త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేశ్ ఉత్స‌వ స‌మితితో స‌జ్జ‌నార్ కీల‌క స‌మావేశం.. వినాయ‌కుడి విగ్ర‌హాల ఎత్తుపై సూచ‌న‌లు..!

CP Sajjanar | రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. గణేశ్ విగ్రహాల ఎత్తు విషయంలో తయారీ దశ నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

P

Telangana | Published On Jul 8, 2026, 9.30 pm IST

CP Sajjanar | భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేశ్ ఉత్స‌వ స‌మితితో స‌జ్జ‌నార్ కీల‌క స‌మావేశం.. వినాయ‌కుడి విగ్ర‌హాల ఎత్తుపై సూచ‌న‌లు..!
Advertisement

CP Sajjanar | రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. గణేశ్ విగ్రహాల ఎత్తు విషయంలో తయారీ దశ నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీలో బుధవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సీపీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై చర్చించారు. గతంలో విగ్రహాల ఎత్తు కారణంగా జరిగిన ప్రమాదాలను సీపీ గుర్తుచేశారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎత్తైన విగ్రహం విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, అలాగే పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద ఎత్తు కారణంగా ఓ విగ్రహం ఇరుక్కుపోయిన ఘటన జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ముందస్తు రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

నగర వీధుల్లో సాధారణంగా విద్యుత్ తీగలు 22 అడుగుల ఎత్తులో ఉంటాయని, ఊరేగింపులో ఉపయోగించే ట్రాలీ ఎత్తు దాదాపు 4 అడుగుల వరకు ఉంటుందని సీపీ వివరించారు. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ తీగలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 15 అడుగుల లోపు ఎత్తులోనే గణేష్ విగ్రహాలను తయారు చేయించుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు సంబంధించిన నిబంధనలపై ప్రతి మండప నిర్వాహకుడికి అవగాహన కల్పించే బాధ్యతను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీసుకోవాలని కోరారు. విగ్రహాల తయారీదారులతో ముందుగానే చర్చించి ఎత్తు పరిమితులను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఊరేగింపు సమయంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు అడ్డువస్తే.. మండపాల సభ్యులు కర్రలు, ప్లాస్టిక్ పైపులతో వాటిని పైకి లేపే ప్రయత్నాలు చేయడం వల్ల గతంలో ప్రమాదాలు జరిగాయని సీపీ పేర్కొన్నారు. ఈ ఏడాది అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

"పండుగకు కొద్దిరోజుల ముందు సమావేశాలు నిర్వహిస్తే అప్పటికే విగ్రహాల తయారీ పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఎత్తులో మార్పులు చేయడం కష్టమవుతుంది. అందుకే విగ్రహాల తయారీ ప్రాథమిక దశలోనే ముందస్తు జాగ్రత్తలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాం" అని సీపీ తెలిపారు. ప్రజల ప్రాణరక్షణే అత్యంత ముఖ్యమని, వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. మరోవైపు, పండుగ నిర్వహణకు సంబంధించి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు చేసిన పలు సూచనలపై సీపీ సానుకూలంగా స్పందించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు సీపీ (సౌత్ రేంజ్) తఫ్షీర్ ఇక్బాల్, అదనపు డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) నర్సింహారావు, భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు రాఘవరెడ్డి, శశిధర్, కరోడిమల్, రామరాజు, మహేందర్, బుచ్చిరెడ్డి, రమేష్, వైకుంఠం, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement