త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tungabhadra Dam Gates | మైసూరు రాజులు సైతం రైతుల కోసం యుద్ధాలు పక్కన పెట్టారు.. ఇక మనమెంత?

కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్డీఎస్ జలాలపై ఆయన ఏమన్నారంటే?

J

Telangana | Published On Jun 25, 2026, 7.15 pm IST

Tungabhadra Dam Gates | మైసూరు రాజులు సైతం రైతుల కోసం యుద్ధాలు పక్కన పెట్టారు.. ఇక మనమెంత?
Advertisement

Tungabhadra Dam Gates | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటకలోని హోస్‌పేట్ (Hospet) వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్ వే గేట్ల (Spillway gates) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అనంతరం మునిరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు, తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న నీటి సమస్యలపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారాయి.

మూడు తరాల కష్టాలకు చెక్

"ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇది కేవలం 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం మాత్రమే కాదు.. మూడు తరాలుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించే చారిత్రక ఘట్టం" అని సీఎం రేవంత్ అభివర్ణించారు. ఈ గేట్ల పునరుద్ధరణతో లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదే వేదికపై ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil) చొరవతో మూడు రాష్ట్రాల మధ్య ఉన్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తాను నమ్ముతున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు.

CM Revanth Reddy on Tungabhadra Dam and RDS Water Dispute Solution

ఆర్డీఎస్ (RDS) నీళ్ల పంచాయితీ.. ఆ 10 టీఎంసీలు ఎటు?

సభలో ప్రధానంగా రాజోలిబండ డైవర్షన్ స్కీం (RDS) ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం ప్రస్తావించారు. "గద్వాల, అలంపూర్, ఉమ్మడి పాలమూరు జిల్లాల పరిధిలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు 17.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ, గ్రౌండ్ లెవెల్‌లో మా రైతాంగం కేవలం 5 నుంచి 6 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నారు. దాదాపు 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు" అని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

CM Revanth Reddy on Tungabhadra Dam and RDS Water Dispute Solution

దీనికి తోడు తుంగభద్ర డ్యామ్‌లో భారీగా మట్టి పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పడిపోతోందని, ఈ సమస్యతో పాటు నీటి కేటాయింపుల వివాదాన్ని నేరుగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

పంచాయితీ వద్దు.. పరిష్కారమే కావాలి

జల వివాదాలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్ కుండబద్దలు కొట్టారు. "నాకు పంచాయితీలు పెట్టుకోవడం ఇష్టం లేదు.. సమస్యకు పరిష్కారం కావాలి. రాజకీయాలకు అతీతంగా తుంగభద్ర నదీ ఒడ్డున జరిగిన చర్చలు ఒక గొప్ప నిర్ణయంగా మారబోతున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాదాలకు ఇది శాశ్వత పరిష్కారం చూపుతుందని బలంగా నమ్ముతున్నా" అని ఆయన అన్నారు.

CM Revanth Reddy on Tungabhadra Dam and RDS Water Dispute Solution

గతంలో మైసూరు రాజులు సైతం రైతుల కోసం యుద్ధాలను పక్కనబెట్టి పరిష్కారం కోసం ముందుకొచ్చారని సీఎం గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో రైతుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ త్వరలోనే ఈ జల వివాదాలకు ఓ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నానని, అందుకు తుంగభద్ర వేదికగా జరిగిన ఈ సమావేశంతో తొలి అడుగు పడిందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement