త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP | రైతు స‌మ‌స్య‌ల‌ను కాంగ్రెస్ స‌ర్కారు నిర్ల‌క్ష్యం చేస్తోంది : రామ‌చంద‌ర్‌రావు

BJP | రైతుల సమస్యలను కాంగ్రెస్ స‌ర్కారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్‌రావు విమ‌ర్శించారు. ఏప్రిల్ నెలలోనే బీజేపీ నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వాన్ని హెచ్చరించారని తెలిపారు.

P

Telangana | Published On Jun 9, 2026, 3.24 pm IST

BJP | రైతు స‌మ‌స్య‌ల‌ను కాంగ్రెస్ స‌ర్కారు నిర్ల‌క్ష్యం చేస్తోంది : రామ‌చంద‌ర్‌రావు
Advertisement

BJP | రైతుల సమస్యలను కాంగ్రెస్ స‌ర్కారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్‌రావు విమ‌ర్శించారు. ఏప్రిల్ నెలలోనే బీజేపీ నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వాన్ని హెచ్చరించారని తెలిపారు. అయినా ప్రభుత్వం సమయానికి స్పందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ “చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం” అని హామీ ఇచ్చిందని, కానీ నేడు ఆ హామీని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన రీయింబర్స్‌మెంట్‌లు, గోదాం ఛార్జీలు, రవాణా ఖర్చులు సహా ఇతర వ్యయాలను కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకునే ప్రయత్నం చేయడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు.

ఆ ప్రాజెక్టుల విష‌యంలో స‌హ‌కార దృక్ప‌థంతోనే..

ఎంఎంటీఎస్‌, మెట్రో ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సహకార దృక్పథంతోనే వ్యవహరించిందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పలు కీలక అంశాలపై ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్, రిజర్వేషన్లు వంటి అంశాల్లో ఈ రెండు పార్టీలు ఒకే వైఖరిని అవలంబించాయన్నారు. తెలంగాణలో బీజేపీ బలం రోజురోజుకూ పెరుగుతుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భయపడుతున్నాయని, అందుకే ప్రజల ముందు వేరువేరుగా కనిపించినా బీజేపీని ఎదుర్కొనే విషయంలో ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. సాధారణ కుటుంబం నుంచి, ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదగడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. దేశాన్ని ఒకే కుటుంబం మాత్రమే పాలించాలనే మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని, భారతీయ జనతా పార్టీ మాత్రం దేశసేవే పరమ లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

మోదీ నాయ‌క‌త్వంలో దేశం అభివృద్ధి వైపు..

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సుశాసనం, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ప్రజల సేవ కోసం కాకుండా, కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చేశారనే భావన ప్రజల్లో రోజురోజుకూ బలపడుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తరచుగా బీజేపీ నాయకులు తెలంగాణకు ఏమి చేశారని ప్రశ్నిస్తున్నారని, గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురాలేదని, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలను చెల్లించలేదని, రైతు భరోసాను సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు అందడం లేదని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవని, రాష్ట్రంలో పెట్టుబడులు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీపై విమర్శలు చేయడం తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసింది ఏంట‌ని నిల‌దీశారు.

Advertisement
Advertisement