త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram Jatara | నేటి నుంచి మేడారం జాత‌ర‌.. గ‌ద్దెల‌పై కొలువుదీర‌నున్న వ‌న దేవ‌త‌లు

Medaram Jatara | తెలంగాణ కుంభ‌మేళా, దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం స‌మ్మక్క సార‌ల‌మ్మ మ‌హా జాత‌రకు (Medaram Jatara) వేళ‌యింది. ప్ర‌తి రెండేండ్ల‌కోసారి జరిగే ఈ వ‌న‌ జాతర మ‌రికొన్ని గంట‌ల్లో ఆరంభ‌కానుంది.

G

Telangana | Published On Jan 28, 2026, 6.38 am IST

Medaram Jatara | నేటి నుంచి మేడారం జాత‌ర‌.. గ‌ద్దెల‌పై కొలువుదీర‌నున్న వ‌న దేవ‌త‌లు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ కుంభ‌మేళా, దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం స‌మ్మక్క సార‌ల‌మ్మ మ‌హా జాత‌రకు (Medaram Jatara) వేళ‌యింది. ప్ర‌తి రెండేండ్ల‌కోసారి జరిగే ఈ వ‌న‌ జాతర మ‌రికొన్ని గంట‌ల్లో ఆరంభ‌కానుంది. కోరిన కోర్కెలు తీర్చి భ‌క్తులు కొంగు బంగారంగా వెలుగొందుతున్న స‌మ‌క్క సార‌ల‌మ్మ (Sammakka Saralamma) త‌ల్లులు గద్దెలపై కొలువుదీరే స‌మ‌యం ఆసన్న‌మైంది. బుధ‌వారం నుంచి ఈ నెల 31 వరకు నాలుగు రోజుల‌పాటు వైభవంగా జరిగే జాతరకు ప్రభుత్వం ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

భ‌క్తులు క‌న్నెప‌ల్లి జాబిల్లిగా కొలిచే సార‌ల‌మ్మ రాక‌తో జాత‌ర ప్రారంభ‌మ‌వుతుంది. బుధ‌వారం సాయంత్రం సార‌ల‌మ్మ త‌ల్లి మేడారంలోని గ‌ద్దెపై కొలువుదీరనుంది. ఇప్ప‌టికే మేడారం స‌మీపంలోని క‌న్నెప‌ల్లిలో ఉన్న సార‌ల‌మ్మ గుడిలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆదివాసీ సంప్ర‌దాయం ప్ర‌కారం జంపన్న వాగులో నుంచి గద్దెపైకి సారలమ్మను తీసుకొచ్చే ప్ర‌క్రియ బుధ‌వారం ఉద‌యం ప్రారంభమ‌వుతుంది. సాయంత్రం 6 గంట‌ల‌కు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

heavy rush in medaram sammakka jatara

మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి ఆమె తండ్రి పగిడిద్దరాజును తీసుకుని ఇప్పటికే కాలినడకన మేడారానికి బయలుదేరారు. ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొస్తారు. ఈ ముగ్గురూ గద్దెలపై కొలువుదీరుతారు. మంగళవారం సాయంత్రమే జంపన్నను కన్నెపల్లి నుంచి జంపన్న వాగు ఒడ్డుకు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు.

జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. గురువారం మేడారం సమీపంలోని చిలుకల గుట్టపై నుంచి స‌మ్మ‌క్క‌ను తీసుకొస్తారు. కుంకుమభరిణ రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజు గ‌ద్దెల‌పై ఉండే శుక్రవారం భక్తులు మేడారానికి పోటెత్త‌నున్నారు. వ‌న‌దేవ‌త‌ల‌ను దర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటారు. శనివారం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త..
వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకోవడానికి కోట్లాది మంది భ‌క్తులు త‌ర‌లిరానున్న‌డంతో ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసింది. జాత‌ర‌లో 13 వేల మంది పోలీసుల‌ను మోహ‌రించింది. జాత‌ర ప్రాంతాన్ని 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభ‌జించారు. మేడారంలో 2 వేల మంది ఆదివాసీ యువ‌త వాలంటీర్లుగా సేవ‌లు అందిస్తున్నారు. జాత‌ర విధుల్లో 5192 మంది వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. మేడారం ప‌రిస‌ర ప్రాంతాల్లో 30 వైద్య శిబిరాల‌ను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement