త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao Press Meet | 19 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టి.. పెంచిచ్చామంటారా? సీఎం రేవంత్‌పై హరీశ్ రావు నిప్పులు

కేసీఆర్ తెచ్చిన రైతు బీమాను ఆపేసి 13 లక్షల మందికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని, రైతుబంధులో వేల కోట్లు ఎగ్గొట్టి సీఎం అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

J

Hyderabad | Published On Aug 17, 2026, 6.53 pm IST

Harish Rao Press Meet | 19 వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టి.. పెంచిచ్చామంటారా? సీఎం రేవంత్‌పై హరీశ్ రావు నిప్పులు
Advertisement
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ చేసిన పోరాటం వల్లే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాలు వాయిదా పడ్డాయన్న హరీశ్ రావు
  • కేసీఆర్ తెచ్చిన పాత రైతు బీమాను నిలిపివేయడంతో ఏకంగా 13 లక్షల మంది రైతులు బీమాకు దూరం అవుతున్నారని ఆవేదన
  • రూ.2 వేలు పెంచి రైతుబంధు ఇచ్చామంటున్న సీఎం రేవంత్.. ప్రభుత్వ సభల్లో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శలు
  • కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ. 19 వేల కోట్ల రైతు బంధు నిధులను రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిందంటూ లెక్కలతో సహా వివరణ

Harish Rao Press Meet | త్రినేత్ర.న్యూస్ : రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సొమ్ముతో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుబంధు, రైతు బీమా పథకాలతో పాటు రాష్ట్ర జల హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా చిట్ చాట్‌లో కాంగ్రెస్ సర్కార్ తీరుపై హరీశ్ రావు లెక్కలతో సహా విరుచుకుపడ్డారు.

మా దెబ్బకే బోర్డుల మీటింగ్‌లు వాయిదా..

రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని హరీశ్ రావు విమర్శించారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎంత అలర్ట్‌గా ఉందో ఆగస్టు 5న తెలంగాణ భవన్‌లో తాను పెట్టిన మీడియా సమావేశం ద్వారా స్పష్టమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం, ఆ దెబ్బకే నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (KRMB, GRMB) సమావేశాలు వాయిదా పడ్డాయని ఆయన గుర్తు చేశారు. అయితే, కేవలం సమావేశాలు వాయిదా పడితే సరిపోదని.. ఆ మీటింగ్ ఎజెండా నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 ప్రాజెక్టుల అంశాన్ని కచ్చితంగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతు బీమా బంద్.. 13 లక్షల మందికి ద్రోహం

నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన 'రైతు బీమా' పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్రంలో 42.15 లక్షల మందికి భరోసా ఇచ్చిందని హరీశ్ రావు గుర్తుచేశారు. కానీ, ఆగస్టు 13 నుంచి ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసిందన్నారు. కేసీఆర్ తెచ్చిన మంచి పథకాలను ఒక్కొక్కటిగా ఎత్తివేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.

"కొత్తగా తెచ్చే స్కీమ్ వల్ల ఏకంగా 13 లక్షల మంది రైతులు బీమాకు దూరం అవుతున్నారు. ప్రభుత్వాలు మారినా పాత పథకాలను కొనసాగించాలన్న కనీస ఇంగితం వీరికి లేదు. గతంలో వైఎస్సార్ ఫీజు రియంబర్స్మెంట్ కింద 19 వేల కోట్ల బకాయిలు పెట్టిపోతే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మేమే చెల్లించాం. అదే తరహాలో పాత రైతు బీమా పథకాన్నే యథాతథంగా కొనసాగించాలి." అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

రైతుబంధులో భారీ కోత.. పచ్చి అబద్ధాలు

రైతుబంధు సాయాన్ని మరో రూ.2 వేలు పెంచి ఇచ్చానని సీఎం రేవంత్ పదేపదే చెబుతున్న మాటలు పూర్తిగా అబద్ధమని హరీశ్ రావు కొట్టిపారేశారు. లెక్కలు తీస్తే 2022-2023 ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ రూ. 14,743 కోట్లు ఇస్తే.. రేవంత్ సర్కార్ 2024-2025కి ఇచ్చింది కేవలం రూ. 5,057 కోట్లు మాత్రమేనని ఆయన ఆధారాలతో సహా వివరించారు.

అంటే సుమారు రూ. 13 వేల కోట్ల రూపాయలను రైతుల నోట్లో మట్టికొట్టి ఎగ్గొట్టారని ఆయన విమర్శించారు. అలాగే 2025 సంవత్సరానికి మరో రూ. 11,800 కోట్లు కలిపి, దాదాపు 19 వేల కోట్ల రూపాయల రైతు బంధును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. "ఇవ్వాల్సినవి ఎగ్గొట్టి, పెంచి ఇచ్చానని డబ్బాలు కొట్టుకుంటూ అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రికి తగునా?" అని హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు.

Advertisement
Advertisement