త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FPO | ఎఫ్‌పీఓలకు ప్రభుత్వ ప్రాధాన్యం.. కొనుగోలు కేంద్రాలు, లైసెన్సుల మంజూరుకు కొత్త మార్గదర్శకాలు

FPO | రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పీఓలు) మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), ధర మద్దతు పథకం (పీఎస్‌ఎస్) కింద ఏర్పాటు చేసే పంటల కొనుగోలు కేంద్రాల కేటాయింపులో అర్హత కలిగిన ఎఫ్‌పీఓలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.

P

Telangana | Published On Jul 8, 2026, 9.45 pm IST

FPO | ఎఫ్‌పీఓలకు ప్రభుత్వ ప్రాధాన్యం.. కొనుగోలు కేంద్రాలు, లైసెన్సుల మంజూరుకు కొత్త మార్గదర్శకాలు
Advertisement

FPO | రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పీఓలు) మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), ధర మద్దతు పథకం (పీఎస్‌ఎస్) కింద ఏర్పాటు చేసే పంటల కొనుగోలు కేంద్రాల కేటాయింపులో అర్హత కలిగిన ఎఫ్‌పీఓలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ పేరుతో విడుదలైన ఉత్తర్వుల ప్రకారం.. మౌలిక సదుపాయాలు, ఆర్థిక సామర్థ్యం, శిక్షణ పొందిన సిబ్బంది, పారదర్శక నిర్వహణ ఉన్న ఎఫ్‌పీఓలను జిల్లా కలెక్టర్లు గుర్తించి కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్, జీసీసీ వంటి సంస్థలతో పాటు అర్హత కలిగిన ఎఫ్‌పీఓలను కూడా భాగస్వాములుగా చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల విక్రయాలకు అవసరమైన లైసెన్సుల కోసం ఎఫ్‌పీఓలు సమర్పించే దరఖాస్తులను జిల్లా వ్యవసాయ అధికారులు ప్రాధాన్యంతో పరిశీలించి త్వరితగతిన మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఐఎఫ్‌ఎఫ్‌సీవో యూరియా, గ్రీన్ మ్యాన్యూర్ తదితర వ్యవసాయ ఇన్‌పుట్ల పంపిణీలోనూ ఎఫ్‌పీఓలకు ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల అమలును సమర్థంగా పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. రైతులే భాగస్వాములుగా ఉండే ఎఫ్‌పీఓలను బలోపేతం చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు ప్రభుత్వ సేవలు, వ్యవసాయ ఇన్‌పుట్స్ రైతులకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement