త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్ల‌ను క‌ట్ చేసే భూతమే ‘స‌ర్‌’: పొంగులేటి

Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ బ‌లంగా ఉన్న‌చోట పార్టీ ఓట్ల‌ను తొల‌గించే భూత‌మే ‘స‌ర్‌’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ పాలిత‌ రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన కొన‌సాగుతోందని మండిపడ్డారు.

S

Telangana | Published On Jun 12, 2026, 5.02 pm IST

Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్ల‌ను క‌ట్ చేసే భూతమే ‘స‌ర్‌’: పొంగులేటి
Advertisement
  • 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్’ పేరిట లేపేసే ప్లాన్
  • బీహార్, బెంగాల్ ఫార్ములాను ఇక్కడా ప్రయోగిస్తున్న‌రు
  • నిన్న ఓట్లు.. నేడు సీట్లు దొంగిలిస్తున్న‌రు
  • పాలేరు బీఎల్ఏల‌ శిక్షణ శిబిరంలో మంత్రి పొంగులేటి తీవ్ర విమ‌ర్శ‌లు

Pongulet Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్: కాంగ్రెస్ బ‌లంగా ఉన్న‌చోట పార్టీ ఓట్ల‌ను తొల‌గించే భూత‌మే ‘స‌ర్‌’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ప్రభుత్వాలే ల‌క్ష్యంగా ప్రజాస్వామ్య విరుద్ధ కుట్రలకు తెరలేపిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత‌ రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన కొన‌సాగుతోందని మండిపడ్డారు. స‌ర్‌పై పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన శిక్షణ శిబిరంలో శుక్రవారం ఆయ‌న ముఖ్య అతిథిగా ప్ర‌సంగించారు.

ఎస్‌ఐఆర్ ఒక‌ దొంగదారి చర్య..

కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకువచ్చిన ‘ఎస్‌ఐఆర్’ ఒక పెద్ద భూతం లాంటిది. ఇది ముమ్మాటికీ దొంగదారి చర్య‌నే. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే ఓట్లు ఎక్కువగా ఉన్నాయో.. అక్కడ ఒక పద్ధతి ప్రకారం దాదాపు 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్ ఓట్లు’గా చిత్రీకరించి వాటిని జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోంది. ఓటరు వయస్సులో స్వల్ప తేడాలున్నా, పేర్లలో స్పెల్లింగ్ త‌ప్పులు (రావుకు బదులు రెడ్డి, హుస్సేన్ బదులు శ్రీ అని ఉండ‌డం) ఉన్నా వాటన్నింటినీ సాకుగా చూపి ఓట్లను లేపేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే బీహార్, వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారు. అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని చూస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలి అని పొంగులేటి పిలుపునిచ్చారు.

రాజ్య‌స‌భ స్థానాన్ని దొంగిలించారు..

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఉదంతాన్ని పొంగులేటి ప్రస్తావించారు. “మీనాక్షి నటరాజన్‌కు కావలసిన ఓట్ల కంటే 11 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ పాత ఎఫ్‌ఐఆర్ కాగితాన్ని సాకుగా చూపారు. ఎన్నికల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్రమంగా ఆమె నామినేషన్‌ను తిరస్కరింపజేశారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన ఒక రాజ్యసభ స్థానాన్ని వాళ్లు దొంగిలించారు. నేడు కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా సీట్ల‌నే దొంగిలించే దుస్థితికి దిగజారింది అని పొంగులేటి దుయ్య‌బ‌ట్టారు.

సీబీఐ, ఈడీలతో బెదిరింపులు..

బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలోని ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా వాడుకుంటోందని మంత్రి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్ టాక్స్ సంస్థలను అడ్డం పెట్టుకుని, వేరే పార్టీల తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఎక్క‌డ ఉన్నా ఇదే రకమైన దుర్మార్గపు పరిపాలన సాగుతోంది అని ఆయ‌న ఫైర‌య్యారు.

మ‌న‌కు దొంగ ఓట్లు అవ‌స‌రం లేదు..

జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు నిర్వహించే ‘ఓట్ మ్యాపింగ్’ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలు, చదువుల రీత్యా ఖమ్మం, హైదరాబాద్‌లలో ఉండేవారు అధికారులు వచ్చినప్పుడు ఊర్లో లేరనే సాకుతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. అధికారులు వచ్చే ముందే గ్రామంలో చాటింపు వేయించి వేరే ఊర్లలో ఉన్న మన ఓటర్లను రప్పించి ఓటు కాపాడుకోవాలి. మనకు దొంగ ఓట్లు అవసరం లేదు. మనకున్న జనాదరణతో ప్రతి ఓటునూ ఒక కాంక్రీట్ గోడ లాగా కాపాడుకోవాలి అని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీకి కార్యకర్తలంతా సైనికుల్లా అండగా నిలబడాలి. ఈ అక్రమ ఎస్ఐఆర్ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా తిప్పికొట్టాలి అని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, పీసీసీ ప్రతినిధి సుధాకర్, ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్, ఏదులాపురం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, 291 బూత్‌ల బి.ఎల్.ఏలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement