Cashless Employees Health Scheme | హెల్త్కార్డ్ సవ్యంగా అమలయ్యేనా..?
Cashless Employees Health Scheme | ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు రహిత వైద్యం (డిజిటల్ హెల్త్ కార్డ్), ప్రమాద బీమాపై ఉద్యోగుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి.
Cashless Employees Health Scheme | ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు రహిత వైద్యం (డిజిటల్ హెల్త్ కార్డ్), ప్రమాద బీమాపై ఉద్యోగుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. నూతన పథకం ద్వారా రాష్ట్రంలోని 23.51 లక్షల మంది ఉద్యోగులు, పదవీ విరమణ చేసినవారు, వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. కానీ దీని విధివిధానాలను ప్రభుత్వం ఇప్పటికీ ఖరారు చేయకపోవడంతో ఉద్యోగుల్లో వివిధ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం ఉద్యోగులంతా ఎదురుచూస్తున్నారు. పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేయనున్నారనే అంశంపై ఉద్యోగుల్లో పెదవి విరుస్తున్నారు. ట్రస్ట్ను నమ్మేదెలా అని ప్రశ్నిస్తున్నారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక 'డిజిటల్ హెల్త్ కార్డ్' అందజేస్తారు. ఇందులో భాగంగా సుమారు 2000 రకాల వ్యాధులకు ఎటువంటి ముందస్తు చెల్లింపులు లేకుండా చికిత్స (Cashless Treatment) పొందే వెసులుబాటు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, 421 గుర్తింపు పొందిన (Empanelled) ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ కార్డు ద్వారా వైద్యం పొందవచ్చు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ దీనిని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేయనున్నారు అనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రస్ట్ నిర్వహణలో ఎక్కువగా ప్రతికూలతలే ఉంటాయి. క్లెయిమ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం వృత్తిపరమైన అర్హతగల వైద్యులు, ఐటీ నిపుణులు, ఆడిటర్లను నియమించుకోవాలి. ఈ అంశంలో దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పట్టించుకోవడం లేదు. ఇక ప్రైవేట్ బీమా సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ట్రస్టులు ఆసుపత్రి క్లెయిమ్లను పరిష్కరించడంలో జాప్యం చేస్తాయి. దీంతో తమకు రావాల్సిన బిల్లులు సకాలంలో రావడం లేదని పేర్కొంటూ ప్రైవేట్ ఎంప్యానెల్డ్ ఆసుపత్రులు సేవలను నిరాకరించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయాలలో చికిత్సకు అవసరమైన నిధులను ప్రభుత్వమే భరించాలి. ఒకవేళ భారీ స్థాయిలో వ్యాధి ప్రబలినా లేదా శస్త్రచికిత్సలు అవసరమైతే ప్రభుత్వం తక్షణమే అదనపు నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో వాటికే నిధులు సరిపడా అందుబాటులో లేని పరిస్థితిని అందరూ చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రస్ట్ నిర్వహణపై అనేక అనుమానాలు ఉద్యోగుల్లో ఉండడం సహజం.
ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ నిర్వహణ అసాధ్యమైనదేమీ కాదు. దేశంలోని ఇతర రాష్ట్రాలు ప్రధానంగా మూడు విధానాలను అనుసరిస్తున్నాయి. మొదటిది ఇన్స్యూరెన్స్ విధానం. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఈ విధానంలో ఉద్యోగి వేతనం నుంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ కోసం కొంత సొమ్ము కట్ చేస్తారు. ఇక దీని నిర్వహణ సదరు ఇన్స్యూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది. రెండోది ప్రభుత్వమే స్వయంగా నిర్వహించడం. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల నుంచి ఎలాంటి రుసుము తీసుకోకుండా వారికి నగదు రహిత చికిత్సను అందజేస్తోంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల చికిత్సకు ప్రభుత్వమే గ్రీన్ చానల్ ద్వారా నేరుగా ఆసుపత్రులకు సొమ్మును చెల్లిస్తుంది. ఇక మూడోది ట్రస్ట్ విధానం. దీనిని మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగులను A,B,C,Dగా వర్గీకరణ చేసి 250 నుండి 1000 రూపాయల వరకు ప్రీమియం రూపంలో వసూలు చేస్తుంది.
ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ డిజిటల్ కార్డులలో 1.5% ప్రీమియం వసూలు చేయాలని నిర్ణయించారు. దీనివలన ఎక్కువ మంది ఉద్యోగులు నెలనెలా రూ.వెయ్యికి పైనే చెల్లించాల్సి ఉంటుంది. ఇంత మొత్తంలో ప్రీమియం ఏ రాష్ట్రంలోనూ లేదు. సాధారణంగా ఇంత మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే అనేక బీమా కంపెనీలు మంచి పాలసీలను అందుబాటులో ఉన్నాయి. ఆ విధానంలోనే ఉద్యోగుల వేతనాల నుంచి ప్రీమియం సొమ్ము కట్ చేసినా ఎప్పటికప్పుడు ఆ సొమ్మును ట్రస్ట్లో జమచేస్తారా అనేదే ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనం నుంచి ప్రతీ నెలా కొంత సొమ్మును జీపీఎఫ్ నిమిత్తం చెల్లిస్తారు. ఆ సొమ్మును అవసరమైనప్పుడు తక్కువ రుణంతో తిరిగి పొందే వెసులుబాటు ఉంటుంది. కానీ తాము దాచుకున్న జీపీఎఫ్ సొమ్ములో నుంచి లోన్ కోసం ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు ఇప్పటికే ప్రభుత్వం వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రస్టును ట్రస్ట్ చేయడం ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు నగదు రహిత వైద్యం విషయంలో ప్రభుత్వం ఏదైనా పరిమితులు విధిస్తుందా అనే సందేహం కూడా ఉంది. ప్రమాద బీమా రూ.పది లక్షలుగా ప్రకటించినప్పటికీ, ఇది కుటుంబంలోని ఒక్కో వ్యక్తిపైన అమలవుతుందా లేదా కుటుంబం మొత్తానికా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. నగదు రహిత వైద్యం పథకం అమలు కోసం ప్రతి ఉద్యోగి మూల వేతనంలో 1.5 శాతం మొత్తాన్ని ప్రీమియంగా జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిని అన్ని హోదాల్లో ఒకే విధంగా అమలు చేస్తారా లేక కేటగిరీ వారీగా వేర్వేరుగా ఉంటుందా అనేది సైతం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సిన అవసరం ఉంది.
తానిపర్తి తిరుపతిరావు
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
జెడ్పీహెచ్ఎస్, పూసాల
సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా
6305597540
ttrpdpl@gmail.com
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






