త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Section 22A Lands | గందరగోళంలో సామాన్యులు.. చలాన్లు కట్టాక రిజిస్ట్రేషన్లు బంద్

సెక్షన్ 22A తో కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులను పీడిస్తోందని, 30% కమీషన్ల కోసమే ఆస్తులను నిషేధిత జాబితాలో పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

J

Hyderabad | Published On Aug 17, 2026, 6.42 pm IST

Telangana Section 22A Lands | గందరగోళంలో సామాన్యులు.. చలాన్లు కట్టాక రిజిస్ట్రేషన్లు బంద్
Advertisement
  • కాంగ్రెస్ సర్కార్ సెక్షన్ 22A పేరుతో అడ్డగోలుగా ప్రాపర్టీలను నిషేధిత జాబితాలో పెడుతోందని హరీశ్ రావు ధ్వజం
  • రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ ఇస్తేనే 22A నుంచి ఆస్తుల తొలగింపు జరుగుతోందని సంచలన ఆరోపణ
  • సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉండటంతోనే రివ్యూల డ్రామా ఆడుతున్నారని విమర్శ
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని భూములు 22A లో పెట్టారో తక్షణమే 'వైట్ పేపర్' (శ్వేతపత్రం) విడుదల చేయాలని డిమాండ్

Telangana Section 22A Lands | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా చిట్ చాట్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ సెక్షన్ 22A (ప్రొహిబిటెడ్ ల్యాండ్స్) పేరుతో సామాన్య ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోందని, ఇదొక "30 పర్సెంట్ కమీషన్ల ప్రభుత్వం"గా మారిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఎవరి భూమి 22A లో ఉందో.. ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 1999లో, ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారని ఆయన గుర్తుచేశారు. ఆనాడు క్లియర్ అయిన భూములను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ 22A ప్రొహిబిషన్ లిస్ట్‌లో పెట్టడం ఏ రకమైన న్యాయం అని ప్రశ్నించారు.

"తీరా రిజిస్ట్రేషన్ కోసం చలాన్లు కట్టి, డబ్బులు చెల్లించిన తర్వాత.. చివర్లో మీ భూమి 22A లో ఉందని చెప్పి రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారు. పైగా కట్టిన చలాన్ డబ్బులు కూడా వాపస్ ఇవ్వకుండా ప్రజల సొమ్మును నిలువునా దోచుకుంటున్నారు," అని ఆయన మండిపడ్డారు.

అధికారుల పనితీరుకు ప్రభుత్వ ఆస్తులే నిదర్శనం

ఈ ప్రభుత్వానికి పాలనపై కనీస అవగాహన లేదనడానికి ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రభుత్వ ఆస్తులను సైతం 22A నిషేధిత జాబితాలో పెట్టడమే నిదర్శనమన్నారు. శ్రీనగర్ కాలనీలో గత 20 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లు, బంజారాహిల్స్ సొసైటీ లాంటి ప్రాంతాల్లోని ఆస్తులు, 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను కూడా నిషేధిత జాబితాలో పెడితే సామాన్యులు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు.

కమీషన్లు ఇస్తేనే ఫైల్ కదులుతోంది.. సీఎం ఇంటికీ తప్పని సెగ

రెవెన్యూ శాఖలో ఏ పని కావాలన్నా, భూమిని 22A నుంచి బయటకు తీయాలన్నా 30 శాతం కమీషన్ ఇవ్వాలనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమని హరీశ్ రావు ఆరోపించారు.

"చివరకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా 22A ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉందంటే ఆశ్చర్యం కలుగుతోంది. తన సొంత ఇంటికి సెగ తగిలే సరికి ప్రభుత్వంలో హడావిడి మొదలైంది. తప్పు జరిగినప్పుడు తక్షణమే ఆ భూములను 22A నుంచి తొలగించాలి కానీ.. ఈ రివ్యూల పేరుతో డ్రామాలు ఆడటం ఎందుకు? ఇదంతా కమీషన్ల కోసమేనా?" అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

వైట్ పేపర్ రిలీజ్ చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి ఎన్ని లక్షల ఎకరాల భూములను 22A లిస్ట్‌లో పెట్టారో వెంటనే వైట్ పేపర్ (శ్వేతపత్రం) విడుదల చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అప్పటిలోగా ఈ ఆస్తులన్నింటినీ 22A పరిధి నుంచి మినహాయించాలని, దీనిపై తక్షణమే విచారణ జరగాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement