త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sringeri Jagadguru Shankaracharya | అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో శ్రీ చక్ర మహా యంత్ర స్థిర ప్రతిష్ట

Sringeri Jagadguru Shankaracharya | అలంపూర్ జోగులాంబ శ‌క్తిపీఠంలో శ్రీ‌చ‌క్ర స్థిర ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మాన్ని గురువారం వైభ‌వోపేతంగా నిర్వ‌హించారు. శృంగేరి ఆచార్యుల అఖండ గురుపరంపరను అనుసరిస్తూ అమ్మవారి గర్భగృహంలో శ్రీచక్ర మహాయంత్ర స్థిర ప్రతిష్ఠను వైదిక పద్ధతిలో చేప‌ట్టారు.

S

Telangana | Published On Jul 2, 2026, 3.14 pm IST

Sringeri Jagadguru Shankaracharya | అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో శ్రీ చక్ర మహా యంత్ర స్థిర ప్రతిష్ట
Advertisement
  • శ్రీ చక్ర మహా యంత్రాన్ని ప్ర‌తిష్ఠిస్తున్న శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి

త్రినేత్ర‌.న్యూస్‌: అలంపూర్ జోగులాంబ శ‌క్తిపీఠంలోశ్రీ చక్ర మహా యంత్ర స్థిర ప్రతిష్ట కార్య‌క్ర‌మాన్ని గురువారం వైభ‌వోపేతంగా నిర్వ‌హించారు. శృంగేరి ఆచార్యుల అఖండ గురుపరంపరను అనుసరిస్తూ అమ్మవారి గర్భగృహంలో శ్రీచక్ర మహాయంత్ర స్థిర ప్రతిష్ఠను వైదిక పద్ధతిలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు హాజ‌రయ్యారు. అంతకుముందు రోజు అలంపూర్ చేరుకున్న స్వామివారికి మంగళవాద్యాలు, వేదఘోషల మధ్య ఘనస్వాగతం పలికి, శక్తిపీఠానికి తీసుకువచ్చారు. ఈ సంద‌ర్భంగా శృంగేరి జగద్గురు గర్భగృహంలో రత్నన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.

అమ్మవారిని దర్శించి పూజలు సమర్పించారు. అనంతరం అప్పటివరకు జరిగిన వైదిక కర్మలను పరిశీలించి, యాగశాలను, కర్మమండపాలను, ప్రతిష్ఠించబోయే శ్రీచక్రాన్ని పరిశీలించారు. త‌ర్వాత శ్రీ చంద్రమౌళీశ్వర పూజను నిర్వహించారు. ప్రతిష్ఠకు ముందు శృంగేరి శారదాపీఠానికి చెందిన ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన‌ వైదిక క్రతువులు, జపాలు, హోమాలు, ఇతర పూర్వకర్మలను సంపూర్ణంగా నిర్వహించారు. శృంగేరి జగద్గురు మహాస్వామివారు శక్తిపీఠ గర్భగృహంలో శ్రీచక్ర మహా యంత్ర స్థిర ప్రతిష్ఠను నిర్వహించారు.

దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలన్నింటికి అపారమైన ఆధ్యాత్మిక మహిమ ఉంది. తెలంగాణలోని ఏకైక శక్తిపీఠంగా వెలుగొందుతున్న అలంపూర్ శ్రీ జోగులాంబ శక్తిపీఠం తుంగభద్రా నది తీరాన వెలసిన శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంతో కలిసి విశిష్ట పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. స్థల పురాణ వైభవం, శాస్త్రోక్త ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాచీన క్షేత్రం, శ్రీశైల మహాక్షేత్రానికి నాలుగు ద్వారాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది.

జోగులాంబ ఆలయ సంప్రదాయం ప్రకారం సుమారు 12 శతాబ్దాల క్రితం జగద్గురు ఆది శంకరాచార్యులు దేశమంతా సనాతన ధర్మ పునరుద్ధరణ యాత్ర చేప‌ట్టారు. ఇందులో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి, జోగులాంబ అమ్మవారిని ఆరాధించారు. అమ్మవారు ఉగ్ర స్వరూపంలో దర్శనమివ్వ‌డంతో ఆమె శాంతమయంగా వెలిసేలా ఆది శంకరాచార్యులు అమ్మవారి సన్నిధిలో శ్రీచక్ర మహా యంత్రాన్ని ప్రతిష్ఠించారు.

ఈ ఆలయం ఏడో శతాబ్దంలో బాదామి చాళుక్యుల పాలనలో, ముఖ్యంగా విక్రమాదిత్యుని కాలంలో అభివృద్ధి చెందింది. 14వ‌ శతాబ్దంలో బహమనీ సుల్తానుల దండయాత్రల వల్ల దెబ్బ‌తిన‌డంతో విజయనగర సామ్రాజ్యాధిపతి హరిహరరాయల‌ ద్వితీయుడు మరింత విధ్వంసం కాకుండా చూశారు. ఆ స‌మ‌యంలో అమ్మవారి విగ్రహాన్ని ఇంకో ప్రదేశంలో ప్ర‌తిష్ఠించి శతాబ్దాల పాటు పూజించారు. కాల‌క్ర‌మంలో మూలస్థానంలోనే పునర్నిర్మించి అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించారు.

జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించిన మొదటి, సార్వభౌమ పీఠమైన దక్షిణామ్నాయ శారదాపీఠం, శృంగేరికి అలంపూర్ జోగులాంబ క్షేత్రంతో శతాబ్దాలుగా అవినాభావ సంబంధం ఉంది. ఆలయ పునర్నిర్మాణం అనంతరం పూజా విధానాలు, ఆగమ సంప్రదాయాలు, ఆలయ నిర్వహణ త‌దిత‌ర విష‌యాల్లో శృంగేరి శారదాపీఠం ఎప్ప‌టిక‌ప్పుడు సూచ‌న‌లు ఇస్తూ వ‌స్తోంది. శృంగేరి పరంపరలో అనేక పీఠాధిపతులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. ప్రస్తుత చరిత్ర ప్రకారం శృంగేరి పీఠం 35వ జగద్గురువులు 1960, 1965 సంవత్సరాలలో అలంపూర్‌ను సందర్శించారు.

ప్రస్తుత జగద్గురు దక్షిణామ్నాయ శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు 1989లో ఈ క్షేత్రాన్ని దర్శించారు. వారి అనుగ్రహంతో 2018లో శృంగేరి శారదాపీఠ ఉత్తరాధికారిగా ఉన్న జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఈ శక్తిపీఠాన్ని సందర్శించారు. గ‌త మార్చి నెలలో జరిగిన విజయయాత్ర సందర్భంగా మరోసారి సందర్శించి ప్రత్యేక పూజలు చేప‌ట్టారు.

ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో ఆలయ సిబ్బంది, కార్యనిర్వహణ అధికారులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement