త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Water problems in Telangana | జూలై దాటితే తాగు నీటికీ కటకటే

Water problems in Telangana | సూపర్ ఎల్‌నినో దెబ్బకు తాగునీరు ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోవాల్సిన రోజులు రాబోతున్నాయి. తెలంగాణకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర జలాశయాల్లో ఈపాటికే రావాల్సిన స్థాయిలో జలాశయాల్లోకి నీరు వచ్చి చేరకపోవడంతో.. తెలంగాణ రిజర్వాయర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రానికి సరఫరా చేసే 29 రిజర్వాయర్లన్నింటిలోనూ ఇదే దుస్థితి.

S

Telangana | Published On Jul 7, 2026, 7.30 pm IST

Water problems in Telangana | జూలై దాటితే తాగు నీటికీ కటకటే
Advertisement
  • రిజర్వాయర్లు నిండకపోతే ఆగస్టు నుంచి కష్టాలే
  • వెలవెలబోతున్న కృష్ణ, గోదావరి రిజర్వాయర్లు
  • చుక్క నీరు అంద‌ని శ్రీశైలం, శ్రీరామ్ సాగర్
  • మిషన్ భగీరథ జలాశయాలపై ప్రతి రోజు ఉదయమే సమీక్ష
  • తాగునీటి సమస్య రాకుండా ప్రత్యామ్నాయాల వైపు ప్రభుత్వం దృష్టి

Water problems in Telangana | త్రినేత్ర.న్యూస్ : సూపర్ ఎల్‌నినో దెబ్బకు.. సాగునీటి సంగతి దేవుడెరుగు. కానీ తాగునీరు ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోవాల్సిన రోజులు రాబోతున్నాయి. తెలంగాణకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర జలాశయాల్లో ఈపాటికే రావాల్సిన స్థాయిలో జలాశయాల్లోకి నీరు వచ్చి చేరకపోవడంతో.. తెలంగాణ రిజర్వాయర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రానికి సరఫరా చేసే 29 రిజర్వాయర్లన్నింటిలోనూ ఇదే దుస్థితి. చుక్క నీరు కూడా ఇన్ ఫ్లో లేకపోవడం ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నది.

కనిష్టంగా 50 టీఎంసీలు అవసరం..

దాదాపు 4 కోట్ల వరకు ఉన్న రాష్ట్ర జనాభాలో ఈ ఏడాది తాగునీరు అందించేందుకు 50 టీఎంసీల నీళ్లు అవసరం ఉంటాయి. ఇందుకోసం గోదావరి నదిపై ఉన్న ఎల్లంపల్లి, సింగూరు రిజర్వాయర్లపై, కృష్ణా నదిలో నాగార్జున సాగర్ టెయిల్ ఎండ్ లో ఉన్న అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌పై ఆధారపడతాం. గోదావరి జలాలతో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ , కరీంనగర్, ఖమ్మం, వరంగల్ (ఉమ్మడి జిల్లాలు) జిల్లాలకు, కృష్ణా జలాలతో మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి (ఉమ్మడి జిల్లాలు) జిల్లాలకు తాగునీటి సరఫరా జరుగుతుంది.

ఎగువ నుంచి ప్రవాహమే లేదు

మహారాష్ట్రలో గత 3 రోజులుగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నా.. వాటితో అక్కడి రిజర్వాయర్లు పూర్తిగా నిండే పరిస్థితి లేదు. ఆల్మట్టిలోకి ఇప్పటికీ ఇన్ ఫ్లోలు కరువయ్యాయి. శ్రీరాం సాగర్ వద్ద కూడా దాదాపుగా అదే పరిస్థితి. గత ఏడాది ఇదే సమయానికి తాగునీటిని సరఫరా చేసే జలాశయాల్లోకి వరద మొదలైంది. కానీ ఈ సారి వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో తెలంగాణలో ఉన్న గోదావరి, కృష్ణ రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నాగార్జున సాగర్‌లో మాత్రమే 138 టీఎంసీల నీళ్లు ఉండడం కొంత ఊరటనిస్తున్నది.

అప్రమత్తంగా ఉన్నాం : మంత్రి సీతక్క

ఎలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తనివ్వమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మంగళవారం స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. వర్షాలు ఆలస్యమైనా, వర్షపాతం తగ్గినా, ఎల్‌నినో ప్రభావం ఉన్నా రాష్ట్రంలో ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేస్తున్నామని చెప్పారు. జూలై నెలాఖరు వరకు తగిన నీటి ప్రవాహం లేకపోతే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఉదయసముద్రానికి, తుపాకులగూడెం బ్యారేజ్ నుంచి దుమ్ముగూడెంకు నీటిని విడుదల చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

Advertisement
Advertisement