త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kadiyam Kavya | బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదు.. డీలిమిటేషన్, మహిళా బిల్లుపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ కడియం కావ్య

Kadiyam Kavya | మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అనుస‌రిస్తున్న తీరుపై వరంగల్ ఎంపీ కడియం కావ్య (Kadiyam Kavya) ధ్వజమెత్తారు. తెలంగాణపై బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆపార్టీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

G

Telangana | Published On Apr 17, 2026, 6.44 am IST

Kadiyam Kavya | బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదు.. డీలిమిటేషన్, మహిళా బిల్లుపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ కడియం కావ్య
Advertisement

Kadiyam Kavya | త్రినేత్ర‌.న్యూస్‌: మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అనుస‌రిస్తున్న తీరుపై వరంగల్ ఎంపీ కడియం కావ్య (Kadiyam Kavya) ధ్వజమెత్తారు. తెలంగాణపై బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆపార్టీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని ఇండియా–పాకిస్థాన్ విభజనతో పోల్చడం తీవ్రంగా అభ్యంతరకరమని పేర్కొన్నారు. తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల త్యాగాలను అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఏండ్ల‌ పోరాట ఫలితమని, ప్రజల భావోద్వేగాలను గౌరవించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు.

బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు

తెలంగాణ ఏర్పాటును `బ్లాక్ డే`గా పేర్కొంటూ వస్తున్న బీజేపీ, ఎన్డీఏ కూటమి వైఖరిని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని హెచ్చరించారు.

అమిత్ షా లెక్కలపై..

హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారని, అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతున్న సీట్ల గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని విమ‌ర్శించారు. దేశ జీడీపీకి దక్షిణాది రాష్ట్రాలు గణనీయమైన వాటా అందిస్తున్నప్పటికీ, డీలిమిటేషన్ ద్వారా అన్యాయం జరుగుతున్న‌దని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణ విధానాలను కచ్చితంగా అమలు చేసిన రాష్ట్రాలే ఇప్పుడు నష్టపోతున్నాయన్నారు.

మహిళా రిజర్వేషన్‌పై కాంగ్రెస్ పాత్ర

మహిళా రిజర్వేషన్‌కు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీనేనని, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసిన చరిత్ర ఉందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ కలను పీవీ నరసింహరావు సాకారం చేశారని గుర్తు చేశారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయకుండా ఆలస్యం చేయడంపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కులగణన లేకుండా న్యాయం ఎలా?

కులగణన నిర్వహించకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఈ వర్గాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఈ బిల్లును తీసుకురావడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని మండిపడ్డారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్న‌దని విమర్శించారు.

ప్రధానిపై ప్రశ్నల వర్షం

మహిళల పట్ల ప్రేమ ఉందని చెప్పే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మహిళలపై జరిగిన అన్యాయ ఘటనల్లో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాధితులకు కనీసం సంఘీభావం తెలియజేయకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో ప్రతి మహిళా శక్తి స్వరూపిణి అని, మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు కేంద్ర బీజేపీ చేస్తుందని విమర్శించారు.

తెలంగాణ హక్కులపై రాజీ లేదు

తెలంగాణకు రావాల్సిన హక్కులు, వనరులు ఇంకా అందలేదని పేర్కొంటూ, మాటలకే పరిమితం కాకుండా కార్యరూపంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా బిల్లులో మార్పులు చేయాలని ఎంపీ కావ్య‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement