త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | మ‌న కూర‌గాయ‌లు, పండ్ల‌ను ఎవ‌రూ కొంట‌లేరు.. తిన‌డానికి కూడా వీల్లేదు

Tummala Nageshwar Rao | తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్న కూర‌గాయ‌ల‌తో పాటు పండ్ల‌ను ఎవ‌రూ కొంట‌లేర‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు శాస‌న‌స‌భా వేదిక‌గా వెల్ల‌డించారు. ఎందుకంటే మ‌నం కొట్టే పురుగు మందులే కార‌ణ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Sep 10, 2026, 7.10 pm IST

Tummala Nageshwar Rao | మ‌న కూర‌గాయ‌లు, పండ్ల‌ను ఎవ‌రూ కొంట‌లేరు.. తిన‌డానికి కూడా వీల్లేదు
Advertisement

విదేశాల్లో మ‌న పండ్ల‌ను రిజెక్ట్ చేస్తున్నారు
ఎందుకంటే మ‌నం కొట్టే పురుగు మందులే కార‌ణం
శాస‌న‌స‌భ‌లో మంత్రి తుమ్మ‌ల వెల్ల‌డి

Tummala Nageshwar Rao | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్న కూర‌గాయ‌ల‌తో పాటు పండ్ల‌ను ఎవ‌రూ కొంట‌లేర‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు శాస‌న‌స‌భా వేదిక‌గా వెల్ల‌డించారు. ఎందుకంటే మ‌నం కొట్టే పురుగు మందులే కార‌ణ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా కూర‌గాయల సాగుపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు.

ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి చెప్పిన‌ట్టు.. మ‌న కూర‌గాయాలు ఎవ‌రూ తిన‌డానికి వీల్లేదు. బ‌య‌ట‌కు వెళ్తే రిజెక్టు అవుతున్నాయి. మిర్చి, మామిడితో పాటు అన్ని పండ్ల‌ను విదేశాల్లో రిజెక్టు చేస్తున్నారు. ఎందుకంటే మ‌నం కొట్టే పురుగు మందులే కార‌ణం. ఆ పురుగు మందు ఎందుకు కొడుతున్నామంటే కెమిక‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ మీద రాయితీలు ఎక్కువ‌. కేంద్రం కెమిక‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ మీద రాయితీలు ఎక్కువ ఇస్తుంది. కేంద్రం ఎక్కువ రాయితీ మీద అప్ప‌న్నంగా యూరియాను ఇస్తున్నారు కాబ‌ట్టి. అంద‌రం యూరియాను విరివిగా వాడుతున్నాం. రేష‌న‌లైజ్ చేయండి అని ప్ర‌ధానికి, కేంద్ర మంత్రికి ప‌దేప‌దే చెప్పాం. భూమిని సంర‌క్షించే ఎరువుల‌కు స‌బ్సిడీ ఇవ్వండి అని కోరామ‌ని మంత్రి తుమ్మ‌ల గుర్తు చేశారు.

కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యం...

గతంలో తెలంగాణలో సుమారు 3 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగితే, ప్రస్తుతం అది సుమారు లక్ష ఎకరాలకు తగ్గిపోయిందని మంత్రి తెలిపారు. ఫలితంగా 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ వానాకాలంలో 51000 సాధారణ విస్తీర్ణానికి గాను 72,583 ఎకరాలలో కూరగాయల సాగు జరిగిందని తెలిపారు. కూరగాయల ధరలు ప్రధానంగా డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉండటం వల్ల మార్కెట్లో ధరల్లో తరచూ హెచ్చుతగ్గులు ఉంటాయని పేర్కొన్నారు. రైతులకు లాభదాయకమైన పంటల వైపు వెళ్లేలా ప్రోత్సహించడంతో పాటు, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

సాగుకు అవసరమైన సదుపాయాలపై భారీగా రాయితీలు...

కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు నారు, మల్చింగ్, షేడ్‌నెట్, శాశ్వత పందిళ్లు, బిందు మరియు తుంపర సేద్యం వంటి సదుపాయాలను రైతులకు రాయితీలపై అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కూరగాయల నారు, మల్చింగ్, షేడ్‌నెట్ కోసం రూ.20 కోట్లు, శాశ్వత పందిళ్ల కోసం రూ.8 కోట్లు, బిందు సేద్యం కోసం రూ.97 కోట్లుకేటాయించినట్లు వెల్లడించారు. అన్ని పంటలకు విస్తీర్ణం ఆధారంగానే రైతు భరోసా అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

రెండు లక్షల ఎకరాల్లో కూరగాయల సాగుకు కార్యాచరణ

రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని తక్షణమే పెంచేందుకు ప్రస్తుత వానాకాలంలో సుమారు లక్ష ఎకరాల్లో, తదుపరి రబీ సీజన్‌లో మరో లక్ష ఎకరాల్లో కూరగాయల సాగుకు ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణకు అవసరమైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి లేకుండా చేసి, తెలంగాణలో పండించిన కూరగాయలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే స్థాయికి ఉత్పత్తిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం.. సమతుల్య రాయితీల విధానం...

రైతులు అధిక దిగుబడి, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల వైపు వెళ్లేలా వ్యవసాయ విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. కొన్ని పంటలు, కొన్ని పద్ధతులకే రాయితీలు పరిమితం కావడం వల్ల వ్యవసాయంలో సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందన్నారు. రైతులకు అవసరమైన పంటలు, భూమి సంరక్షణ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే విధంగా రాయితీల విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి సేద్యాన్ని కూడా పెంచి పోషించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని రైతులకు అవగాహాన కల్పించాలని కోరారు.

ఎరువుల విధానంపై కేంద్రంతో సమన్వయం అవసరం..

యూరియా వినియోగం పెరగడం వల్ల పురుగు మందుల వినియోగం కూడా పెరుగుతోందని మంత్రి తెలిపారు. యూరియా వినియోగాన్ని సమతుల్యం చేసేలా, భూమిని సంరక్షించే ఎరువులకు ప్రాధాన్యతనిచ్చే విధంగా సబ్సిడీ విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రితో పలుమార్లు చర్చించినట్లు వెల్లడించారు. దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో ఈ నెల 18న సమావేశం నిర్వహించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిని ఆహ్వానించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement