త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Siddipet Urea Scam | సిద్దిపేటలో 6000 బస్తాల యూరియా మాయం.. ‘యాప్’తో గుట్టురట్టు.. డీలర్లు అరెస్ట్!

సిద్దిపేటలో 6000 యూరియా బస్తాల కుంభకోణం కలకలం రేపుతోంది. యూరియా యాప్ ద్వారా అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం, డీలర్ల అరెస్ట్, అధికార సస్పెన్షన్‌కు ఆదేశించింది.

J

Medak | Published On Jul 1, 2026, 5.23 pm IST

Siddipet Urea Scam | సిద్దిపేటలో 6000 బస్తాల యూరియా మాయం.. ‘యాప్’తో గుట్టురట్టు.. డీలర్లు అరెస్ట్!
Advertisement
  • సిద్దిపేటలో 6 వేల యూరియా బస్తాలు పక్కదారి పట్టిన ఘటనను 'యూరియా యాప్' (Urea App) ద్వారా గుర్తించిన ప్రభుత్వం
  • ఈ స్కామ్‌కు కారణమైన డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్
  • విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక వ్యవసాయ శాఖ అధికారిపై మంత్రి తుమ్మల ఆదేశాలతో సస్పెన్షన్ వేటు
  • రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి తుమ్మల స్పష్టం

Siddipet Urea Scam | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని సిద్దిపేట (Siddipet) జిల్లాలో వెలుగుచూసిన యూరియా బస్తాల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుమారు 6000 యూరియా బస్తాలను డీలర్లు పక్కదారి పట్టించిన ఈ భారీ స్కామ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన 'యూరియా యాప్' (Urea App) ద్వారానే ఈ బాగోతం బయటపడిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

డీలర్ల అరెస్ట్.. అధికారి సస్పెన్షన్

అక్రమాలకు పాల్పడిన ఎరువుల డీలర్లపై వ్యవసాయ శాఖ ఉక్కుపాదం మోపింది. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు (Black market) తరలించిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో పర్యవేక్షణ లోపంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక వ్యవసాయ శాఖ అధికారిని (Agriculture Officer) సైతం సస్పెండ్ చేశామని ఆయన స్పష్టం చేశారు.

సాంకేతికతే పట్టిచ్చింది

"గతంలో ఎరువుల పంపిణీలో జరిగే అక్రమాలు బయటపడేవి కావు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. "ఎరువుల పంపిణీలో నూరు శాతం పారదర్శకత తీసుకురావడానికే మేము 'యూరియా యాప్'ను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. ఈ యాప్ టెక్నాలజీ వల్లనే సిద్దిపేటలో జరిగిన ఈ భారీ కుంభకోణాన్ని మనం ఇట్టే పసిగట్టగలిగాం," అని మంత్రి పేర్కొన్నారు. యాప్ డేటా ఆధారంగా బస్తాలు ఎక్కడికి వెళ్లాయో పక్కాగా లెక్కలు తీయగలిగామన్నారు.

రైతుల జోలికొస్తే దెబ్బ మామూలుగా ఉండదు

రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. యూరియా, ఇతర ఎరువుల పంపిణీలో ఇలాంటి అక్రమాలను ఏమాత్రం సహించబోమని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రైతుల పొట్టగొట్టి అక్రమ దందాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని మంత్రి తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement