త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | రేవంత్ తెలంగాణ తడి లేని పొడి మనిషి.. పాలమూరుకు ఆయ‌న‌ ఇచ్చిన బహుమతి మళ్లీ వలసలే

Niranjan Reddy | రేవంత్ రెడ్డి తెలంగాణ తడి లేని పొడి మనిషని.. ఒక భ‌ట్టి విక్ర‌మార్క‌నేమో స‌మైక్య‌వాది అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. పైగా సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. డిండి కోసం 40 టీఎంసీల నీటికి సీఎం రేవంత్‌ అనుమ‌తులు తేవాల‌న్నారు.

S

Telangana | Published On Jul 16, 2026, 2.59 pm IST

Niranjan Reddy | రేవంత్ తెలంగాణ తడి లేని పొడి మనిషి.. పాలమూరుకు ఆయ‌న‌ ఇచ్చిన బహుమతి మళ్లీ వలసలే
Advertisement
  • ఇంకా సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నరు
  • ఇరిగేషన్‌లో భట్టికి ఓనమాలు తెలియదు
  • కృష్ణా నుంచి 588 టీఎంసీల నీళ్లు తెలంగాణ‌కు ఇవ్వాలి
  • డిండి కోసం 40 టీఎంసీలకు రేవంత్‌ అనుమ‌తులు తేవాలి
  • మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి డిమాండ్‌

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రేవంత్ రెడ్డి తెలంగాణ తడి లేని పొడి మనిషని.. ఒక భ‌ట్టి విక్ర‌మార్క‌నేమో స‌మైక్య‌వాది అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. పైగా సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. డిండి కోసం 40 టీఎంసీల నీటికి సీఎం రేవంత్‌ అనుమ‌తులు తేవాల‌న్నారు. కృష్ణాలో 588 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాల‌ని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు రెండు తరాల జీవితాలను కోల్పోయిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం రావాల్సిన నీళ్లు పాలమూరుకు రాలేదని గుర్తు చేశారు. మళ్లీ వలసలు పోవడమే రేవంత్ రెడ్డి పాలమూరుకు ఇచ్చే బహుమానం అని ఎద్దేవా చేశారు. గురువారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాల‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

160 ఎకరాల భూ సేకరణ మిగిలి ఉంది..

కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సోర్స్ గా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఎంచుకుని కేవలం ఎనిమిది నెలల్లో ఎస్టిమేట్స్ పూర్తి చేశారు. 2015, జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగకుండా కాంగ్రెస్ పార్టీ భూసేకరణకు అడ్డుతగిలింది. అయినా రైతులను ఒప్పించి 27 వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. మిగిలింది 160 ఎకరాలు మాత్రమే. అడ్డంకులను అధిగమించి 90 శాతం పనులను పూర్తి చేశాం. భూసేకరణ మొత్తం పూర్తయినా, రిజర్వాయర్లు సిద్దంగా ఉన్నా భూసేకరణ కానిది రిజర్వాయర్లు ఎలా నింపాలి అంటూ రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. జరిగిన పనులు రైతాంగానికి, ప్రజలకు తెలియదు అన్న భ్రమలో రేవంత్ ఉన్నాడు. ఇది అహంకారమా ? అపరిపక్వతా ? బాధ్యతారాహిత్యమా ? అజ్ఞానమా? అని నిరంజ‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు.

భీమా, కోయిల్‌సాగర్ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ కలిసి 26 ఏళ్లలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.2,600 కోట్లు ఖర్చు పెట్టారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు ఇచ్చారు. కృష్ణా నుంచి 588 టీఎంసీల నీళ్లు తెలంగాణ‌కు ఇవ్వాలి. తాగునీరుతో కలుపుకుంటే 600 టీఎంసీల నీళ్లు అవసరం.

రేవంత్‌కు, కాంగ్రెస్ క‌ళ్లు క‌నిపిస్త‌లేవ్‌..

రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు భజన మాటలు మాట్లాడుతున్నారు. రెండున్నరేళ్లు పాలమూరు, రంగారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయలేదు. ఐదు రిజర్వాయర్లు నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ కట్టాం. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదు. ఇరిగేషన్ లో భట్టికి ఓనమాలు తెలియదు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ వాళ్లు అనేక అవాంతరాలు కల్పించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంది అని ఆయ‌న మ‌రోసారి పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ముందు నిన్న మాట్లాడిన విద్యార్థిని ఆ బాలికే..

రేవంత్ రెడ్డి పాలమూరుకు చేసింది శూన్యం. కాంగ్రెస్ పార్టీ టెన్ జన్ పథ్‌ నుంచి నిధులు ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను చులకన చేసి మాట్లాడారు. మున్సిపల్ మంత్రిగా హోం మంత్రిగా రేవంత్ ఫెయిల్ అయ్యారు. కేసీఆర్ హయాంలో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు గురుకులాలు, మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కకాశాలలు కేసీఆర్ హయాంలోనే అడిగినన్ని వచ్చాయి. రేవంత్ రెడ్డి ముందు నిన్న మాట్లాడిన విద్యార్థిని కేసీఆర్ స్థాపించిన గురుకులంలో చదువుకున్న బాలికే అని నిరంజ‌న్‌రెడ్డి గుర్తు చేశారు.

కేసీఆర్ హయాంలోనే బ్రేక్‌ఫాస్ట్ పథకం మొదలైంది. మన ఊరు మనబడి ద్వారా స్కూళ్లు బాగుపడితే ఆ బిల్లులు రేవంత్ రెడ్డి కక్షతో చెల్లించడం లేదు. 27 వేల ప్రభుత్వ స్కూళ్లను 4 వేలకు తగ్గిస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి కాదా? విద్యా మంత్రిగా రేవంత్ చేసే ప్రసంగాలు విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసంగాలు ఉండాలి. ఇకనైనా తన భాషను మార్చుకోవాలి. దుర్భాషలాడి విద్యార్థులకు నీతులు చెబితే లాభం లేదు.

తెలంగాణ ఉద్యమంలో పాలమూరు ఆకలిచావులు, అంబలికేంద్రాలు, వలసలు, స్థితిగతులు, కరువు, పేదరికం, విధ్వంసం కథావస్తువుగా మారింది. కేసీఆర్ పాలనలో ప్రారంభించిన నార్లాపూర్ పంపును మళ్లీ ప్రారంభించారు. దాన్ని 34 నెలలుగా పక్కనపెట్టి తిరిగి ప్రారంభించి రేవంత్ రెడ్డి వచ్చాక అక్కడ పనులు ప్రారంభించినట్లు చిత్రీకరిస్తున్నారు.

హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామక్రిష్ణారావు హయాంలో 174 టీఎంసీ సామర్ధ్యంతో తలపెట్టిన ప్రాజెక్టులను సమైక్య రాష్ట్రం ఏర్పడిన వెంటనే నీలం సంజీవరెడ్డి పాలనలో రద్దు చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మూలంగా 20 టీఎంసీల నుండి 18 టీఎంసీలని 11 టీఎంసీలకు కుదించి ఆరున్నర టీఎంసీల జూరాల, నిజాం పాలనలోని ఆర్డీఎస్ ద్వారా 80 వెల ఎకరాలకు సాగునీరు మాత్రమే దక్కింది. రెండున్నరేళ్లు పాలమూరు వైపు కన్నెత్తి చూడడానికి రేవంత్ రెడ్డికి సమయం చిక్కలేదు. 74 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కు పాలమూరు వెళ్లడానికి సమయం చిక్కలేదు. తెలంగాణ భవన్ నుండి అనేక సార్లు నిలదీస్తే రేవంత్ రెడ్డి రెండు రోజులు పర్యటించి, మొక్కుబడి సమీక్ష చేశారు. కానీ ఏ పని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

