లను ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు. చెంచు సంస్కృతి, కాకతీయుల కాలం నాటి ఆలయాలు, ప్రకృతి ఆధారిత పర్యాటకాన్ని కలిపి ప్రత్యేక సర్క్యూట్‌గా తీర్చిదిద్దాలని సూచించారు.

హైదరాబాద్‌లో ఇన్వెస్టర్స్‌ మీట్‌

పర్యాటక రంగంలో పెట్టుబడుల కోసం హైదరాబాద్‌లో ఇన్వెస్టర్స్‌ మీట్‌ నిర్వహించాలని ప్రతిపాదించారు. పర్యాటక ఆస్తులు, అభివృద్ధికి అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యాటక కేంద్రాల్లో పరిశుభ్రత, నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, జిల్లా పర్యాటక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని మంత్రి సూచించారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సమావేశంలో పర్యాటక, భాషా-సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్‌, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ రంజిత్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement