త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti | సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాలు గుర్తించాం.. అందరి బాగోతాలు బయటపెడుతాం : మంత్రి పొంగులేటి

Ponguleti | ధరణి పోర్టల్‌లో లొసుగులను ఆసరా చేసుకొని ప్రభుత్వ భూములు కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేష‌న్‌ల చ‌లానా సొమ్మును కాజేసిన‌వారిని వ‌దిలిపెట్టే ప్రస‌క్తే లేద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్పష్టం చేశారు.

P

Telangana | Published On Jan 24, 2026, 8.29 pm IST

Ponguleti | సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాలు గుర్తించాం.. అందరి బాగోతాలు బయటపెడుతాం : మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti | ధరణి పోర్టల్‌లో లొసుగులను ఆసరా చేసుకొని ప్రభుత్వ భూములు కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేష‌న్‌ల చ‌లానా సొమ్మును కాజేసిన‌వారిని వ‌దిలిపెట్టే ప్రస‌క్తే లేద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్పష్టం చేశారు. పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ భూముల‌ను కాజేశార‌ని.. సిద్దిపేట‌, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో పైలట్ కింద ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించడం జరిగిందని.. ఇందులో అనేక అవినీతి, అక్రమాలు జరిగినట్లుగా ప్రాథమిక నివేదికలో స్పష్టమైందని తెలిపారు. ఈ ఫోరెన్సిక్ నివేదికను ప‌రిశీలించిన త‌ర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి కమిటీతో సమావేశం నిర్వహించారు. విచార‌ణ‌లో ఎదురైన అంశాలు, ఎవ‌రి పాత్ర ఎంత‌? తెర‌వెనుక ఎవ‌రైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? తదితర అంశాల‌పై క‌మిటీ స‌భ్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. క‌మిటీ ప్రాథమిక నివేదిక‌ను ప‌రిశీలించి మ‌రికొన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు చేస్తూ మ‌రింత లోతైన విచార‌ణ జ‌రిపి తుది నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని సూచించారు.

పోర్టల్‌ ప్రారంభమైన నాటి నుంచి 35వేల లావాదేవీలు జరిగాయని, ఇందులో ప్రాథమికంగా 4848 లావాదేవీల్లో లోటుపాట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. విచారణ తర్వాత 1109 డాక్యుమెంట్స్‌కు సంబంధించి రూ.4కోట్లు ప్రభుత్వానికి చెల్లింపులు జరుగలేదని కమిటీ సభ్యులు మంత్రికి విన్నించారు. మంత్రి మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా ఎలాంటి ముందు చూపులేకుండా ఓ కుట్రపూరితంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌లో లోపాలను ఆసరా చేసుకొని కొందరు అక్రమాలకు పాల్పడ్డారని, భూ భారతి పోర్టల్‌ ద్వారా ఆడిట్‌ నిర్వహించి అక్రమాలను తక్షణమే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచార‌ణ చేప‌ట్టామ‌ని తెలిపారు. ఇందుకు సంబంధించి తొమ్మిది జిల్లాల్లోని 35 మండ‌లాల్లో అక్రమాల‌కు పాల్ప‌డిన 48 మందిపై క్రిమిన‌ల్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. వాస్తవం ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఓ నాయకుడు రూ.వెయ్యికోట్లు, మరో నేత రూ.10వేలకోట్లు అంటూ భూ భారతి అవినీతి మయం అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ రాజీవ్‌ హన్మంతు, ఇంటిలిజెన్స్‌ అదనపు డీజీ విజయ్‌ కుమార్‌, సభ్యులు డీఐజీ ఎం సుభాషిణి, సీఎంఆర్‌వో మకరంద్‌, ఏసీబీ ఎస్పీ సింధుశర్మ, సైబ‌ర్ క్రైమ్ డీఎస్పీ ఏ సంప‌త్‌, ఎన్ఐసీ ప్రతినిధి శ్రీ‌నివాస్, హోంశాఖ స‌ల‌హాదారు పీ శ‌ర‌త్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌వి మతిలేని మాటలు..

అనంతరం మంత్రి మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ వాడుతున్న భాష సరిగా లేదని విమర్శించారు. ఆయన మాటలు మతిలేని మాటలన్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌లు వ్యక్తిగ‌తంగా తాను రిఫ‌రెండంగా భావిస్తున్నాన‌న్నారు. ఇప్పటికే రెండు సార్లు కేటీఆర్‌ రిఫ‌రెండం అన్నారని, మ‌ళ్లీ ఇప్పుడు రిఫ‌రెండం అంటున్నారని విమర్శించారు. ఇంత‌కు ముందు జ‌రిగిందే ఈ ఎన్నిక‌ల్లో జరుగుతుందన్నారు. ఆనాడు సోయి లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు జిల్లాల‌ను ఏర్పాటు చేసి.. ఇప్పుడు అగ్నిగుండం చేస్తామ‌ని మ‌తిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రజామోదంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామన్నారు. బట్టకాల్చి మీద వేయ‌డ‌మే ప్రతిప‌క్ష పార్టీ ప‌ని అన్నట్లుగా ప్రధాన ప్రతిప‌క్షం వ్యవ‌హ‌రిస్తోందన్నారు. మా రెండేళ్ల పాల‌న‌లో ఏ తప్పు జ‌రిగింద‌ని మాట్లాడుతున్నారని.. వారి పాల‌న‌లో అక్రమాలు జ‌రిగిన‌ట్లుగానే ఇప్పుడు కూడా అలాగే జ‌రుగుతున్నాయ‌ని భ్రమ‌ప‌డుతున్నారన్నారు. ఇంకా అధికారంలో ఉన్నట్లుగా వారి వ్యవ‌హార శైలి ఉందని.. అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌గ‌టిక‌ల‌లు కంటున్నారని విమరర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement