త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR Delhi Chit Chat | రేవంత్ సీక్రెట్ సర్వేల్లో బీఆర్ఎస్‌దే గెలుపు.. వచ్చే ఏడాది నా పాదయాత్ర: ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఏడాది తెలంగాణలో పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. సీఎం రేవంత్ సర్వేల్లోనూ బీఆర్ఎస్ గెలుస్తుందని తేలిందని, పొంగులేటి భారీ అవినీతికి పాల్పడుతున్నారని బాంబు పేల్చారు.

J

Telangana | Published On Jul 15, 2026, 7.40 pm IST

KTR Delhi Chit Chat | రేవంత్ సీక్రెట్ సర్వేల్లో బీఆర్ఎస్‌దే గెలుపు.. వచ్చే ఏడాది నా పాదయాత్ర: ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సంక్షిప్త సారాంశం

వచ్చే ఏడాది తెలంగాణ వ్యాప్తంగా తాను పాదయాత్ర చేయనున్నట్లు ఢిల్లీలో కేటీఆర్ వెల్లడించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ భూముల పంచాయతీల్లో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మెట్రోకు చెందిన 280 ఎకరాల భూమిని బంధువులకు కట్టబెట్టేందుకే ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ చేయించుకున్న నాలుగు సర్వేల్లోనూ మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తేలిందని, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

KTR Delhi Chit Chat | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మీడియాతో నిర్వహించిన 'చిట్ చాట్'లో సంచలన విషయాలు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలన, హైదరాబాద్ మెట్రో భూములు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై ఘాటు విమర్శలు చేశారు. వచ్చే ఏడాది తాను తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కేసీఆరే నెక్స్ట్ సీఎం.. మా తప్పులు దిద్దుకుంటాం

కాంగ్రెస్ ప్రభుత్వం చేయించుకున్న నాలుగు సర్వేల్లోనూ మళ్లీ బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వస్తుందని తేలిందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ (KCR) నాయకత్వంలోనే గెలిచి, ఆయనే మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఎన్నికల్లో తమ ఓటమికి 100 శాతం తమ పొరపాట్లు కూడా ఉన్నాయని, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కూడా ఒక కారణమని, వాటిని కచ్చితంగా సరిదిద్దుకుంటామని ఆయన అంగీకరించారు.

పొంగులేటి, రేవంత్ 30% కమీషన్ దందా!

రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో 30 లక్షల ఎకరాలు ఉన్న నిషేధిత భూముల జాబితాను (Prohibited list) కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కోటి ఎకరాలకు పెంచి లాక్-అన్‌లాక్ (Lock-Unlock) గేమ్ ఆడుతోందని విమర్శించారు. భూ వివాదాలను అన్‌లాక్ చేయడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), సీఎం రేవంత్ రెడ్డి 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

బంధువుల కోసమే మెట్రో రద్దు.. 280 ఎకరాలపై కన్ను

హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఫేజ్-2ను రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఆపేశారని కేటీఆర్ మండిపడ్డారు. గత ప్రభుత్వం మెట్రో వాణిజ్య అవసరాల కోసం ఇచ్చిన 280 ఎకరాల భూమిపై రేవంత్ కన్ను పడిందని, ఆ భూములను తన బంధువులకు, అనుచరులకు రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారం కోసం కట్టబెట్టేందుకే ప్రాజెక్టును రద్దు చేశారని ఆరోపించారు. ఎల్ అండ్ టీ (L&T) సంస్థకు ఉన్న రూ. 14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరించాలని ఆయన నిలదీశారు.

NDSA రిపోర్ట్ కాదు.. అది NDA రిపోర్ట్

కాళేశ్వరం ప్రాజెక్టుపై NDSA ఇచ్చిన రిపోర్టును 'ఎన్డీఏ (NDA) రిపోర్టు'గా కేటీఆర్ అభివర్ణించారు. ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ కలిసి ఈ నాటకం ఆడాయని విమర్శించారు. కేవలం రూ. 8.5 కోట్లతో కాపర్ డ్యాం (Copper Dam) నిర్మిస్తే కన్నెపల్లి నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు రేవంత్ రెడ్డికి లేఖ రాసినా ఆయన పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అసూయతో సీఎం రైతుల నోట్లో మట్టికొడుతున్నారని, లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ ఒక 'లొట్టపీస్' కేసు

ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసు ఒక 'లొట్టపీస్ కేసు' అని కేటీఆర్ కొట్టిపారేశారు. సినిమా వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశామని చెబుతున్న వారు.. కనీసం ఒక్క ఆధారాన్నైనా ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. జూలై 28న తాను కోర్టు విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. అలాగే, పార్లమెంట్‌లో డీలిమిటేషన్ (Delimitation) జరిగినా దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతంగా యథాతథంగా కొనసాగితేనే ఆ బిల్లుకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

73 సార్లు ఢిల్లీకి వచ్చి.. 73 పైసలైనా తెచ్చాడా?

టీఆర్ఎస్ (TRS) అనే పేరు తమ 22 ఏళ్ల బ్రాండ్ అని, ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసిందని, ఆ పేరును ఎవరైనా వాడుకోవాలని చూస్తే ఉద్దేశపూర్వకంగా నష్టం చేయడమేనని, తాము ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 73 సార్లు ఢిల్లీకి వచ్చినా, రాష్ట్రానికి కనీసం 73 పైసలైనా తెచ్చాడా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం ప్రజల దృష్టి మరల్చడంలో పీహెచ్‌డీ చేశారని, ఇజ్రాయెల్, ఇరాన్‌లలో ఇళ్లు కూల్చినట్లు హైదరాబాద్‌లో పేదల ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెడితే ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని సీఎం తీరును ఎండగట్టారు.

Advertisement
Advertisement