త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | తెలంగాణ‌.. పోక్సో కేసులకు చిరునామా అవుతుందేమో

RS Praveen Kumar | తెలంగాణ పోక్సో కేసుల‌కు చిరునామా అవుతుందేమోన‌నే భ‌యం వేస్తుంద‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాలు తాగినందుకు బండి సంజయ్‌కు జ్వరం వచ్చిందో లేదో కానీ, పేట్ బషీరాబాద్ కేసుతో తెలంగాణ ప్రజలందరికీ జ్వరం వచ్చిందని వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Jun 12, 2026, 3.23 pm IST

RS Praveen Kumar | తెలంగాణ‌.. పోక్సో కేసులకు చిరునామా అవుతుందేమో
Advertisement
  • సీఎం రేవంత్ శాంతిభ‌ద్ర‌త‌ల‌ను గాలికొదిలేశారు
  • మంత్రి సీత‌క్క బాలిక‌ల గురించి కూడా రీల్స్ చేయాలి
  • ఖ‌మ్మం బాధిత బాలిక‌ను ఆమె ఎందుకు ప‌రామ‌ర్శించ‌లే
  • చైల్డ్ హెల్ప్ లైన్ 1098పై అవ‌గాహ‌న క‌ల్పించాలి
  • మీడియా స‌మావేశంలో ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఫైర్‌

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ పోక్సో కేసుల‌కు చిరునామా అవుతుందేమోన‌నే భ‌యం వేస్తుంద‌ని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఖమ్మం బాధిత బాలికను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు పరామర్శించలేదని ప్ర‌శ్నించారు. పాలు తాగినందుకు బండి సంజయ్‌కు జ్వరం వచ్చిందో లేదో కానీ, పేట్ బషీరాబాద్ కేసుతో తెలంగాణ ప్రజలందరికీ జ్వరం వచ్చిందని వ్యాఖ్యానించారు.

మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు వెన్నుపోటు పొడుస్తున్న‌రేమో..

మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడవడంలో సీఎం బిజీగా ఉన్నారేమో.. బాలికల గురించి పట్టించుకుంటారా? రీల్స్ చేసే మంత్రి సీతక్క బాలికల గురించి కూడా రీల్స్ చేయాలి. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. తెలంగాణ పోక్సో కేసులకు రాజధాని, చిరునామా అవుతోందన్న బాధ కలుగుతోంది. ఖమ్మం ఉదంతంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోకుండా కేసు నమోదు చేయడం అభినందనీయం. ఖమ్మం పోలీసులు ఒక్క రోజులోనే నేరస్థున్ని అరెస్ట్ చేస్తే... పేట్ బషీరాబాద్ పోలీసులు మిగతా వారిని కనీసం ఎందుకు విచారణ చేయడం లేదు? అని ప్ర‌వీణ్‌కుమార్ నిల‌దీశారు.

ప్రేమ కోసం వెంప‌ర్లాడే చిన్నారులకు వ‌ల‌..

పేట్ బషీరాబాద్ కేసు నెల రోజులైనా ఒక్కరితోనే ఎందుకు ఆగిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నేత సంగప్పను ఎందుకు విచారణ చేయడం లేదు? 99 శాతం పోక్సో కేసుల్లో నేరస్థులు తెలిసిన వారే ఉంటున్నారు. తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. పిల్లలను దయచేసి ఒంటరిగా వదలవద్దు. ఎవరితో తిరుగుతున్నారో గమనించాలి. నేరస్థులు గ్రూమింగ్ టెక్నిక్‌తో ఇబ్బందుల్లో ఉండి ప్రేమ కోసం వెంపర్లాడే చిన్నారులను ఎంపిక చేసుకుంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో తల్లిదండ్రులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పులను తల్లిదండ్రులు గమనించి జాగ్రతగా ఉండాలి అని ఆర్ఎస్పీ సూచించారు.

గుడ్ ట‌చ్‌, బ్యాడ్ ట‌చ్ గురించి బోధించాలి...

రేవంత్ రెడ్డి నేర్చుకున్న విద్య గురించి, వెన్నుపోట్ల గురించి గాంధీభవన్‌లోని కాంగ్రెస్ నేతలకు తెలియాలి. రేవంత్ రెడ్డి పాఠశాలల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలను మానుకోవాలి. పోక్సో నేరాల గురించి అవగాహన కలిగేలా.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చిన్నారులకు బోధించేలా చూడాలి. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181కు కాల్ చేసేలా అవగాహన కల్పించాలి అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ పేర్కొన్నారు.

మార్ష‌ల్స్ ఆర్ట్స్ త‌ప్ప‌నిస‌రి చేస్తం..

బీఆర్ఎస్ 2.0లో చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ప్రజలందరికీ తెలిసేలా చర్యలు తీసుకుంటాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచుతాం. చిన్నారులకు అవగాహన కల్పించడంతో పాటు స్వీయ రక్షణ కోసం మార్షల్స్ ఆర్ట్స్ తప్పనిసరి చేస్తాం. బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ప్ర‌శ్నించారు.

Advertisement
Advertisement