త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | బీసీల లెక్క తేలితేనే వారికి న్యాయం చేయ‌గ‌లం

Ponnam Prabhakar | బీసీల లెక్క తేలితేనే వారికి న్యాయం చేయ‌గ‌ల‌మ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. హ‌క్కుల కోసం దేశ‌వ్యాప్తంగా ఐక్య పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెప్పారు.

S

Telangana | Published On Sep 20, 2026, 4.36 pm IST

Ponnam Prabhakar | బీసీల లెక్క తేలితేనే వారికి న్యాయం చేయ‌గ‌లం
Advertisement
  • హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం అవసరం
  • 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ కాలమ్‌ చేర్చి కులగణన చేపట్టాలి
  • తెలంగాణలో కులగణన పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపించాం
  • 50 శాతం రిజర్వేషన్ పరిమితిపై కేంద్రం పునరాలోచన చేయాలి
  • జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: బీసీల లెక్క తేలితేనే వారికి న్యాయం చేయ‌గ‌ల‌మ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. హ‌క్కుల కోసం దేశ‌వ్యాప్తంగా ఐక్య పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెప్పారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్నారు. బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో ఆదివారం నిర్వహించిన “ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు - ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ” అనే అంశంపై జరిగిన జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం పాల్గొని ప్రసంగించారు.

గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్‌లోని ఓబీసీ ఫోరం ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో బీసీల సమస్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులను కూడా కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. బీసీల సమస్యలపై దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు, మేధావులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న జాజుల శ్రీనివాస్, ఆయన సహచరులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

కులగణనను పూర్తి చేశాం..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టేందుకు చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. వివిధ వర్గాల నిపుణులు, మేధావులు, స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాలను తీసుకుని ప్రశ్నావళిని రూపొందించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల నుంచి స్వీయ ప్రకటన ఆధారంగా సమాచారాన్ని సేకరించామని, ప్రతి 150 కుటుంబాలకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని కేటాయించి కులగణన ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు.

కేబినెట్‌లో చర్చించిన అనంతరం శాసనసభలో తీర్మానం చేసి, అన్ని రాజ్యాంగపరమైన ప్రక్రియలను పూర్తి చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే ఖచ్చితమైన ఎంపిరికల్ డేటా అవసరమని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగణన ద్వారా ఎంపైరికల్ డేటాను సేకరించిందని తెలిపారు. దేశంలో వివిధ వర్గాల జనాభా లెక్కలు నిర్వహిస్తున్నప్పటికీ, బీసీల జనాభాను లెక్కించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

“బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కించకుండా వారికి ఎంత వాటా ఇవ్వాలో ఎలా నిర్ణయిస్తాం?” అని మంత్రి ప్రశ్నించారు. కులగణన కేవలం జనాభా లెక్కల ప్రక్రియ కాదని, అది సామాజిక న్యాయానికి పునాది అని స్పష్టం చేశారు.

50 శాతం పరిమితిపై ..

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయితే బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరిగే విషయంలో 50 శాతం రిజర్వేషన్ పరిమితి అడ్డంకిగా మారకూడదన్నారు. బీసీల జనాభా, వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమగ్ర డేటా ఆధారంగా రిజర్వేషన్లపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

బీసీల హక్కుల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఒకే స్వరం వినిపించాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశంలోని బీసీల హక్కులకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన పూర్తి చేసి దేశానికి ఒక మార్గాన్ని చూపించామని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

“బీసీల జనాభాను శాస్త్రీయంగా లెక్కించాలి.. జనాభాకు అనుగుణంగా న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలి.. 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ కాలమ్‌ను చేర్చాలి.. బీసీల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాడాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

ఈ సదస్సుకు ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, జాతీయ స్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నేతలు హాజరయ్యారు.

Advertisement

తాజావార్తలు

Advertisement