త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy Press Meet | మీరు ముగ్గురూ అసెంబ్లీకి రాకండి.. అసలు ఎమ్మెల్యేలే కాకండి

రేవంత్ రెడ్డి 1000 రోజుల పాలన, కాంగ్రెస్ పథకాల అమలుపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని విమర్శించిన కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

J

Telangana | Published On Sep 2, 2026, 5.37 pm IST

Jagga Reddy Press Meet | మీరు ముగ్గురూ అసెంబ్లీకి రాకండి.. అసలు ఎమ్మెల్యేలే కాకండి
Advertisement
  • సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ, సంక్షేమ పథకాలు అందాయని జగ్గారెడ్డి వెల్లడి
  • కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు.. సోనియా గాంధీ భిక్షతోనే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారని చురకలు
  • మహిళలకు ఉచిత బస్సు, రూ.500 సిలిండర్, 70 వేల ఉద్యోగాలతో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని స్పష్టీకరణ
  • సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్

Jagga Reddy Press Meet | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలనలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించిందని ప్రశంసిస్తూనే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

1000 రోజుల్లో స్వేచ్ఛ, సంక్షేమం

గత పదేళ్ల కేసీఆర్ (KCR) పాలనలో అడుగడుగునా ఆంక్షలు ఉండేవని, కాంగ్రెస్ వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు, యువకులకు, ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ (Freedom) లభించిందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ధర్నాలు చేయాలన్నా, సచివాలయానికి వెళ్లాలన్నా ఇప్పుడు పోలీసుల అడ్డంకులు లేవన్నారు. కేవలం వెయ్యి రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, 250 యూనిట్ల ఫ్రీ కరెంట్, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ట్రీట్‌మెంట్ లాంటి ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ (Schemes) అమలు చేస్తున్న ఘనత రేవంత్ సర్కార్‌దేనని ప్రశంసించారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను, కాంగ్రెస్ కేవలం వెయ్యి రోజుల్లో 70 వేల మందికి ఇచ్చిందని, అలాగే రుణమాఫీ కూడా చేసిందని గుర్తు చేశారు.

భిక్ష పెడితే.. తిన్నింటి వాసాలు లెక్కపెడతారా?

రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. "కాంగ్రెస్ నాయకులను లుచ్చా అంటావా.. మరి నువ్వు లంగవా?" అంటూ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఇచ్చి ఏపీలో కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ బలిదానం చేసుకున్నారని, ఆనాడు ఢిల్లీలో వాళ్ల ఇంటి చుట్టూ భజన చేసిన కేసీఆర్.. తీరా తెలంగాణ వచ్చాక దళితుడిని సీఎం చేస్తానన్న మాట తప్పి తానే కుర్చీలో కూర్చున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయం వల్లనే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారన్న నిజం మర్చిపోయి.. ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో ప్రాణాలు కోల్పోలేదని, వేరే కుటుంబాలు బలిదానాలు చేశాయని గుర్తు చేశారు. అధికారం పోగానే నీళ్లు లేని చేపల్లా బీఆర్ఎస్ నేతలు గిలగిల కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్‌కు బహిరంగ సవాల్

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే కాంగ్రెస్ అమలు చేస్తున్న ఉచిత బస్సు, ఫ్రీ కరెంట్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. పదేళ్లలో మీరు ఏ ఊర్లోనైనా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టారా? అని ప్రశ్నించిన ఆయన.. కాంగ్రెస్ కడుతున్న ఇందిరమ్మ ఇండ్లను చూపిస్తాం రావాలన్నారు. ప్రతిపక్షంగా సరైన అంశాలపై చర్చ చేయలేని ఆ ముగ్గురు నేతలు అసెంబ్లీకే రాకపోవడం మంచిదని జగ్గారెడ్డి చురకలంటించారు.

Advertisement
Advertisement