త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR Rule | కేసీఆర్ పాల‌న‌పై రేవంత్ విమ‌ర్శ‌లు అర్థ‌ర‌హితం

KCR Rule | సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పదేళ్ల కేసీఆర్‌ పాలనపై అర్థరహితమైన విమర్శలు చేశారని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. ఇప్పుడే కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందన్నట్టుగా, గతంలో ఎన్నడూ రాష్ట్రాన్ని పాలించలేదన్నట్టుగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

P

Telangana | Published On Aug 18, 2026, 4.20 pm IST

KCR Rule | కేసీఆర్ పాల‌న‌పై రేవంత్ విమ‌ర్శ‌లు అర్థ‌ర‌హితం
Advertisement
  • వైద్యరంగంలో బీఆర్‌ఎస్‌ హయాంలోనే భారీ మార్పులు
  • కాంగ్రెస్ 55 ఏళ్ల పాల‌న‌లో నీళ్లు కూడా ఇవ్వ‌లేని దుస్థితి
  • మాజీ మంత్రి సీ ల‌క్ష్మారెడ్డి

KCR Rule | సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పదేళ్ల కేసీఆర్‌ పాలనపై అర్థరహితమైన విమర్శలు చేశారని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. ఇప్పుడే కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందన్నట్టుగా, గతంలో ఎన్నడూ రాష్ట్రాన్ని పాలించలేదన్నట్టుగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 80 ఏళ్లలో 55 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌ పాలించినా కనీసం మంచి నీళ్లు కూడా సరిగా ఇవ్వలేకపోయిందని లక్ష్మారెడ్డి అన్నారు. తాము పాలించింది తొమ్మిదిన్నరేళ్లేనని, అందులో రెండేళ్లు కరోనా సమయమేనని తెలిపారు. ఏడున్నరేళ్లలో కేసీఆర్‌ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, వాస్తవాలు ప్రజలకు తెలుసని అన్నారు. 70 ఏళ్ల చెడును వదిలించేందుకు బీఆర్‌ఎస్‌కు సమయం పట్టిందని, కేసీఆర్‌ ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

నేను వస్తా సర్కార్‌ దవాఖానకు అనే స్థితికి తెచ్చాం..

కాంగ్రెస్‌ హయాంలో ఉన్న ‘నేను రాను బిడ్డో సర్కార్‌ దవాఖానకు’ అనే పరిస్థితి నుంచి ‘నేను వస్తా సర్కార్‌ దవాఖానకు’ అనే స్థితికి బీఆర్‌ఎస్‌ తీసుకొచ్చిందని లక్ష్మారెడ్డి అన్నారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. టిమ్స్‌ ఆలోచన, స్థలాల గుర్తింపు, భూసేకరణ, సమస్యల పరిష్కారం అన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలోనే పూర్తి చేశామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఆలస్యమై ఇంకా పూర్తికాలేదన్నారు. ఏడాదిలోనే సనత్‌నగర్‌ టిమ్స్‌ పూర్తి కావాల్సి ఉన్నా.. కేసీఆర్‌కు పేరు వస్తుందని ఆలస్యం చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఐదు వైద్య కళాశాలలను బీఆర్‌ఎస్‌ హయాంలో 34కు పెంచామని లక్ష్మారెడ్డి అన్నారు. దీంతో మెడిసిన్‌ చదవాలన్న పేదల కల నెరవేరిందని, మెడికల్‌ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా వైద్య విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు.

ఐసీయూలు లేని దుస్థితి..

కేసీఆర్‌ వైద్య రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూలు లేని పరిస్థితి ఉండేదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చర్యలతో ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు మాయమయ్యాయని అన్నారు. కోవిడ్‌కు ముందు రాష్ట్రంలో 1,400 ఆక్సిజన్‌ పడకలు ఉంటే.. బీఆర్‌ఎస్‌ హయాంలో వాటి సంఖ్యను 34 వేలకు పెంచామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అన్నీ సిద్ధం చేసి, పనులు చేసిన వాటిని పూర్తి చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రెండేళ్లు పట్టిందని విమర్శించారు. జిల్లా ఆస్పత్రుల్లో ఉచిత డయాలసిస్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించామని లక్ష్మారెడ్డి తెలిపారు. బస్తీ దవాఖానాలను కేసీఆర్‌ హయాంలోనే ప్రారంభించామని, ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నస్టిక్‌ సేవలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. నిమ్స్‌ ఆస్పత్రిని 2 వేల పడకలకు విస్తరించే ప్రణాళిక కేసీఆర్‌ పాలనలోనే మొదలైందని, ప్రస్తుతం జరుగుతున్న పనులను పూర్తి చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కోరారు. వైద్య రంగానికి బడ్జెట్‌లో మూడింతల నిధులు పెంచింది కేసీఆర్‌ హయాంలోనేనని అన్నారు.

ప్ర‌భుత్వాసుప‌త్రాల్లో ప్ర‌స‌వాలు పెరిగిన‌య్‌

మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించి విషజ్వరాలు, అంటువ్యాధులను నివారించామని తెలిపారు. హరితహారం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచి ఆక్సిజన్‌ అందుబాటును పెంచామని, ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం నాణ్యమైన వైద్య సేవలను బీఆర్‌ఎస్‌ పాలనలోనే అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన వైద్య సామగ్రిని సమకూర్చిన ఘనత కేసీఆర్‌దేనని లక్ష్మారెడ్డి అన్నారు. కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌ పథకాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల రేటును గణనీయంగా పెంచగలిగామని తెలిపారు. కరోనా సమయంలో దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులో ఉంచి ప్రజల ప్రాణాలను కాపాడింది కేసీఆర్‌ పాలనేనని అన్నారు. మాతా శిశు మరణాల రేటును రికార్డు స్థాయిలో తగ్గించగలిగామని పేర్కొన్నారు.

ఫామ్‌హౌస్‌ల‌పై దుష్ప్ర‌చారం

ప్రగతిభవన్‌లో అన్ని గదులు ఉన్నాయని, బంగారు బాత్‌రూమ్‌లు ఉన్నాయని ప్రచారం చేశారని.. అది వట్టిదేనని అందరికీ తెలిసిపోయిందని లక్ష్మారెడ్డి అన్నారు. ఇప్పుడు ఫార్మ్‌హౌస్‌లు కట్టుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్‌ది చిన్న వ్యవసాయ క్షేత్రం మాత్రమేనని చెప్పారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనపై దుష్ప్రచారం ఆపి.. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తే మంచిదని లక్ష్మారెడ్డి అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్‌, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, వాల్యానాయక్‌, బీఆర్‌ఎస్‌ నేతలు గోసుల శ్రీనివాస్‌యాదవ్‌, అభిలాష్‌ రంగినేని పాల్గొన్నారు.

Advertisement
Advertisement