త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ న‌మోదు అప్ర‌జాస్వామికం

Ponnam Prabhakar | లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం అప్ర‌జాస్వామికం అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మండిప‌డ్డారు.

S

Telangana | Published On Sep 1, 2026, 7.33 pm IST

Ponnam Prabhakar | రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ న‌మోదు అప్ర‌జాస్వామికం
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం అప్ర‌జాస్వామికం అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మండిప‌డ్డారు. రాహుల్ గాంధీపై న‌మోదైన ఎఫ్ఐఆర్‌కి నిరసనగా కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ నిర్వ‌హించింది. ఈ ర్యాలీలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వీహెచ్, ఖైర‌తాబాద్ డీసీసీ అధ్య‌క్షుడు మోత రోహిత్‌తో పాటు ఇత‌ర ముఖ్య నేత‌లు పాల్గొన్నారు. ర్యాలీ అనంత‌రం అంబేద్క‌ర్ విగ్ర‌హం ముందు బైఠాయించి కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. మనువాద సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నాలను అడ్డుకుంటాం. మల్లికార్జున ఖర్గే మాట్లాడిన వేదికను శుద్ధి చేయడం దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు తలవంపులు తెచ్చే చర్య. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఖర్గేను అవమానించే విధంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండిస్తున్న. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినప్పటికీ కుల వివక్ష, అంటరానితనం, మనువాద భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కొందరు వ్యవహరించడం బాధాకరం అని పొన్నం ప్ర‌భాక‌ర్ మండిప‌డ్డారు.

ప్రశ్నిస్తే రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా..?

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించింది. అలాంటి రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రాజ్యాంగం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రశ్నిస్తే రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా..? రాహుల్ గాంధీపై పెట్టిన కేసులను తీవ్రంగా ఖండిస్తున్నాం.కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా నిలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులు మరింత బలంగా పోరాడతాయి అని పొన్నం స్ప‌ష్టం చేశారు.

నరేంద్ర మోదీ తానాశాహీ నడవదు.. నడవదు..

దేశంలో కుల వివక్షను, మనువాద భావజాలాన్ని తిరిగి తీసుకురావడానికి జరిగే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకుంటాం. మల్లికార్జున ఖర్గే మాట్లాడిన ప్రదేశాన్ని శుద్ధి చేసిన ఘటనకు సంబంధించి బాధ్యులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం తగిన చర్యలు తీసుకోవాలి అని పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్ చేశారు. చివ‌ర‌గా నరేంద్ర మోదీ తానాశాహీ నడవదు.. నడవదు.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. జై భీమ్.. జై రాజ్యాంగం.. జై కాంగ్రెస్ అని నిన‌దించారు.

Advertisement
Advertisement