త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్

RS Praveen Kumar | కాళేశ్వరం ప్రాజెక్టుపై వ‌స్తున్న విమర్శలను బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ తొప్పికొట్టారు. కాళేశ్వరం కూలేశ్వరం కాదని, ప్రాజెక్టులో కేవలం రూ.500 కోట్ల విలువైన రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని చెప్పారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ చిరుమళ్ల రాకేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

P

Telangana | Published On Aug 4, 2026, 7.26 pm IST

RS Praveen Kumar | కాళేశ్వరం కూలేశ్వరం కాదు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్
Advertisement

RS Praveen Kumar | కాళేశ్వరం ప్రాజెక్టుపై వ‌స్తున్న విమర్శలను బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ తొప్పికొట్టారు. కాళేశ్వరం కూలేశ్వరం కాదని, ప్రాజెక్టులో కేవలం రూ.500 కోట్ల విలువైన రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని చెప్పారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ చిరుమళ్ల రాకేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 2004 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కుదరలేదని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించలేదని, 2008 నుంచి 2014 వరకు కూడా తుమ్మిడిహట్టి అంశంపై ఒప్పందం జరగలేదన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత తుమ్మిడిహట్టి అంశంపై మహారాష్ట్రతో చర్చలు జరిపారని, అయితే 152 మీటర్లకు వారు అంగీకరించలేదని చెప్పారు. తుమ్మిడిహట్టి సాధ్యం కాకపోవడంతోనే మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చాల్సి వచ్చిందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద కేవలం 40 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, మేడిగడ్డ వద్ద 240 టీఎంసీల నీరు అందుబాటులో ఉండటంతో అక్కడ నిర్మాణం చేపట్టారని వివరించారు.

వ్యవస్థను తప్పుబట్టడం స‌రికాదు..

దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా పూర్తయిన ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ఒకటని ఆయన పేర్కొన్నారు. లక్ష కోట్ల వ్యయం ఉన్న ప్రాజెక్టులో రూ.500 కోట్ల విలువైన రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయని, అంటే మొత్తం వ్యయంలో 0.5 శాతం మాత్రమేనని అన్నారు. రూ.99,500 కోట్ల విలువైన ప్రాజెక్టు యథావిధిగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశం లాంటిదని, అందులోని ఒక భాగానికి సమస్య వస్తే మొత్తం వ్యవస్థను తప్పుబట్టడం సరికాదని అన్నారు. ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించవచ్చన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, లిఫ్ట్‌ చేయకుండా నీరు గ్రావిటీ ద్వారా వెళ్లదని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణం చేపట్టినా లిఫ్ట్‌ వ్యవస్థ అవసరమయ్యేదన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 2016 ఆగస్టు 4న వినియోగంలోకి వచ్చిందని, అంతకుముందు 2008 ఆగస్టులో వైఎస్‌ శంకుస్థాపన చేసినా కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం బాహుబలి మోటార్లను ఏర్పాటు చేసి మిడ్‌ మానేరు వరకు నీటిని తరలించిందని, ప్రస్తుతం అవే మోటార్లు పనిచేస్తున్నాయని తెలిపారు.

ఎల్లంప‌ల్లి కాళేశ్వ‌రంలో భాగ‌మే..

ఎన్‌డీఎస్‌ఏను సాకుగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఎల్లంపల్లి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని, ఎల్లంపల్లిలోని 20 టీఎంసీల నీరు, కాళేశ్వరం 240 టీఎంసీల ప్రాజెక్టులో భాగమని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా కరవు పరిస్థితులు నెలకొన్నాయని, ఇటీవల అల్పపీడనం కారణంగా కొంత వర్షం పడినా రానున్న ఎనిమిది నెలలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టే ఆధారమని అన్నారు. కన్నెపల్లి వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి ఉంటే ఇప్పటికే నీటిని లిఫ్ట్‌ చేసేవాళ్లమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ముందు చూపు లేదని విమర్శించారు. మెస్సీతో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపిస్తూ, ఆ మొత్తాన్ని కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి వినియోగించి ఉంటే పనులు పూర్తయ్యేవని అన్నారు. రేవంత్‌రెడ్డి ఇంజినీర్లను అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రులు కన్నెపల్లి ప్రాంతానికి వెళ్లకుండా ఎస్‌ఆర్‌ఎస్‌పీకి వెళ్లారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాధారమని, దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సురక్షితంగానే ఉన్నాయని చెప్పారు.

రేవంత్‌రెడ్డికి క‌ల‌లో కూడా కేసీఆర్ క‌నిపిస్తున్న‌రు

రేవంత్‌రెడ్డికి కలలో కూడా కేసీఆర్‌ కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ మరమ్మతులకు ముందుకు వచ్చినా కేసీఆర్‌పై రాజకీయ కక్షతో పనులు చేయించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతను ఎన్నికల్లో చూపించుకోవాలని, కానీ ప్రజలకు నీళ్లు అందించాల్సిన బాధ్యతను మరవొద్దని అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్దమనసుతో వ్యవహరించాలని సూచించారు. శ్రీరాంసాగర్‌ రివర్స్‌ పంపింగ్‌ ప్రారంభించినా, వరద కాలువకు మరమ్మతులు చేయకపోవడంతో అది నిలిచిపోయిందని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement