MLC Kavitha | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో పంట కాల్వల మెయింటెనెన్స్ సరిగా లేదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కాల్వల్లో కంప చెట్లు పెరిగాయి. వీటి మెయింటెనెన్స్ కోసం బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఒక్కపైసా విడుదల చేయలేదు అని ఆమె ధ్వజమెత్తారు. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే ఎస్సార్ఎస్పీ స్టేజీ -2 కాల్వను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. అనంతరం వెలుగుపల్లి గ్రామంలోని రుద్రమ చెరువును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ.. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి కనీసం నిధులు ఇవ్వటం లేదు. కోదాడ వరకు నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీ కాల్వ 70 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కాల్వను సరిగా మెయింటెన్ చేయటం లేదు. రుద్రమ దేవి చెరువును కూడా పరిశీలించాం. 700 ఎకరాల్లోని ఈ చెరువుకు గోదావరి నీళ్లు రావాల్సి ఉంది. కానీ కిలోమీటర్కు పైగా డిస్ట్రిబ్యూటరీ కాల్వ తవ్వకపోవటం కారణంగా గోదావరి నీళ్లు రావటం లేదు అని కవిత మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పెద్దలు ఈ చెరువును 5 టీఎంసీల రిజర్వాయర్ చేస్తామని రెండు ఎన్నికల్లో మాట ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ చెరువును లక్నవరం మాదిరిగా టూరిస్ట్ ప్లేస్ చేస్తామని మాట ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఈ చెరువును పట్టించుకోవటం లేదు. ఎస్సారెస్పీ స్టేజ్-2లో భాగంగా నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరిగేలా రిజర్వాయర్లు కట్టే విధంగా ప్రభుత్వం ప్రయత్నించాలి అని కవిత డిమాండ్ చేశారు.