త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Sravan Dasoju | అన్నలు రికార్డ్ స్పీడ్‌తో డ్యామ్‌లు కడుతుంటే.. మీరు రెండు పిల్లర్ల దగ్గర పాలిటిక్స్ చేస్తున్నారు

అన్నలు డ్యామ్‌లు కడుతుంటే.. మీరు రెండు పిల్లర్ల దగ్గర పాలిటిక్స్ చేస్తున్నారా? సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు.

J

Telangana | Published On Jul 8, 2026, 10.00 pm IST

BRS Sravan Dasoju | అన్నలు రికార్డ్ స్పీడ్‌తో డ్యామ్‌లు కడుతుంటే.. మీరు రెండు పిల్లర్ల దగ్గర పాలిటిక్స్ చేస్తున్నారు

సంక్షిప్త సారాంశం

కర్ణాటక, ఏపీ సీఎంలను చూసి ప్రాజెక్టుల నిర్మాణం నేర్చుకోవాలని సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ హితవు పలికారు. తుంగభద్ర క్రెస్ట్ గేట్లను, పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను పొరుగు రాష్ట్రాల సీఎంలు రికార్డు సమయంలో పునర్నిర్మించారని ప్రశంసించారు. మేడిగడ్డలో దెబ్బతిన్న 2-3 పిల్లర్లను బాగుచేయకుండా.. కేవలం కేసీఆర్‌పై బురద చల్లేందుకే రైతుల గొంతు కోస్తున్నారని విమర్శించారు. వెంటనే రాజకీయాలు పక్కనపెట్టి రిపేర్లు చేయకపోతే రైతులు తిరగబడతారని ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

BRS Sravan Dasoju | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసి, కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టైమ్ పాస్ చేస్తున్నారని బీఆర్‌ఎస్ (BRS) సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పిల్లర్ల రిపేర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. పక్క రాష్ట్రాల సీఎంల వద్ద క్లాసులు వినడమే తప్ప.. రేవంత్ రెడ్డి చేతల్లో 'హోమ్‌వర్క్' మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు.

అన్నల స్పీడ్ చూసైనా నేర్చుకోరా?

ఇటీవల జూన్ 2026లో కర్ణాటకలోని హోస్‌పేట్‌లో జరిగిన తుంగభద్ర డ్యామ్ (Tungabhadra Dam) 33 క్రెస్ట్ గేట్ల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌ను ప్రస్తావించిన శ్రవణ్.. రేవంత్‌కు చురకలంటించారు. "మీరు 'అన్నలు' అని పిలుచుకునే చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్ కొట్టుకుపోయిన డ్యామ్‌లను రికార్డ్ స్పీడ్‌లో కడుతుంటే.. మీరు మాత్రం మేడిగడ్డ దగ్గర రెండు పిల్లర్ల చుట్టూ చిల్లర పాలిటిక్స్ చేస్తున్నారు. ఏకంగా తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొడుతున్నారు" అని మండిపడ్డారు.

పొరుగు రాష్ట్రాల సీఎంల వర్కింగ్ స్టైల్‌ను శ్రవణ్ ఉదాహరణలుగా చెప్పారు

కన్నడ అన్న డీకే శివకుమార్: తుంగభద్ర డ్యామ్‌కు చెందిన 19వ నంబర్ గేటు కొట్టుకుపోతే.. ఆయన కేవలం దానికి మాత్రమే ప్యాచ్ వర్క్ (Patch work) చేసి వదిలేయలేదు. డ్యామ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మొత్తం 33 గేట్లను రూ.51 కోట్లతో రికార్డు టైమ్‌లో మార్చేశారు.

మరో అన్న చంద్రబాబు నాయుడు: ఆగస్టు 2020 వరదల్లో ఏపీలోని పోలవరం (Polavaram) డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే.. గత ప్రభుత్వంపై ఏడుస్తూ కాలక్షేపం చేయలేదు. వెంటనే రంగంలోకి దిగి సుమారు వెయ్యి కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన (War footing) పూర్తి చేశారు.

కేవలం ఆ రెండు పిల్లర్ల కోసమే

మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 86 పిల్లర్లు ఉంటే, అందులో దెబ్బతిన్నవి కేవలం 2-3 పిల్లర్లు (20, 21, 22) మాత్రమేనని శ్రవణ్ క్లారిటీ ఇచ్చారు. పక్క రాష్ట్రాల సీఎంలను అన్నలు, తమ్ముళ్లు అని పిలుచుకోవడంలో ఉన్న ఉత్సాహం.. వారిలాగా మన బ్యారేజీని రిపేర్ చేయాలనే ఆలోచనలో ఎందుకు లేదని నిలదీశారు. కేవలం మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) బురద జల్లాలన్న ఒకే ఒక్క దురుద్దేశంతో, ఆ బ్యారేజీని పడావు పెట్టి తెలంగాణ రైతాంగం గొంతు కోస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు.

రైతులు తిరగబడకముందే మేల్కోండి

ఇప్పటికైనా మీటింగ్స్‌కు వెళ్లి ఫొటోలు దిగడం మానుకుని, ఆ 'అన్నల' వర్కింగ్ స్పీడ్‌లో కనీసం 10 శాతమైనా నేర్చుకోవాలని శ్రవణ్ హితవు పలికారు. "మీరు కేసీఆర్ గారి సలహా ఎలాగూ వినరు.. కనీసం మీ బూతు మాటల పంచాంగాన్ని ఆపి, పక్క రాష్ట్రాల సీఎంలను చూసైనా పనులు ఎలా చేయాలో నేర్చుకోండి. లేదంటే తెలంగాణ రైతాంగం తిరగబడటం ఖాయం.. జాగ్రత్త!" అంటూ దాసోజు శ్రవణ్ పదునైన వ్యాఖ్యలతో హెచ్చరించారు.

Advertisement
Advertisement