త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sumathi | కాళ్లు, పొట్టకు హషీష్ ఆయిల్ ప్యాకెట్లు కట్టుకున్నారు.. ఎత్తుగ‌డ‌లు వేసి చిక్కిపోయారు

CP Sumathi | కాళ్లు, పొట్ట‌కు హ‌షీష్ ఆయిల్ ప్యాకెట్లు క‌ట్టుకుని ర‌వాణా చేస్తున్న వారి ఆట క‌ట్టించామ‌ని మ‌ల్కాజిగిరి పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌డుగుల సుమ‌తి తెలిపారు. ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా త‌ప్పించుకోలేర‌న్నారు. మ‌త్తు మాఫియా మూలాల‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలిస్తామ‌ని హెచ్చరించారు.

S

Telangana | Published On Aug 17, 2026, 4.00 pm IST

CP Sumathi | కాళ్లు, పొట్టకు హషీష్ ఆయిల్ ప్యాకెట్లు కట్టుకున్నారు.. ఎత్తుగ‌డ‌లు వేసి చిక్కిపోయారు
Advertisement
  • మ‌త్తు మాఫియా మూలాల‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలిస్తాం
  • ఎక్క‌డ ఉన్నా గుర్తిస్తాం.. ఎంత దూరంలో ఉన్నా వెంటాడుతాం
  • మీడియా స‌మావేశంలో మ‌ల్కాజిగిరి సీపీ బ‌డుగుల సుమ‌తి వార్నింగ్‌

CP Sumathi | త్రినేత్ర‌.న్యూస్: కాళ్లు, పొట్ట‌కు హ‌షీష్ ఆయిల్ ప్యాకెట్లు క‌ట్టుకుని ర‌వాణా చేస్తున్న వారి ఆట క‌ట్టించామ‌ని మ‌ల్కాజిగిరి పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌డుగుల సుమ‌తి తెలిపారు. ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా త‌ప్పించుకోలేర‌న్నారు. మ‌త్తు మాఫియా మూలాల‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలిస్తామ‌ని హెచ్చరించారు. మ‌త్తు ప‌దార్థాలను స‌ర‌ఫ‌రా చేస్తున్న అంత‌ర్రాష్ట్ర ముఠాను గుట్టు ర‌ట్టు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఎస్‌వోటీ ఎల్‌బీ న‌గ‌ర్‌, వ‌న‌స్థ‌లిపురం పోలీసులు సంయుక్త ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్న‌ట్లు చెప్పారు. ఎల్‌బీనగర్ క్యాంపు కార్యాలయంలో సోమ‌వారం ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

మత్తుపదార్థాల సరఫరా మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నాం. అంతర్రాష్ట్ర హషీష్ ఆయిల్ సరఫరా ముఠాను గుట్టు ర‌ట్టు చేశాం. ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు హషీష్ ఆయిల్ తరలిస్తుండగా ప‌క్కా స‌మాచారంతో చింతల్‌కుంట-వనస్థలిపురం వద్ద పోలీసులు మెరుపుదాడి చేసి ప‌ట్టుకున్నారు. నిందితుల వ‌ద్ద రూ.1.50 కోట్ల విలువైన 12 కిలోల హషీష్ ఆయిల్ ల‌భ్య‌మైంది. కాళ్ల‌కు, పొట్ట‌కు ఒక్కొక్కరు 3 కిలోల చొప్పున క‌ట్టుకొని హ‌షీష్ ఆయిల్ తరలిస్తున్నారు. హషీష్ ఆయిల్‌తో పాటు 5 మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నాం.

నిరుద్యోగ యువ‌త‌కు డ‌బ్బు ఆశ చూపి..

నిరుద్యోగ గిరిజన యువతకు డబ్బు ఆశ చూపి క్యారియర్లుగా వినియోగించినట్లు గుర్తించాం. హషీష్ ఆయిల్‌ను బెంగళూరుకు చేర్చేందుకు రూ.10 లక్షల ఒప్పందం చేసుకున్నారు. ప‌రారీలో ఉన్న‌ ప్రధాన సరఫరాదారు కృష్ణ, బెంగళూరు రిసీవర్ సిజో కోసం గాలిస్తున్నాం. త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటాం.

మత్తు మాఫియా మూలాల వరకు వెళ్లి మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదిస్తాం. డ్రగ్స్ దందాతో యువత జీవితాలను నాశనం చేస్తే సహించేది లేదు. ఎన్ని ఎత్తుగడలు వేసినా పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరు. ఎక్కడ ఉన్నా గుర్తిస్తాం.. ఎంత దూరంలో ఉన్నా వెంటాడుతాం. మ‌త్తు వ్యాపారుల విషయంలో రాజీ అనే మాటకు తావులేదు. మత్తు మాఫియా ఎంతటి బలమైనదైనా చట్టం కంటే బలమైనది కాదు. మత్తు రహిత సమాజమే మల్కాజిగిరి పోలీసుల లక్ష్యం. డ్రగ్స్‌పై సమాచారం ఉంటే పోలీసులకు అందించాలి అని సీపీ సుమ‌తి విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement