త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | నిందితుడికి ఉరిశిక్ష విధించాలి : క‌ల్వ‌కుంట్ల క‌విత‌

Kavitha | ఖమ్మంలో అత్యాచారయత్నానికి గురై ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, చిన్నారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులను కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు.

P

Telangana | Published On Jun 13, 2026, 3.34 pm IST

Kavitha | నిందితుడికి ఉరిశిక్ష విధించాలి : క‌ల్వ‌కుంట్ల క‌విత‌
Advertisement
  • బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
  • నిమ్స్‌లో ఖమ్మం బాధితురాలికి ప‌రామ‌ర్శ‌

Kavitha | ఖమ్మంలో అత్యాచారయత్నానికి గురై ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, చిన్నారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులను కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన ఘటన హృదయ విదారకమ‌న్నారు. ఈ దారుణానికి కారణమైన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదనతో తన కుమార్తె జీవితాంతం మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారని పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రభుత్వ పెద్దలే కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుడిపై కఠినమైన చట్టాలు ప్రయోగించి త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని అన్నారు. శిక్షల అమలులో జాప్యం జరిగితే నేరస్థుల్లో భయం ఉండదని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి, ప్రస్తుతం భవనం పై నుంచి పడి నడవలేని స్థితికి చేరుకోవడం అత్యంత బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జీవితాంతం కూడా ఆ బాలిక మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఉందని అన్నారు.

బాధితురాలి తల్లిదండ్రులు కూలీలని, చిన్నారిని జీవితాంతం సంరక్షించాల్సిన బాధ్యత వారిపై పడిందని తెలిపారు. అయితే ఆ కుటుంబానికి తగిన ఆర్థిక స్థోమత లేదని, వారికి సొంత ఇల్లు కూడా లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఒకేసారి ఆర్థిక సాయం అందించాలన్నారు. లేకపోతే నెలకు రూ.50 వేల పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితుడు భవిష్యత్తులో బెయిల్‌పై విడుదలై బాధిత కుటుంబంపై దాడి చేసే అవకాశం కూడా లేకపోలేదని, అందువల్ల వారికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో మైనర్లపై ప్రతిరోజూ ఐదు అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలపై సరైన దృష్టి సారించడం లేదని విమర్శించారు. వెంటనే సమీక్ష నిర్వహించి ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మహిళలకు భరోసా కల్పించాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
Advertisement