త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM eBus Sewa | వరంగల్‌కు మరో 100 ఎలక్ట్రిక్‌ బస్సులు.. వెల్ల‌డించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

PM eBus Sewa | వరంగల్‌ నగర ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు త్వరలో మరో వంద ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్ వై నాగిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-బస్‌ సేవా’ పథకం కింద ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

P

Telangana | Published On Aug 4, 2026, 6.20 pm IST

PM eBus Sewa | వరంగల్‌కు మరో 100 ఎలక్ట్రిక్‌ బస్సులు.. వెల్ల‌డించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
Advertisement

PM eBus Sewa | వరంగల్‌ నగర ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు త్వరలో మరో వంద ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్ వై నాగిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-బస్‌ సేవా’ పథకం కింద ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. వరంగల్‌, హనుమకొండ ప్రధాన బస్టాండ్లు, హనుమకొండ డిపోలో మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలు, డిపో నిర్వహణ, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం వరంగల్‌ రీజియన్‌లో 112 ఎలక్ట్రిక్‌ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.

బస్టాండ్లలో పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు, మహిళా ప్రయాణికుల భద్రత, వేచిచూసే హాళ్ల నిర్వహణ, బస్సుల సమయపాలనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నాగిరెడ్డి ఆదేశించారు. అనంతరం రీజినల్‌ మేనేజర్‌, డిపో మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశమైన ఆయన బస్సు రూట్లు, ప్రయాణికుల ఆక్యుపెన్సీ, ఉద్యోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా సురక్షితమైన, నాణ్యమైన ప్రయాణ సేవలు అందించడమే సంస్థ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రయాణికులకు సేవలందించడంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 9 వేలకుపైగా బస్సుల ద్వారా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించి, ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ ఎం రాజశేఖర్‌, చీఫ్‌ సివిల్‌ ఇంజినీర్‌ కవిత, వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ భవానీ ప్రసాద్‌తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement