త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 గురువారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతోపాటు, ఇటీవల వరుసగా పడిపోయిన మార్కెట్లలో షార్ట్ కవరింగ్ జరగడం కూడా సూచీలకు మద్దతుగా నిలిచింది. సెన్సెక్స్ 628 పాయింట్లు (0.82 శాతం) లాభపడి 77,537.72 వద్ద ముగిసింది.

S

Business | Published On Aug 20, 2026, 4.12 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 గురువారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతోపాటు, ఇటీవల వరుసగా పడిపోయిన మార్కెట్లలో షార్ట్ కవరింగ్ జరగడం కూడా సూచీలకు మద్దతుగా నిలిచింది. సెన్సెక్స్ 628 పాయింట్లు (0.82 శాతం) లాభపడి 77,537.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 154 పాయింట్లు (0.64 శాతం) పెరిగి 24,231.85 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో ఈ లాభాలు విస్తృతంగా కనిపించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 సూచీ 0.36 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ 0.58 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.488.70 లక్షల కోట్ల నుంచి రూ.491 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దీంతో ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

షార్ట్ క‌వరింగ్ ర్యాలీ..

ఇటీవల మార్కెట్‌లో కొనసాగిన వరుస నష్టాల తర్వాత షార్ట్ కవరింగ్ ప్రారంభం కావడం ప్రధాన కారణాల్లో ఒకటి. బుధవారం నిఫ్టీ వరుసగా ఏడో సెషన్‌లో నష్టాలను నమోదు చేసింది. అదే సమయంలో సెన్సెక్స్ వరుసగా నాలుగో సెషన్‌లో క్షీణించింది. వరుసగా ఏడు సెషన్లలో నిఫ్టీ 2 శాతం పడిపోగా, నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1.5 శాతం నష్టపోయింది. ఇటీవలి కరెక్షన్ కారణంగా సూచీలు ఓవర్‌సోల్డ్ స్థాయికి చేరుకోవడంతో సాంకేతికంగా మార్కెట్‌లో బౌన్స్ వస్తుందని నిపుణులు అంచనా వేశారు. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ గత కొన్ని సెషన్లుగా మార్కెట్ క్రమంగా డౌన్‌ట్రెండ్‌లో ఉందని, ఇప్పుడు స్వల్పకాలిక రివర్సల్‌కు అవకాశం కనిపిస్తోందని తెలిపారు. మార్కెట్ ఓవర్‌సోల్డ్ స్థితిలో ఉన్నందున షార్ట్ కవరింగ్ ద్వారా స్వల్ప ర్యాలీ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే అమెరికా డాలర్ సూచీ, బెంచ్‌మార్క్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ తగ్గడం కూడా భారత మార్కెట్లకు ఊరటనిచ్చింది. బలమైన డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ కారణంగా భారత ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లే ప్రమాదం పెరుగుతుంది. అయితే డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ తగ్గడంతో ఆ ఒత్తిడి కొంత తగ్గింది.

పెరిగిన ఎఫ్‌పీఐల కొనుగోళ్లు..

భారత్‌లో అధిక చమురు ధరలు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, వృద్ధి-ద్రవ్యోల్బణ సమీకరణం, కంపెనీల ఆదాయాలపై చూపే ప్రభావంపై ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం మార్కెట్‌కు సానుకూలంగా మారింది. ఆగస్టు 19న అమెరికా డాలర్ సూచీ 0.83 శాతం తగ్గగా, 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 1.13 శాతం పడిపోయాయి. దీర్ఘకాలిక నోట్స్, బాండ్ల కోసం లిక్విడిటీ సపోర్ట్ బైబ్యాక్ ఆపరేషన్ల పరిమాణాన్ని రెట్టింపు చేయనున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుంది. గురువారం ట్రేడింగ్ సమయంలో అమెరికా డాలర్ ఇండెక్స్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ఉండగా, 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ మరో 0.20 శాతం తగ్గి 4.64 శాతానికి చేరాయి. మార్కెట్ ర్యాలీకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కూడా కీలక కారణంగా నిపుణులు చెబుతున్నారు. బుధవారం నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు భారతీయ షేర్లలో రూ.408 కోట్ల విలువైన కొనుగోళ్లు చేశారు. ఆగస్టు 19 వరకు ఎఫ్‌పీఐలు భారతీయ షేర్లలో రూ.23,320 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు జూలైలో రూ.20,200 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఎన్‌ఎస్‌డీఎల్ డేటా ప్రకారం ఆగస్టులో ఇప్పటివరకు ఎఫ్‌పీఐల కొనుగోళ్లు గణనీయంగా కొనసాగుతున్నాయి. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో చ‌మురు ధ‌ర‌లు గురువారం భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 2.23 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 9.182 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 2.74 శాతం మేర ఎగ‌బాకి బ్యారెల్‌కు 87 డాల‌ర్ల‌కు చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి స్వ‌ల్పంగా లాభాల‌ను న‌మోదు చేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.69 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 5 పైస‌లు లాభ‌ప‌డింది.

Advertisement
Advertisement