త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు

Minister Ponnam | ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రవాణా శాఖ, టీజీఎస్‌ఆర్టీసీ సాధించిన ప్రగతిని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించామని తెలిపారు.

P

Telangana | Published On Sep 1, 2026, 6.11 pm IST

Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు
Advertisement
  • ఉచిత ప్రయాణంతో మహిళలకు రూ.12,167 కోట్ల ఆదా..
  • 2,932 కొత్త బస్సుల కొనుగోలు
  • ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Minister Ponnam | ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రవాణా శాఖ, టీజీఎస్‌ఆర్టీసీ సాధించిన ప్రగతిని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇప్పటివరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా.. రూ.12,167 కోట్లు ఆదా చేసుకున్నారని చెప్పారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఉచిత బస్సు ప్రయాణం దోహదపడుతోందని, మహిళలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేస్తున్నామని తెలిపారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున ఈఎంఐ చెల్లిస్తున్నామని, ఇందుకోసం నెలకు రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.29.31 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.

పెరిగిన ఆక్యుపెన్సీ

ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో 67 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ ప్రస్తుతం 89 శాతానికి పెరిగిందన్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులు, కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటివరకు 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని, అందులో 1,024 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో మరో 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయని చెప్పారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద నగరంలో ఈవీ బస్సులను నడుపుతున్నట్లు వివరించారు.

ఉద్యోగాల భర్తీ

ఆర్టీసీలో 4,538 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి తెలిపారు. ఇందులో 1,000 డ్రైవర్‌, 743 శ్రామిక పోస్టుల నియామకాలు పూర్తయ్యాయని, వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు. మరో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. నియామకాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలీసు శాఖ ద్వారా పారదర్శకంగా ప్రక్రియ చేపట్టామని తెలిపారు. కారుణ్య నియామకాల కింద 1,424 మందికి ఉద్యోగాలు కల్పించామని, సర్వీసు నుంచి తొలగించబడిన దాదాపు 244 మంది ఉద్యోగులను ప్రత్యేక ఐఏఎస్ కమిటీ ద్వారా తిరిగి విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు.

కార్మికులకు రెండు పీఆర్సీలు

ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు ఇచ్చామని, ఐదు డీఏలు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పెండింగ్ డీఏలు లేవన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల మంగళవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తున్నామని, అనంతరం ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. తార్నాక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అభివృద్ధి చేశామని, బస్‌స్టేషన్ల ఆధునికీకరణ చేపడుతున్నామని తెలిపారు. పెద్దపల్లి, ఏటూరునాగారం డిపోలను ఏర్పాటు చేశామని చెప్పారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో బస్‌స్టేషన్లను ఆధునికీకరించడంతో పాటు ప్రత్యేక బస్సులు నడుపుతామని, మేడారం జాతరకు విజయవంతంగా బస్సులు నడిపామని పేర్కొన్నారు.

తగ్గిన బకాయిలు

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. సీసీఎస్‌ బకాయిలను రూ.1,096 కోట్ల నుంచి రూ.939 కోట్లకు తగ్గించామని, పీఎఫ్‌ బకాయిలను రూ.2,108 కోట్ల నుంచి రూ.1,710 కోట్లకు తగ్గించినట్లు చెప్పారు. ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ బకాయిలను రూ.513 కోట్ల నుంచి రూ.485 కోట్లకు తగ్గించామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో 370 కొత్త రూట్లు

ఎంఎంటీఎస్‌, మెట్రో, ఆర్టీసీ సమన్వయంతో చివరి మైలు వరకు కనెక్టివిటీ కల్పిస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో 370 కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నామని, గ్రామాల్లోనూ బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు కొత్త సర్వీసులు అందిస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రానిక్ పేమెంట్ టికెటింగ్ మిషన్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నామని, బస్సుల్లో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.

రవాణా శాఖలో కొత్త విధానాలు

తెలంగాణలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామని, దాదాపు రూ.1,400 కోట్ల పన్ను మినహాయింపు కల్పించామని మంత్రి చెప్పారు. 240 డీజిల్ బస్సులను రిట్రోఫిట్ చేస్తున్నామని, హైదరాబాద్‌లో ఆటోలను రిట్రోఫిట్ చేసుకునేందుకు రూ.1.50 లక్షల వరకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. వాహన్‌, సారథి సేవలను తీసుకొచ్చామని, స్క్రాప్ పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు. గత పదేళ్లుగా వాహన్‌-సారథి వ్యవస్థలో చేరని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఉండగా.. ముఖ్యమంత్రి సూచనలతో అందులో చేరామని తెలిపారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. రవాణాశాఖలో 113 మంది ఏఎంవీఐలు, 50 మంది కానిస్టేబుళ్లు, 20 మంది జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు ఎంవీఐలను నియమించామని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రమాదాల సమయంలో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రిలో చేర్చేందుకు ‘రహవీర్’ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

‘టీఎస్‌’ నుంచి ‘టీజీ’కి మార్పు

రవాణా శాఖలో చెక్‌పోస్టులను ఎత్తివేసి వేధింపులకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. జిల్లాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను పెంచామని చెప్పారు. రాష్ట్ర వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను ‘టీఎస్‌’ నుంచి ‘టీజీ’గా మార్చామని తెలిపారు. ఆర్టీసీ దేశంలో ఉన్నత స్థానంలో ఉందంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్ల కృషే కారణమని మంత్రి కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి సహకారంతో ఆర్టీసీకి అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు మంజూరవుతున్నాయని చెప్పారు. సిబ్బంది కృషి, అధికారుల పనితీరుతో ఆర్టీసీని దేశంలో నంబర్‌-1గా తీర్చిదిద్దుతామని పొన్నం ప్రభాకర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement