త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajamahendravaram | ప్రాణం పోతుంటే.. పట్టించుకునేవారేరీ?

Rajamahendravaram | ఒకవైపు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం.. మరోవైపు తమకు అండగా నిలిచే వారి కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు. రాజమహేంద్రవరంలోని మాల్‌ వద్ద జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక (28) పరిస్థితి విషమంగా ఉండగా.. ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

P

Telangana | Published On Aug 8, 2026, 10.22 pm IST

Rajamahendravaram | ప్రాణం పోతుంటే.. పట్టించుకునేవారేరీ?
Advertisement
  • మృత్యువుతో పోరాడుతున్న ప్రియాంక
  • పరిస్థితి విషమం.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల స్పందన శూన్యం
  • రాజమహేంద్రవరం ఘటనపై బంధువుల ఆవేదన
  • రెండు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు
  • నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్‌

Rajamahendravaram | ఒకవైపు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం.. మరోవైపు తమకు అండగా నిలిచే వారి కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు. రాజమహేంద్రవరంలోని మాల్‌ వద్ద జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక (28) పరిస్థితి విషమంగా ఉండగా.. ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బంధువులు.. రెండు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. విషయం మీడియాలో విస్తృతంగా వస్తున్నా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి తమకు కనీస భరోసా లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని వాపోతున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా కల్పించాల్సిన సమయంలో ఇరు రాష్ట్రాలూ మౌనం వహించడం బాధాకరమని పేర్కొంటున్నారు.

వైద్యం ఖర్చు భారమైనా.. భరోసా కరువు..

ప్రియాంక ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో చికిత్సకు భారీగా ఖర్చవుతోందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఆర్థిక సహాయం అందించేందుకు గానీ, మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకునేందుకు గానీ ఎవరూ ముందుకు రాలేదని వాపోతున్నారు. ‘మా అమ్మాయి పరిస్థితి ఇలా ఉంటే ఒక్క అధికారి కూడా వచ్చి పరామర్శించలేదు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కూడా ఎవరూ చెప్పలేదు’ అని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం తీరుపైనా వారు ప్రశ్నలు సంధిస్తున్నారు. నిబంధనలు, వైద్యపరమైన ప్రక్రియల పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు చేశారు. ప్రియాంకకు సాధ్యమైనంత మెరుగైన వైద్యం అందించడమే ప్రస్తుతానికి తమ ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దర్యాప్తులో జాప్యం.. రాజకీయ పలుకుబడే కారణమా?

ఈ ఘటనలో నిందితులు రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందినవారనే కారణంతోనే కేసు దర్యాప్తులో జాప్యం జరిగిందని ప్రియాంక బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుల్లో ఒకరు టీడీపీ, మరొకరు జనసేన నాయకుల కుమారులని చెబుతూ.. ఈ రాజకీయ నేపథ్యం కారణంగానే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు వెనుకడుగు వేశారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారుకు సంబంధించిన నంబర్‌ ప్లేట్లను తొలగించినట్లు చెబుతున్నప్పటికీ, ఆధారాల పరిరక్షణ విషయంలో పోలీసులు మరింత వేగంగా స్పందించాల్సి ఉందని బంధువులు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రదేశంలోని భద్రతా ఏర్పాట్లు, మాల్‌ యాజమాన్యం వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.

సాధారణ ప్రమాదం కాదు..

మద్యం మత్తులో ఉన్న యువకులు అత్యంత వేగంగా కారును నడిపి ప్రియాంకను ఢీకొట్టారని.. ఆ తర్వాత ఆమెపై నుంచి వాహనం వెళ్లిందని బంధువులు చెబుతున్నారు. ఇంతటి తీవ్రత ఉన్న ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా పరిగణించకూడదని అంటున్నారు. ‘మద్యం మత్తులో వాహనం నడిపి ఒకరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారు. ప్రియాంక ఇప్పటికీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. అయినా కేసు విషయంలో ఎందుకింత జాప్యం?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గద్వాల జిల్లా అయినా.. ఏపీతో అనుబంధం..

ప్రియాంక తండ్రి స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామం. సుమారు 30 ఏళ్ల కిందట ఉపాధి కోసం ఆయన కర్నూలులో స్థిరపడ్డారు. ప్రస్తుతం కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది. ప్రియాంక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌తోనూ అనుబంధం ఉందని బంధువులు పేర్కొంటున్నారు. బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో ప్రభుత్వాలు కనీస స్పందన లేకుండా ఉండటం సరికాదని వారు పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రియాంక కుటుంబానికి ఆర్థిక, న్యాయపరమైన అండగా నిలువాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రియాంకకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే ఆందోళనకు దిగుతామని బంధువులు, కుటుంబీకులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement
Advertisement