త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BC Caste Census | బీసీ కులగణనపై కాంగ్రెస్‌ 100 రోజుల ఉద్యమం

BC Caste Census | బీసీ కులగణన, సామాజిక న్యాయం కోసం ఏఐసీసీ ఆధ్వర్యంలో 100 రోజుల పాటు ‘బీసీ హక్కుల గర్జన’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. తెలంగాణ కులగణనను దేశానికి రోల్‌మోడల్‌గా ప్రచారం చేస్తామని చెప్పారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు.

P

Telangana | Published On Sep 5, 2026, 3.38 pm IST

BC Caste Census | బీసీ కులగణనపై కాంగ్రెస్‌ 100 రోజుల ఉద్యమం
Advertisement
  • తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాం
  • టీపీసీసీ చీప్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
  • కేంద్రం మాట తప్పింది: మంత్రి పొన్నం

BC Caste Census | బీసీ కులగణన, సామాజిక న్యాయం కోసం ఏఐసీసీ ఆధ్వర్యంలో 100 రోజుల పాటు ‘బీసీ హక్కుల గర్జన’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. తెలంగాణ కులగణనను దేశానికి రోల్‌మోడల్‌గా ప్రచారం చేస్తామని చెప్పారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో దేశాన్ని భౌగోళికంగా, సామాజికంగా, స్థానిక పరిస్థితుల పరంగా పూర్తిగా అర్థం చేసుకున్నారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ‘జిస్కీ జిత్నీ ఆబాదీ.. ఉన్కీ ఉత్ని భాగేదారీ’ అంటూ రాహుల్‌ ఇచ్చిన నినాదం ఉద్యమంగా మారిందని, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ముఖ్యంగా బీసీల్లో చైతన్యం తీసుకొచ్చిందని చెప్పారు. రాహుల్‌ ఆశయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి శాస్త్రీయంగా కులగణన నిర్వహించడం ద్వారా నెరవేర్చారని పేర్కొన్నారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో రాహుల్‌ ఆశయాన్ని రేవంత్‌ అమలు చేశారని, తెలంగాణ కులసర్వే దేశానికి రోల్‌మోడల్‌గా మారిందని అన్నారు.

కేంద్రం వెంటనే ఓబీసీ కులగణన చేయాలి : కొప్పుల రాజు

గత ఐదేళ్లుగా కాంగ్రెస్‌, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే జనాభా లెక్కలతోపాటు కులగణన చేపట్టాలని ప్రధాని మోదీపై ఒత్తిడి తెస్తున్నారని కొప్పుల రాజు తెలిపారు. ఈ అంశాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ భావిస్తోందన్నారు. బిహార్‌ ఎన్నికల సమయంలో జనాభా లెక్కలతోపాటు ఓబీసీ కులగణన జరుగుతుందని ప్రధాని మోదీ చెప్పారని, కానీ జనాభా లెక్కల్లో ఓబీసీ కులగణనకు కేంద్రం అవకాశం కల్పించడం లేదని ఆరోపించారు. ఫ్యామిలీ సర్వేతోపాటు ఓబీసీ కులగణన చేస్తామని పార్లమెంట్‌లో అమిత్‌ షా చెప్పినా.. ఫామ్‌లో ఓబీసీ ప్రస్తావన లేదన్నారు. తెలంగాణలో కులగణన సందర్భంగా ఓబీసీ కుల సంఘాలతో మాట్లాడి 134 ఓబీసీ కులాలను గుర్తించామని కొప్పుల రాజు తెలిపారు. రాష్ట్రంలో పక్కాగా ఓబీసీ కులగణన జరిగిందన్నారు. గతంలో కేంద్రం నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వేలో 46 లక్షల కులాల వివరాలు వచ్చాయని, ప్రస్తుతం కేంద్రం చేపడుతున్న ప్రక్రియ కచ్చితమైన ఓబీసీ జనగణన కాదని అన్నారు. ఓబీసీల సామాజిక న్యాయ అజెండా పదేళ్లుగా నెరవేరడం లేదని ఆరోపించారు.

50 శాతం రిజర్వేషన్‌ పరిమితిపై..

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని సీడబ్ల్యూసీలో నిర్ణయించామని కొప్పుల రాజు తెలిపారు. ఓబీసీ కులాల డేటా ఖరారైతే రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తివేయవచ్చన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలు రిజర్వేషన్‌ కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో ఓబీసీ డేటా లేకుండా చేశారని విమర్శించారు. కేంద్రం వెంటనే ఓబీసీ కులగణన చేపట్టాలని, లేకపోతే దేశంలో ఓబీసీలకు అందాల్సిన ఫలాలు మరో పదేళ్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఈ అంశంపై ఖర్గే, రాహుల్‌గాంధీ ప్రధాని మోదీకి లేఖలు రాశారని తెలిపారు. కులాల లెక్కలతోనే ఏ కులం ఎంత వెనుకబడి ఉందో తెలుస్తుందని కొప్పుల రాజు అన్నారు. ‘‘50 శాతం జనాభా వద్ద కేవలం 3 శాతం సంపద ఉంది’’ అని పేర్కొన్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయో గమనించాలని, అగ్రవర్ణాల వారి చేతుల్లోనే పెద్ద కాంట్రాక్టులు ఉన్నాయని అన్నారు. సరైన గణన, గణాంకాలు సాధించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

కేంద్రం మాట తప్పింది : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఏఐసీసీ చేపట్టిన కులగణనపై 100 రోజుల కార్యక్రమాన్ని తెలంగాణలో విజయవంతం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందని, సర్వే వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కులగణనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బిహార్‌ ఎన్నికలకు ముందు 2025 ఏప్రిల్‌ 1న దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కేంద్రం చెప్పిందని, ఎన్నికల తర్వాత మాట తప్పిందని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్‌ తరఫున ప్రధానిని కలిసి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. ‘సామాజిక న్యాయ చాంపియన్‌ కాంగ్రెస్‌’ అని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తెలంగాణలో కులగణనపై బీజేపీ వైఖరిని ఆ పార్టీ నేతలు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ‘బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌, పాయల శంకర్‌ బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించండి. బీజేపీ నాయకత్వంపై మాట్లాడితే పదవులు పోతాయని భయపడుతున్నారా?’ అని ప్రశ్నించారు. ఓబీసీ హక్కుల కోసం 100 రోజుల కార్యక్రమాన్ని ఏఐసీసీ చేపట్టిందని, తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

Advertisement
Advertisement