త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | 5 వేల పోస్టుల‌కు కాదు.. 19 వేల పోస్టుల‌కు ఒకేసారి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాలి.. హ‌రీశ్‌రావు డిమాండ్

Harish Rao | ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసింది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Jun 11, 2026, 12.47 pm IST

Harish Rao | 5 వేల పోస్టుల‌కు కాదు.. 19 వేల పోస్టుల‌కు ఒకేసారి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాలి.. హ‌రీశ్‌రావు డిమాండ్
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసింది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో 19 వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా తెలంగాణ డీజీపీ చెబుతుండగా, కేవలం 5 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం నిరుద్యోగులను వంచించడమే. తక్షణమే ఖాళీగా ఉన్న మొత్తం 19 వేల పోలీసు పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. కేవలం 5 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, అందులో దాదాపు 2 వేల పోస్టులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధికే పరిమితమవుతాయి. మిగిలిన పోస్టుల్లో గ్రామీణ ప్రాంతాలకు, రిజర్వేషన్ల ప్రకారం అనేక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దక్కని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో గ్రామీణ యువత తీవ్రంగా నష్టపోతుంది అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎస్సై పోస్టుల‌కు 38 ఏళ్ల గ‌రిష్ట వ‌యోప‌రిమితిని పునరుద్ధ‌రించాలి..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకేసారి 16 వేల, 17 వేల పోస్టుల చొప్పున భారీ నోటిఫికేషన్లు విడుదల చేసి, పోలీసు శాఖలోనే దాదాపు 48 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గత రెండున్నర సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో లక్షలాది మంది యువత వయోపరిమితి దాటిపోయి ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిన వయోపరిమితిని వెంటనే రద్దు చేసి, బీఆర్ఎస్ హయాంలో ఉన్న విధంగానే కానిస్టేబుల్ పోస్టులకు 36 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

మూడింటికీ తప్పనిసరిగా అర్హత సాధించాలనే నిబంధన విధించడం అన్యాయం

పోలీసు నియామకాల ఈవెంట్ల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను అనవసరంగా కఠినతరం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు ఈవెంట్లలో మూడు ఈవెంట్లకు అర్హత సాధిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు లాంగ్ జంప్, షాట్‌పుట్‌లలో ప్రమాణాలను పెంచి మూడు ఈవెంట్లలో మూడింటికీ తప్పనిసరిగా అర్హత సాధించాలనే నిబంధన విధించడం అన్యాయం. వెంటనే పాత విధానాన్నే కొనసాగించాల‌న్నారు.

అప్లికేషన్ ఫీజు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలి

ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ దరఖాస్తులకు ఎలాంటి ఫీజులు ఉండవని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వేల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ నిరుద్యోగులపై అదనపు భారం మోపుతోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అప్లికేషన్ ఫీజు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలి. దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్ వంటి ప్రాంతాల్లో వేలాది మంది అభ్యర్థులు పోలీసు నియామకాల కోసం సిద్ధమవుతున్నప్పటికీ, ఈవెంట్ల ప్రాక్టీస్‌కు సరిపడా గ్రౌండ్లు అందుబాటులో లేవు. ప్రభుత్వం ప్రతిరోజూ కొంత సమయం పాటు సమీపంలోని పోలీసు లేదా ప్రభుత్వ క్రీడా మైదానాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాల‌ని హ‌రీశ్‌రావు సూచించారు.

బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోలీసు పోస్టులతో పాటు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసే వరకు బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుంద‌ని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement