త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Krishna Basin | 299 టీఎంసీల‌కు ఒప్పుకున్న‌ది కేసీఆరే : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

Krishna Basin | ఉత్త‌ర తెలంగాణ‌కు సంబంధించిన కాళేశ్వ‌రంపై మోజు చూపి.. ద‌క్షిణ తెలంగాణ‌లోని పాల‌మూరు -రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌పై గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్యం చేసింద‌ని నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Jan 3, 2026, 4.45 pm IST

Krishna Basin | 299 టీఎంసీల‌కు ఒప్పుకున్న‌ది కేసీఆరే : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి
Advertisement

550 టీఎంసీలు కావాల‌ని
మేం ప‌ట్టుబ‌డుతున్నాం
బీఆర్ఎస్ వ‌ల్లే తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం
కాళేశ్వ‌రంపై మోజుతో
పాల‌మూరుపై ప‌క్క‌న పెట్టారు
ఇన్‌టేక్ పాయింట్‌ను
జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు
జూరాల నుంచి అయితే
414 మీట‌ర్ల లోతు నుంచి నీరు తీసుకునేవాళ్లం
శ్రీశైలానికి మార్చ‌డం వ‌ల్ల
560 మీట‌ర్ల ఎత్తు నుంచి తీసుకోవాల్సి వ‌స్తుంది
నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

Krishna Basin | త్రినేత్ర‌.న్యూస్ : ఉత్త‌ర తెలంగాణ‌కు సంబంధించిన కాళేశ్వ‌రంపై మోజు చూపి.. ద‌క్షిణ తెలంగాణ‌లోని పాల‌మూరు -రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌పై గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తీవ్ర నిర్ల‌క్ష్యం చేసింద‌ని నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. నీటి కేటాయింపులు ఉన్నా.. నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టులు మ‌న‌కు లేవు అని ఆయ‌న పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గోదావ‌రి, కృష్ణా జ‌లాల్లో మ‌న రావాల్సిన నీటి కేటాయింపుల కోసం ఆయా ట్రిబ్యున‌ల్స్, కేంద్రం వ‌ద్ద స‌మ‌ర్థ‌వంతంగా వాద‌న‌లు వినిపిస్తున్నామ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు. కృష్ణా జ‌లాల వినియోగంతో పాటు పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై శాస‌న‌స‌భలో నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణ‌హిత - చేవెళ్ల‌ను తుమ్మిడిహ‌ట్టి నుంచి మార్చి గోదావరిలో అన్యాయం చేశారు. పాల‌మూరును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి కృష్ణా బేసిన్‌లోనూ అన్యాయం చేశారు. జూరాల నుంచి అయితే 414 మీట‌ర్ల లోతు నుంచి నీరు తీసుకునేవాళ్లం. శ్రీశైలానికి మార్చ‌డం వ‌ల్ల 560 మీట‌ర్ల ఎత్తుకు నీరు ఎత్తిపోయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. జూరాల నుంచి అయితే 22 పంపుల ఏర్పాటుతో ప్రాజెక్టు పూర్త‌య్యేది. జూరాల నుంచి శ్రీశైలానికి మార్చ‌డం వ‌ల్ల పంపుల సంఖ్య 37కు పెరిగింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను నిర్ల‌క్ష్యం చేశారు. కావాల‌నే పాల‌మూరు ప్రాజెక్టును స్లోడౌన్ చేశారు. జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీలు త‌ర‌లించే అవ‌కాశం ఉంది. జూరాల నుంచి అయితే 60 రోజుల్లో 121 టీఎంసీలు తీసుకునే వాళ్లం. సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చ‌డం వ‌ల్ల 68 టీఎంసీల స్థాయికి ప‌డిపోయింది. ఆయ‌క‌ట్టు కాల్వ‌ల గురించి ప్ర‌స్తావ‌న‌, భూసేక‌ర‌ణ లేకుండానే డీపీఆర్ రూపొందించారు. శ్రీశైలం బ్యాక్ వాట‌ర్ నుంచి ఏపీ అక్ర‌మంగా నీరు త‌ర‌లిస్తుంటే చూస్తూ కూర్చున్నారు. ఏపీ ప్ర‌భుత్వం రోజుకు 13 టీఎంసీలు త‌ర‌లించుకుపోయేలా ప్రాజెక్టుల‌ను విస్త‌రించింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌లు ప్రాజెక్టు నిర్మిస్తుంటే బీఆర్ఎస్ క‌నీసం అభ్యంత‌రం చెప్ప‌లేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ఏపీ ప్ర‌భుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసి రాయ‌ల‌సీమ ప్రాజెక్టు ప‌నులు నిలిపివేయించాం అని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ప‌దేండ్ల కాలంలో రూ. 1,25,527.85 కోట్లు ఖ‌ర్చు

2014 నుంచి 2023 వ‌ర‌కు గోదావ‌రి బేసిన్‌లోని ప్రాజెక్టుల‌కు ప‌దేండ్ల కాలంలో రూ. 1,25,527.85 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌గా, ఇందులో మేజ‌ర్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు రూ. 124,608.65 కోట్లు, మీడియం ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు రూ. 919.2 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇక కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల‌కు మొత్తం రూ. 41,375.81 కోట్లు ఖ‌ర్చు చేయ‌గా, ఇందులో మేజ‌ర్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు రూ. 41,372.97 కోట్లు, మీడియం ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు రూ. 2.84 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని నీటిపారుద‌ల శాఖ మంత్రి వెల్ల‌డించారు.

కాళేశ్వ‌రం కాంట్రాక్ట‌ర్ల కోసం అద‌నంగా రూ. 27,237 కోట్లు ఖ‌ర్చు

గోదావ‌రి, కృష్ణా బేసిన్‌ల విష‌యంలో కాంగ్రెస్ పార్టీకి ఒక‌టే ఆలోచ‌న‌. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల‌ను కాంగ్రెస్ నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. ఈ లెక్క‌ల‌ను చూస్తుంటే కావాల‌నే బీఆర్ఎస్ కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల‌ను నిర్ల‌క్ష్యం చేసింది. అయితే కాళేశ్వ‌రం ప్రాజెక్టును 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీల‌కు పెంచింది బీఆర్ఎస్ ప్ర‌భుత్వం. అదే పాల‌మూరు - రంగారెడ్డికి 1.5 టీఎంసీ నుంచి ఒక టీఎంసీకి త‌గ్గించే కుట్ర చేశారు. కాళేశ్వ‌రంలో 2 నుంచి 3 టీఎంసీల‌ను పెంచ‌డానికి కాంట్రాక్ట‌ర్ల కోసం రూ. 27,237 కోట్ల‌ను అద‌నంగా ఖ‌ర్చు చేశారు. ఇవే పైస‌ల‌ను కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల‌కు ఖ‌ర్చు పెట్టి ఉంటే పాల‌మూరు ఎత్తిపోత‌ల పూర్త‌యి నీళ్లు పారేవి. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌, ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా స‌స్య‌శ్యామ‌లంగా ఉండేవ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ట్రిబ్యున‌ల్ ముందు సమ‌ర్థ వాద‌న‌లు..

ఇక కృష్ణా జ‌లాల విష‌యంలో బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ ప్ర‌కారం 2130 టీఎంసీల్లో ఉమ్మ‌డి ఏపీకి 811 టీఎంసీలు, క‌ర్ణాట‌క‌కు 734, మ‌హారాష్ట్ర‌కు 585 టీఎంసీలు కేటాయించారు. 2130 కంటే అద‌నంగా ఉన్న నీటిని ఉమ్మ‌డి ఏపీ వాడుకోవ‌చ్చ‌ని బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్‌లో ఉంది. త‌ద‌నంత‌రం వ‌చ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ కూడా కృష్ణా న‌దీ జ‌లాల వివాదంపై త్వ‌ర‌లోనే తీర్పు ఇవ్వ‌నుంది. మిగులు జ‌లాల కార‌ణంగా ఉమ్మ‌డి ఏపీకి కేటాయించిన 1005 టీఎంసీల‌పై తీర్పు వెలువ‌డ‌నుంది. ఇందులో 71 శాతం జ‌లాల‌ను తెలంగాణ‌కు కేటాయించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్‌లో స‌మ‌ర్థ‌వంతంగా వాదిస్తుంది అని మంత్రి తెలిపారు.

కేసీఆర్ తీవ్ర అన్యాయం.. రైతాంగానికి మ‌ర‌ణ శాస‌నం

కృష్ణా జలాల్లో తెలంగాణ‌కు 299 టీఎంసీలకు ఒప్పుకుని కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారు. తెలంగాణ‌కు 34 శాతం, ఏపీకి 66 శాతం వాటా ఒప్పుకుని తీవ్ర అన్యాయం చేశారు. ట్రిబ్యున‌ల్ తీర్పు వ‌చ్చే వ‌ర‌కు 299 టీఎంసీలు చాలు అని సంత‌కం పెట్టారు. ఆంధ్రాకు 512 టీఎంసీలు ఇవ్వాల‌ని సూచించారు. మొత్తంగా తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ మ‌ర‌ణ‌శాస‌నం రాసింది. కృష్ణా న‌దీ ప‌రివాహకం ప్ర‌కారం మ‌న‌కే అధిక వాటా రావాల్సి ఉంది. మేం అధికారంలోకి వ‌చ్చాక 550 టీఎంసీలు కావాల‌ని వాదించామ‌ని ఉత్త‌మ్ పేర్కొన్నారు.

39 వేల ఎక‌రాల భూసేక‌ర‌ణ పెండింగ్..

పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద 39 వేల ఎక‌రాల భూసేక‌ర‌ణ ఇంకా పెండింగ్‌లో ఉంది. పాల‌మూరు ప్రాజెక్టు వాట‌ర్ సోర్స్‌ను మార్చ‌డం వ‌ల్ల తీవ్ర‌మైన న‌ష్టం జ‌రిగింది. కృష్ణా జలాల విష‌యంలో నిరంత‌రం పోరాటం చేస్తున్నాం. తెలంగాణ‌కు 71 శాతం, ఏపీకి 29 శాతం కేటాయించాల‌ని ట్రిబ్యున‌ల్ ముందు, కేంద్ర ముందు వాదిస్తూ వ‌స్తున్నాం. ఇక జూరాల కాంప్లెక్స్ కింద 65.64 టీఎంసీల నీటిని కేటాయిస్తే.. బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక ఏ రోజు కూడా పూర్తిస్థాయిలో వినియోగించ‌లేదు. 2014 నుంచి 2023 వ‌ర‌కు నీటి పారుద‌ల శాఖ‌పై ల‌క్షా 80 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టినా ప్రాజెక్టులు పూర్తి చేయ‌లేదు. 65 టీఎంసీల‌కు గానూ స‌గ‌టున 41.48 టీఎంసీలు మాత్ర‌మే వాడుకున్నాం. అలాకెటేడ్ వాట‌ర్‌ను కూడా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప్ర‌జ‌లు ఉప‌యోగించుకోలేక‌పోయారు. ఎందుకంటే ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌లేదు అని నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement