త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sircilla | ప్రత్యామ్నాయ పంటలతో నిరంతర ఆదాయం : క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్‌

Sircilla | ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.

P

Telangana | Published On Sep 1, 2026, 8.15 pm IST

Sircilla | ప్రత్యామ్నాయ పంటలతో నిరంతర ఆదాయం : క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్‌
Advertisement

Sircilla | ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో కంకణాల రమేష్‌, కంకణాల రాజు సాగు చేస్తున్న కూరగాయల తోటలను మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. దాదాపు నాలుగు ఎకరాల్లో బీరకాయ, టమాట, మిర్చి, సొరకాయ, బంతి పూలను సాగు చేస్తున్న రైతులను అభినందించారు. ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రమేష్‌ సుమారు 2.5 ఎకరాల్లో బీరకాయ, సొరకాయ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం బీరకాయ పంట చేతికి వచ్చింది. సాగు విధానం, సస్యరక్షణ చర్యలు, దిగుబడి, విక్రయాలు, ఆదాయంపై కలెక్టర్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వరికి బదులుగా కూరగాయలు

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో సంప్రదాయంగా వరి సాగు చేయడం కంటే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చని కలెక్టర్‌ తెలిపారు. వివిధ రకాల కూరగాయలను సాగు చేయడం వల్ల ఒకే పంటపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని, వాతావరణం, నీటి సమస్యలను కొంతమేర అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఇతర రైతులు కూడా తమకున్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని సూచించారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖల ద్వారా అందుతున్న ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విభిన్న పంటలు.. క్రమంతప్పని ఆదాయం

రైతు కంకణాల రాజు రెండు ఎకరాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారు. మల్చింగ్‌ విధానంలో బీరకాయను ప్రధాన పంటగా తీసుకుని అంతరపంటగా టమాట, మిర్చిని సాగు చేస్తున్నారు. సొరకాయ, బంతి పూలను కూడా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం బీరకాయ దిగుబడి ప్రారంభం కాగా, మరికొద్ది రోజుల్లో టమాట పంట చేతికి రానుంది. మిర్చి, బంతి పూల దిగుబడి బతుకమ్మ, దసరా పండుగల నాటికి వచ్చే అవకాశం ఉంది. బీరకాయ తోటలో నాటిన 45 రోజులకే దిగుబడి ప్రారంభమవుతుందని, సుమారు 45 రోజుల నుంచి రెండు నెలల వరకు పంట వస్తుందని రాజు తెలిపారు. అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని వివరించారు.

పాంపాండ్‌తో భూగర్భ జలాల పెరుగుద‌ల‌..

రాజు గత ఏడాది తన పొలంలో గుంట స్థలంలో పాంపాండ్‌ నిర్మించారు. వర్షాకాలంలో అందులో నీరు నిల్వ ఉండటంతో బోరులో నీటి లభ్యత పెరిగిందని తెలిపారు. కూరగాయలు, పూల సాగుకు అవసరమైన నీటిని డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా అందిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ సాగునీటికి ఇబ్బంది లేకుండా పాంపాండ్‌ ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. పాంపాండ్‌లో కొర్రమీను, రవ్వ చేప పిల్లలను వదిలి సహజ పద్ధతిలో పెంచుతున్నారు. ఆరు నెలలకు ఒకసారి చేపలను పట్టి విక్రయించడం ద్వారా సుమారు రూ.40 వేల వరకు అదనపు ఆదాయం వస్తుందని రాజు తెలిపారు. పర్యటనలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement