త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janpahad Dargah Ursu | జాన్‌ప‌హాడ్ దర్గా ఉర్సు ప్రారంభం.. మూడు రోజుల‌పాటు జాత‌ర‌

Janpahad Dargah Ursu | మ‌త‌సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా నిలిచే సూర్యాపేట జిల్లా పాల‌క‌వీడు మండ‌లంలోని జాన్‌ప‌హాడ్ ద‌ర్గా ఉర్సు (Janpahad Dargah Ursu) వైభ‌వంగా ప్రారంభ‌మైంది.

G

Telangana | Published On Jan 22, 2026, 12.08 pm IST

Janpahad Dargah Ursu | జాన్‌ప‌హాడ్ దర్గా ఉర్సు ప్రారంభం.. మూడు రోజుల‌పాటు జాత‌ర‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మ‌త‌సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా నిలిచే సూర్యాపేట జిల్లా పాల‌క‌వీడు మండ‌లంలోని జాన్‌ప‌హాడ్ ద‌ర్గా ఉర్సు (Janpahad Dargah Ursu) వైభ‌వంగా ప్రారంభ‌మైంది. గురువారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే గుసుల్‌ కార్యక్రమంతో జాత‌ర షురూ అయ్యింది. ముజావర్‌ జానీ ఇంటి నుంచి తెచ్చిన పవిత్ర గంధాన్ని బాబా సమాధులపై సమర్పించి నూతన చాదర్‌, దట్టీలు, రకరకాల పూలతో బాబాను అలంకరించారు.

బాబా సమాధుల వద్ద ఖవ్వాలీ, డప్పు వాయిద్యాల నడుమ ఉల్సా ఈ సిరత్‌ అల్లా నమాజ్‌ నిర్వహించారు. ఈ ప్రార్థనలు పూర్తయిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. మూడు రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ జాత‌రకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. దర్గాను దర్శించుకుని అనంతరం సమీపంలోని నాగుల పుట్ట వద్ద పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.

ఉర్సులో ప్రధాన ఘట్టమైన ప‌విత్ర గంధోత్స‌వం శుక్రవారం జ‌రుగ‌నుంది. వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనల నడుమ తయారుచేసిన పవిత్ర గంధాన్ని దర్గా పూజారి ఇంటికి చేరుస్తారు. ఉదయాన్నే గంధాన్ని దర్గా సమీపంలోని సందల్‌ఖానాకు తరలించి మతపెద్దల సమక్షంలో ఈద్‌ జుమా నిర్వహిస్తారు.

అనంతరం అశ్వంపై జాన్‌పహాడ్‌, కల్మేట్‌తండా, చెరువుతండా గ్రామాల పుర వీధుల్లో గంధాన్ని ఊరేగించ‌నున్నారు. అనంత‌రం గంధాన్ని సైదులు బాబా సమాధులపై సమర్పిస్తారు. గంధం ఊరేగింపు కార్యక్రమానికి మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరవ‌నున్నారు. శ‌నివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపారాధ కార్యక్రమం నిర్వహించి ఉర్సు ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.

Advertisement

తాజావార్తలు

Advertisement