త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

హైడ్రా నుంచి లగ్చర్ల దాకా.. ‘భూ’ రగడతో మారుతున్న తెలంగాణ పొలిటికల్ గేమ్!

ఎకరం ధర రూ. 100 కోట్లకు తాకిన వేళ, తెలంగాణలో భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు—పాలక వర్గాల తలరాతను మార్చే పవర్ ప్యాక్డ్ రాజకీయం! హైడ్రా నుంచి 22-A దాకా రేవంత్ సర్కార్ వేసిన స్కెచ్ రివర్స్ అయి, కాంగ్రెస్‌ను వివాదాల ‘భూ’ సుడిగుండంలోకి నెట్టేసింది!

S

Telangana | Published On Aug 26, 2026, 12.28 pm IST

హైడ్రా నుంచి లగ్చర్ల దాకా.. ‘భూ’ రగడతో మారుతున్న తెలంగాణ పొలిటికల్ గేమ్!

సంక్షిప్త సారాంశం

హైడ్రా కూల్చివేతలు, లగ్చర్ల సెంటిమెంట్ రగడ, 22-A రిజిస్ట్రేషన్ల లూప్‌లతో పాటు యూనివర్సిటీ స్థలాల వివాదాలు రేవంత్ ప్రభుత్వాన్ని తీవ్ర రాజకీయ రక్షణ (Defensive) స్థితిలోకి నెట్టాయి. సంక్షేమ పథకాల నిధుల కోసం భూములను మానిటైజ్ చేసే ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో అసహనానికి దారితీస్తూ, 2028 ఎన్నికల ముందే కాంగ్రెస్ ఓటు బేస్‌ను కరిగించే పెద్ద రిస్క్‌గా మారాయి!

Advertisement

  ల్యాండ్ మానిటైజేషన్ స్కెచ్ రివర్స్.. గ్యారెంటీల వేటలో రేవంత్ సర్కార్‌కు 'భూ'       సుడిగుండం!

 

హైదరాబాద్‌లోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ఎకరం ధర రూ. 100 కోట్లకు చేరువవుతున్న తరుణంలో, తెలంగాణలో భూమి కేవలం ఒక ఆర్థిక మూలధనం మాత్రమే కాదు—అది రాజకీయాన్ని శాసించే ప్రధాన శక్త్యాయుధంగా మారింది. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిధుల సమీకరణ (Resource Mobilization), చెరువుల పరిరక్షణ, భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో తీసుకుంటున్న అనేక నిర్ణయాలు క్షేత్రస్థాయిలో వరుస వివాదాలకు దారితీస్తున్నాయి. పారదర్శకత లేదా అభివృద్ధి నిధుల కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే, కమ్యూనికేషన్ లోపం వల్ల అది ఆటోమేటిక్‌గా ఒక ‘భూ వివాదం’గా రూపాంతరం చెంది ప్రతిపక్షాల (BRS, BJP) చేతికి సిద్ధంగా అస్త్రాన్ని అందిస్తోంది. గత బిఆర్ఎస్ హయాంలో భూ రికార్డులు, ఆక్రమణల విషయంలో తప్పులు జరిగాయని, తమ ప్రభుత్వం వాటిని క్లీన్ చేస్తోందని కాంగ్రెస్ వర్గాలు బలంగా వాదిస్తున్నప్పటికీ... పద్ధతి, టైమింగ్ లోపాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వమే స్వయంగా ఈ భూ వివాదాల సుడిగుండంలో చిక్కుకుందా? అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

‘హైడ్రా’ & మూసీ బఫర్ జోన్: క్లాస్ బయాస్ ఆరోపణలు – ల్యాండ్ పూలింగ్ సర్దుబాట్లు

చెరువులు, కుంటలను కాపాడుతామంటూ తీసుకొచ్చిన హైడ్రా (HYDRAA) ప్రక్రియకు కోర్టు చట్టబద్ధత కల్పించినప్పటికీ, ఆచరణలో ఎదురవుతున్న పరిణామాలు రాజకీయంగా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. మధ్యతరగతి అపార్ట్‌మెంట్లు, పేద కాలనీలపై కూల్చివేతల మార్కింగ్‌లు పడటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. "పెద్ద పెద్ద బిల్డర్లు, పాత ఆక్రమణదారుల జోలికి నెమ్మదిగా వెళ్తూ, చిన్న రైతులు, అపార్ట్‌మెంట్లు, పేదల నివాసాలపై వేగంగా చర్యలు తీసుకుంటున్నారు" అనే ప్రచారం ప్రజల్లోకి వెళ్లడం వల్ల ఇది 'బుల్‌డోజర్ జస్టిస్' నుంచి 'క్లాస్ బయాస్' ఆరోపణలకు దారితీసింది. TDR (Transferable Development Rights ) ద్వారా కాంపెన్సేషన్ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా నిరసనలు వ్యక్తమవ్వడంతో, ప్రభుత్వం ఇటీవల మూసీ పరివాహక ప్రాంతంలో వివాదాలు తగ్గించేందుకు ల్యాండ్ పూలింగ్ పాలసీ (Land Pooling) దిశగా సర్దుబాటు చర్యలు ప్రతిపాదించింది. అయినప్పటికీ, నగర పరిధిలో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకుపై ఇది నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతోందనే ఆందోళన క్యాడర్‌లో వ్యక్తం అవుతోంది.

22-A నిషేధిత జాబితా: సామాన్యుడి చిక్కులు – ప్రభుత్వం ఏమంటోంది?

ప్రభుత్వ భూముల రక్షణ పేరిట చేపట్టిన భారత రిజిస్ట్రేషన్ చట్టం - 22A నిషేధిత జాబితా సవరణలు ఇప్పుడు సామాన్య ప్రజలకు అతిపెద్ద హాట్ ఇష్యూగా మారాయి. ధరణి పోర్టల్ సమయం నుంచి ఉన్న డిజిటల్ అప్‌డేట్ లోపాలు, పాత రెవెన్యూ రికార్డుల గందరగోళం వల్ల దశాబ్దాలుగా ఉంటున్న వేలాదిమంది ప్రైవేట్ పట్టాదారులు, రెగ్యులరైజ్డ్ స్థలాల యజమానుల భూములు కూడా ఈ జాబితాలో చిక్కుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధరణి లోపాల వల్లే ఈ సమస్య వచ్చిందని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. "మేము కొత్తగా ఒక్క సెంట్ భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు, పాత రికార్డులనే సర్దుబాటు చేస్తున్నాం. 90 శాతానికి పైగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాం" అని ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ మంత్రి స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో   ఈ సెగ ప్రజలకు తగలడంతో ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వంపై పెద్ద సెంటిమెంట్ అస్త్రంగా ఉపయోగిస్తున్నాయి.

జిల్లాల్లో భూసేకరణ సెగ: లగ్చర్ల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు...

నగరానికే కాకుండా జిల్లాలకీ భూ విభాగాలు వేగంగా విస్తరించాయి. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగ్చర్లలో 'ఫార్మా విలేజ్' భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపై రైతులు తిరగబడటం పెద్ద రాజకీయ రగడకు దారితీసింది. గత పాలకుల ప్రేరణతోనే ఈ గొడవలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఆరోపించినప్పటికీ, రైతుల నిరసనతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆ ప్రాజెక్టును 'ఫార్మా విలేజ్' నుంచి 'మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్'గా మారుస్తూ నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచాల్సి వచ్చింది. అటు రంగారెడ్డి జిల్లా (యాచారం, కందుకూరు) ప్రాంతాల్లో పాత ఫార్మా సిటీని రద్దు చేశామని చెబుతూనే, 'భారత్ ఫ్యూచర్ సిటీ' పేరుతో భూసేకరణ కొనసాగిస్తున్నారని రైతుల నిరసనలు, కోర్టు వ్యాజ్యాలు నడుస్తున్నాయి. మరోవైపు రీజినల్ రింగ్ రోడ్డు (RRR సౌత్ పార్ట్) భూసేకరణలో ఇస్తున్న నష్టపరిహారం సరిపోదంటూ, అలైన్మెంట్ మార్చాలంటూ నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి.

ఇన్‌స్టిట్యూషనల్ & ఉమ్మడి భూముల చిక్కుముడులు

సంక్షేమ పథకాలకు లేదా ఇతర అభివృద్ధి అవసరాలకు నిధుల సమీకరణ నిమిత్తం విద్యాసంస్థలు ,ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ఆస్తులను ఉపయోగించుకోవాలనే ఆలోచనలు కోర్టు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిధిలోని 400 ఎకరాల పచ్చని భూమిని ఐటీ/అభివృద్ధి అవసరాలకు క్లియర్ చేసే ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. అలాగే MANUU ( మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ) వద్ద ఉన్న 50 ఎకరాల భూమిని వెనక్కి తీసుకునే నోటీసుతో పాటు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ భూముల బదిలీ ప్రతిపాదనలు "యూనివర్సిటీ స్థలాలపై ప్రభుత్వ కన్ను" అనే ప్రతిపక్షాల విమర్శలకు బలమైన అస్త్రంగా మారాయి. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బస్ భవన్ పరిసరాల్లో ఖాళీ స్థలంలో పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ కడతామని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నప్పటికీ, ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్-IX కింద ఆ స్థలాలు ఉన్నందున చట్టపరమైన సంక్లిష్టతలు, ఆస్తుల విభజన సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) పరిధిలోని కమర్షియల్/ఓపెన్ ప్లాట్లను వేలం వేసే యత్నాలను స్థానిక సొసైటీలు కోర్టుల ద్వారా సవాలు చేస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రాజకీయ తలనొప్పులు

ఈ భూముల రగడ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా రాజకీయంగా తలనొప్పులు తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి:

గ్యారెంటీలు vs ల్యాండ్ మానిటైజేషన్ సంక్షోభం: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే భారీగా నిధులు కావాలి. నిధుల కొరత వల్ల భూములను మానిటైజ్ చేయడం (వేలం వేయడం) ప్రభుత్వానికి అనివార్యంగా మారింది. అయితే, నిధుల సేకరణ ప్రక్రియ రైతులకు, మధ్యతరగతి వర్గాలకు ఆగ్రహం కలిగిస్తే—అది సంక్షేమ పథకాల ద్వారా వచ్చే సానుకూలతను తుడుచిపెట్టే ప్రమాదం ఉంది.

ఓటు బ్యాంకుకు పడే గండి: నగర పరిధిలోని పట్టణ మధ్యతరగతి వర్గాలు, జిల్లాల్లోని రైతులే కాంగ్రెస్‌కు కీలకం. భూ వివాదాలు, హైడ్రా భయాలు వీరిని దూరం చేస్తే, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపిలు "ల్యాండ్ గ్రాబ్ సర్కార్" అనే బలమైన ప్రచారంతో పొలిటికల్ మైలేజ్ పొందే అవకాశం ఉంది.

కమ్యూనికేషన్ లోపం - పార్టీ అంతర్గత ఒత్తిడి: ప్రభుత్వ యంత్రాంగం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెబుతున్నప్పటికీ , "ఈ నిర్ణయాల వల్ల ప్రజలకు జరిగే మేలు ఏంటి" అని వివరించడంలో రాజకీయ నాయకత్వం విఫలమవుతోంది. దీనివల్ల నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

గత బిఆర్ఎస్ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దాలనే ఆలోచన తమకు ఉందని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ... పారదర్శకమైన భూ విధానం, తగిన నష్టపరిహారం,  పక్కా రాజకీయ భరోసాని ఇవ్వకపోతే, రానున్న శాసన సభ ఎన్నికలకు ముందే ఈ భూ వివాదాల సుడిగుండం కాంగ్రెస్ పార్టీ ఓటు బేస్‌ను వేగంగా కరిగించివేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement