త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajendar | దేశం విచ్ఛిన్నం కావాల‌ని.. ఎన్నో దేశాలు సీజేపీకి నిధులిస్తున్న‌య్

Etala Rajendar | బంగ్లాదేశ్, శ్రీలంకలా భార‌త్ విచ్ఛిన్నం కావాల‌ని అనేక దేశాలు కాక్రోచ్ జనతా పార్టీకి ఫండింగ్ ఇస్తున్నాయ‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు. మోదీ బలహీనపడితే ప్రజాస్వామ్యం, దేశ భద్రత బలహీన పడుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం డబ్బులిస్తుంది అని చెప్పని సంకుచిత స్వభావి రేవంత్ రెడ్డి అని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Aug 30, 2026, 5.33 pm IST

Etala Rajendar | దేశం విచ్ఛిన్నం కావాల‌ని.. ఎన్నో దేశాలు సీజేపీకి నిధులిస్తున్న‌య్
Advertisement
  • మోదీ లేకుంటే దేశ భ‌ద్ర‌త బ‌ల‌హీన‌మ‌వుతుంది
  • బీజేపీ పవర్ ఓరియెంటెడ్ పార్టీ కాదు, పీపుల్ ఓరియెంటెడ్ పార్టీ
  • రేవంత్‌రెడ్డి కురుస మ‌న‌స్త‌త్వంతో న‌డుస్తున్న‌డు
  • మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Etala Rajendar | త్రినేత్ర‌.న్యూస్: బంగ్లాదేశ్, శ్రీలంకలా భార‌త్ విచ్ఛిన్నం కావాల‌ని అనేక దేశాలు కాక్రోచ్ జనతా పార్టీకి ఫండింగ్ ఇస్తున్నాయ‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు. మోదీ బలహీనపడితే ప్రజాస్వామ్యం, దేశ భద్రత బలహీన పడుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం డబ్బులిస్తుంది అని చెప్పని సంకుచిత స్వభావి రేవంత్ రెడ్డి అని విమ‌ర్శించారు. ఆయన‌ కురుస మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. దెబ్బల గాయాలు మానుతాయ‌ని, కానీ మాటల గాయాలు మానవన్నారు. అందుకే నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సీతారామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి, హోమం నిర్వహించారు.

ఈటల రాజేందర్ మాట్లాడారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదు, సిద్ధాంతంతో ఏర్పడ్డ పార్టీ.  దేశ హితం కోసమే నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప పార్టీ కోసం కాదు. బీజేపీ పవర్ ఓరియెంటెడ్ పార్టీ కాదు, పీపుల్ ఓరియెంటెడ్ పార్టీ. సంకీర్ణ ప్రభుత్వంలో సైతం అప్పటి ప్రధాని వాజపేయి దేశ హితం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. హైవేల కోసం చతుర్భుజి రోడ్ల నిర్మాణం, గ్రామీణ సడక్ యోజన తెచ్చారు.

మోదీ వచ్చాక మన అసలు ఆశయం.. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆశించిన విధంగా ఒకే దేశం, ఒకే జెండా తీసుకువచ్చారు. 370 ఆర్టికల్‌ను రద్దు చేశారు. కుదిరాం బోస్ లాంటి బిడ్డల త్యాగాలు ఒకటే జెండా కోసం ప్రాణత్యాగాలు చేశారు. ఉపాధ్యాయ గారు మనకు గొప్ప సిద్ధాంతం ఇచ్చారు. ఎల్.కె అద్వానీ రథయాత్ర చేసి హిందువులను ఏకం చేశారు. ఆయన వారసత్వంతో మోదీ అయోధ్యలో రామాలయం నిర్మించి చూపించారు.

తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ, బీజేపీలు జేఏసీలో భాగస్వాములు. అలా ఉద్యమంలో గిరివర్ధన్ రెడ్డి పరిచయం ఏర్ప‌డింది. అంకితభావంతో పని చేసే వ్యక్తి. రాజకీయ నాయకులు పదవి కావాలని కోరుకుంటారు. అలా కోరుకోవాలి కూడా. జంగమయ్యలా ఉండకూడదు. పార్టీలో భేదాభిప్రాయాలు సహజం. కానీ అవి పార్టీకి నష్టం చేసేలా ఉండకూడదు.

మ‌ల్కాజిగిరి మినీ ఇండియా..

మల్కాజిగిరి నియోజకవర్గం అత్యంత శక్తివంతమైనది. మల్కాజిగిరి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి, అత్యధిక జనాభా ఉంటారు. ఇది మినీ ఇండియా. కార్యకర్తలు పార్టీకి పునాదిరాళ్లు. పదవి రాకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తారు. నాయకులు వస్తారు, పోతారు. కానీ కార్యకర్తలు శాశ్వతం. కార్యకర్తలను, ప్రజలను నాయకులు ప్రేమించాలి. లేదంటే మళ్ళీ గెలవలేడు. రెండోసారి గెలిస్తే ప్రజల విశ్వాసం పొందినట్టు, కార్యకర్తల గుండెల్లో చోటు సంపాదించుకున్నట్టు లెక్క. కొద్దిమందినే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అలా ఉండాలని గిరివర్ధన్ రెడ్డిని కోరుతున్నా. నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలి. నోట్లో నాలుకలా ఉండాలి.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తారు. నేను పాలకుణ్ణి కాదు సేవకుణ్ణి అంటారు ఆయన. నేను ఇచ్చిన అని ఎన్నడూ అనరు. కానీ ఇక్కడ ఉన్న కురుస నాయకులు మాత్రం అన్నీ నేనే ఇచ్చిన అని ప్రచారం చేసుకుంటారు. రేషన్ కార్డుల మీద ఫోటోలు వేసుకుంటున్నారు. నువ్వు ప్రజల డబ్బులకు కాపలాదారుడవి అని మాత్రం మర్చిపోకు. కేంద్రం కూడా డబ్బులు ఇస్తుంది అని చెప్పని సంకుచిత స్వభావులు.

మోదీ బలహీనపడితే ప్రజాస్వామ్యం, దేశ భద్రత బలహీన పడుతుంద‌ని ప్రజలు భావించారు. అందుకే హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో వరుసగా బీజేపీని గెలిపిస్తున్నారు. ఇతర పార్టీ నాయకుల్లాగా మనం ఉండకూడదు. మనకు ఆశయం ఉంది అని ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు.

అంత‌కుముందు ఈటల రాజేందర్ సమక్షంలో మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి అధ్యక్ష బాధ్యతలను గిరివర్ధన్ రెడ్డికి అప్పగించారు. గిరివర్ధన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, బీజేపీ సీనియ‌ర్ నేత‌లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement