త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

YTPS | యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువ‌చ్చిన రైలు..!

YTPS | యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌)కు నైనీ బొగ్గు గని నుంచి తొలి రేక్‌ చేరుకుంది. ఒడిశాలోని నైనీ గని నుంచి సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) సేకరించిన అధిక ఉష్ణ సామర్థ్యం (హై క్యాలరిఫిక్‌ వాల్యూ) కలిగిన సుమారు 4,000 టన్నుల బొగ్గుతో కూడిన రేక్‌ మంగళవారం ప్లాంట్‌కు చేరింది.

P

Telangana | Published On Sep 1, 2026, 6.43 pm IST

YTPS | యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువ‌చ్చిన రైలు..!
Advertisement

YTPS | యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌)కు నైనీ బొగ్గు గని నుంచి తొలి రేక్‌ చేరుకుంది. ఒడిశాలోని నైనీ గని నుంచి సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) సేకరించిన అధిక ఉష్ణ సామర్థ్యం (హై క్యాలరిఫిక్‌ వాల్యూ) కలిగిన సుమారు 4,000 టన్నుల బొగ్గుతో కూడిన రేక్‌ మంగళవారం ప్లాంట్‌కు చేరింది. దీంతో యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో విద్యుదుత్పత్తికి ఇంధన లభ్యత మరింత మెరుగుపడనుంది. తొలి బొగ్గు రేక్‌కు టీజీజెన్‌కో డైరెక్టర్‌ (కోల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌) బీ నాగ్య, డైరెక్టర్‌ (థర్మల్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌) వై రాజశేఖర్‌రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమంలో చీఫ్‌ ఇంజినీర్లు శ్రీనివాసరావు, సురేష్‌, సూర్యనారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మెరుగుప‌డ‌నున్న బాయిల‌ర్ల ప‌నితీరు

నైనీ బ్లాక్‌ నుంచి సరఫరా అవుతున్న బొగ్గు అధిక నాణ్యత కలిగి ఉండటంతో థర్మల్‌ ప్లాంట్‌ బాయిలర్ల పనితీరు మెరుగుపడనుంది. బొగ్గులో అధిక ఉష్ణ సామర్థ్యం ఉండటంతో తక్కువ పరిమాణంలోనే ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అలాగే బూడిద సమస్య తగ్గడంతో పాటు ప్లాంట్‌ సామర్థ్య వినియోగం పెరగనుంది. ఒడిశా నుంచి సుమారు 1,050 కిలోమీటర్ల దూరం బొగ్గును రవాణా చేయాల్సి ఉన్నప్పటికీ.. నాణ్యత, ఉష్ణ సామర్థ్యం దృష్ట్యా రవాణా వ్యయం సమర్థనీయమేనని అధికారులు చెబుతున్నారు.

భట్టి చొరవతో సమన్వయం

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేక చొరవతో టీజీజెన్‌కో, సింగరేణి, భారతీయ రైల్వేల మధ్య సమన్వయం సాధ్యమైందని అధికారులు తెలిపారు. నైనీ గని నుంచి యాదాద్రి ప్లాంట్‌కు బొగ్గు రవాణా ప్రక్రియను సమర్థంగా నిర్వహించడంతో తొలి రేక్‌ ప్లాంట్‌కు చేరిందన్నారు. రానున్న రోజుల్లో నైనీ గని నుంచి బొగ్గు రేకులు నిరంతరాయంగా రానున్నాయి. దీంతో వైటీపీఎస్‌లో తగినంత బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండి, రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడనుంది. రాష్ట్రానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరాకు నైనీ బొగ్గు రవాణా కీలకంగా మారనుంది.

Advertisement
Advertisement