బీఆర్ఎస్ హయాంలోనే 68 టీఎంసీల సామర్ధ్యం ఉన్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు నిర్మించాం. ఈ రిజర్వాయర్ల దూరం 75 కిలోమీటర్లు. 11.5 మీటర్ల వ్యాసార్ధం ఉన్న 120 కిలోమీటర్ల టన్నెళ్లను నిర్మించాం. 63 కిలోమీటర్ల ఓపెన్ కెనాళ్లను పూర్తి చేసి, 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 34 పంపులను బిగించడం జరిగింది. 145 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న పంపులను ఉపయోగించడం ప్రపంచంలోనే మొదటిసారి. వీటిని చూడడానికి విదేశీ నిపుణులు వచ్చివెళ్లారు. నాలుగు పంపింగ్ స్టేషన్ల వద్ద నాలుగు 400 కేవీ విద్యుత్ కేంద్రాలు నిర్మించాం. 250 కిలోమీటర్ల టవర్ లైన్ల నిర్మాణం పూర్తి చేశాం అని మాజీ మంత్రి సింగిరెడ్డి గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ దీని నిర్మాణం అడ్డుకునేందుకు అనేక కోర్టులు, ట్రిబ్యునళ్లలో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో నిర్మించిన భూగర్బ పంపింగ్ కేంద్రాలను చూసి అంతర్జాతీయ జల నిపుణులు ప్రశంసించారు. ప్రజల జీవితాాల్లో మార్పు రావాలన్న లక్ష్యంతో పనిచేశాం తప్పితే ప్రచారం కోసం కాదు.
120 టీఎంసీల కోసం పాలమూరుకు ఇది వరకే జీవోలు విడుదల చేయడం జరిగింది.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం కాంగ్రెస్ కనీసం 5 లేదా రూ.600 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది. కన్నెపల్లి నుండి పంపులు ప్రారంభించవచ్చని సామాన్యులు చెబుతున్నా కాళేశ్వరం మీద కక్షతో అక్కడ రైతులు అలమటించేలా చేస్తున్నారు. ఇక్కడ గత రెండున్నరేళ్లలో పనులు చేసి ఉంటే ఈ కరువులో రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేది. పాలమూరు కాల్వ‌ల టెండర్లు రద్దు చేసి రేవంత్ రెడ్డి కొడంగల్ ఎత్తిపోతల చేపట్టాడు. దాంతో పాటు ఇక్కడ ఒక రూ.600 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఐదు రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది.

మేం తిరిగిందే కాలువలు, చెరువులు, నీళ్లు, బడుల వెంటనే..

హైదరాబాద్ నుండి మీడియా మిత్రులను తీసుకెళ్లి మంత్రి జూపల్లి క్రిష్ణారావు పాలమూరు పనులను చూయించాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ కేసీఆర్ పాలనలో ఏం చేయలేదు అని చెబుతున్నాడు. పాలమూరు బిడ్డను అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఎందుకు పడావు పెట్టాడోె రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇంటి పేరు నీళ్లు అని పెట్టుకున్నాయన ఎప్పుడైనా మీ బడికి వచ్చాడా ? అని రేవంత్ రెడ్డి నిన్న కొత్తకోట పర్యటనలో విద్యార్థులను అడిగాడు. మేం తిరిగిందే కాలువలు, చెరువులు, నీళ్లు, బడుల వెంటనే. దానికి మాకు ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.

వ్యవసాయ అధికారుల ఆవశ్యకత ఉంటుందని రూ.107 కోట్లతో పాలెంలో వ్యవసాయ కళాశాలను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సభలో కేసీఆర్‌కు వివరించి ప్రకటింపచేశాం. పీజీ సెంటర్ వచ్చింది.
వనపర్తిలో అగ్రికల్చర్, కొల్లాపూర్ లో హార్టి కల్చర్ కళాశాల, నారాయణపేటకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలు ఇచ్చాం. పాలమూరులో రూ.450 కోట్లతో మెడికల్ కళాశాల మొదటి దశలో, తర్వాత అన్ని జిల్లా కేంద్రాలలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు, ఎస్సీ గురుకులాల డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మత్స్య కళాశాలలు తీసుకువచ్చాం. కేసీఆర్ హయాంలో ప్రవీణ్ కుమార్ నేత్రుత్వంలో విద్యార్థులు హిమాలయాలు అధిరోహించారు.

మనఊరు - మనబడి పథకం కింద రూ.7 వేల కోట్లతో భవనాలు నిర్మిస్తే కక్షగట్టి ఈ ప్రభుత్వం వాటి బిల్లులు ఇవ్వడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల ప్రారంభానికి వెళ్లి మీ న్యూరో బ్రాంచ్‌ను కూడా నేనే ప్రారంభించాలి అని చెప్పాడు. అనవసర భేషజాలకు పోవొద్దు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీల్లు ఇవ్వాలి. పాలమూరు పనులు పూర్తి చేసి రిజర్వాయర్లు నింపాలి.

ఈ మీడియా సమావేశంలో శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్, బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement