త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy 1000 Days | ఓవైపు 1000 రోజుల పాలన.. మరోవైపు సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల కన్నీళ్లు

ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో సిద్దిపేట విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు.

J

Telangana | Published On Sep 1, 2026, 4.55 pm IST

Revanth Reddy 1000 Days | ఓవైపు 1000 రోజుల పాలన.. మరోవైపు సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల కన్నీళ్లు
Advertisement
  • సిద్దిపేట శ్రీకృప ఫార్మా కాలేజీలో ఫీజుల బకాయిల వల్ల విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపివేత
  • పై చదువులకు వెళ్లలేక విద్యార్థుల ఆవేదన, సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ఇదేం ఖర్మ అంటూ సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్
  • తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి న్యాయం చేయాలని డిమాండ్

Revanth Reddy 1000 Days | త్రినేత్ర.న్యూస్ : సిద్దిపేటలోని శ్రీకృప ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీకి చెందిన బి.ఫార్మసీ విద్యార్థులు తమ సర్టిఫికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాకపోవడంతో యాజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన వేళ.. రోడ్డున పడ్డ ఈ విద్యార్థుల గోస ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన మండిపడ్డారు.

వీడియో ద్వారా విద్యార్థుల ఆవేదన

సోషల్ మీడియాలో హరీశ్ రావుకు ట్యాగ్ చేస్తూ శ్రీకృప కాలేజీ విద్యార్థినులు ఒక వీడియోను షేర్ చేశారు. "మేము 2022-2026 బ్యాచ్‌కి చెందిన బి.ఫార్మసీ స్టూడెంట్స్. మా గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఫర్దర్ గా ఎం.ఫార్మసీకి అప్లై చేసుకున్నాం, రేపే ఫేస్-1 (Phase-1) కౌన్సిలింగ్‌కి లాస్ట్ డేట్. కానీ సర్టిఫికెట్లు లేక మంచి కాలేజీల్లో వచ్చిన సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది" అంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చిన తాము కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యామని, గవర్నమెంట్‌కు కాలేజీకి మధ్య ఉన్న ఇష్యూలో తమను ఎందుకు బలిచేస్తున్నారని వారు ప్రశ్నించారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో మెంటల్ ప్రెషర్ పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ కు హరీశ్ రావు చురకలు

ఈ వీడియోపై హరీశ్ రావు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి గట్టి చురకలు అంటించారు. "ముఖ్యమంత్రి గారూ.. ఈ వెయ్యి రోజుల్లో మీరు ప్రజలకు చేసిన మంచి కంటే సృష్టించిన విధ్వంసమే ఎక్కువ. మైకు దొరికితే ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న శ్రద్ధ, క్షేత్ర స్థాయిలో ఈ పిల్లలు పడుతున్న గోస మీద ఎందుకు లేదు?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట విద్యార్థులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement