త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | పంజాగుట్ట శ్మ‌శాన వాటిక‌లో ప‌సికందు మృత‌దేహం మాయం..

Hyderabad | హైద‌రాబాద్‌లోని (Hyderabad) పంజాగుట్ట శ్మశానవాటికలో (Panjagutta Crematorium) పసికందు మృతదేహం మాయం క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. పూడ్చిపెట్టిన నాలుగు రోజుల‌కే మృత‌దేహం (Infant Body Missing) క‌నింప‌చ‌క‌పోవ‌డం కుటుంబ స‌భ్యుల‌ను విస్మ‌యానికి గురిచేస్తున్న‌ది.

G

Telangana | Published On Aug 12, 2026, 10.49 am IST

Hyderabad | పంజాగుట్ట శ్మ‌శాన వాటిక‌లో ప‌సికందు మృత‌దేహం మాయం..
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని (Hyderabad) పంజాగుట్ట శ్మశానవాటికలో (Panjagutta Crematorium) పసికందు మృతదేహం మాయం క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. పూడ్చిపెట్టిన నాలుగు రోజుల‌కే మృత‌దేహం (Infant Body Missing) క‌నింప‌చ‌క‌పోవ‌డం కుటుంబ స‌భ్యుల‌ను విస్మ‌యానికి గురిచేస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్ప‌టికే ఘటనా స్థలంలో ఆధారాలను సేక‌రించిన అధికారులు.. స్మ‌శాన‌వాటిక నిర్వాహ‌కుల్లో న‌లుగురిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు.

చార్మినార్ ప‌రిధిలోని ఝాన్సీబజార్‌కు చెందిన దంపతులకు ఆరు నెలల క్రితం కవలలు పుట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి బంజారాహిల్స్‌లోని (Banjara hills) ఓ కార్పొరేట్ ద‌వాఖాన‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ ఓ ప‌సికందు గత శనివారం మృతి చెందింది. దీంతో కుటుంబ స‌భ్యులు మృత‌దేహాన్ని బంజారాహిల్స్ రోడ్‌నంబ‌ర్ 3లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో ఖననం చేశారు. దీనికిగాను శ్మ‌శాన వాటిక సిబ్బంది రూ.2,500 తీసుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

కాగా, క‌వ‌ల‌ల్లో మరో చిన్నారి ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో సోమ‌వారం (ఆగ‌స్టు 10న‌) రెండో ప‌సికందు మృత‌దేహాన్ని పంజాగుట్ట శ్మ‌శాన‌వాటికకు తీసుకెళ్లారు. అయితే మొద‌టి చిన్నారిని పూడ్చిన ప్రాంతంలో గుంత తీసి ఉండటాన్ని వారు గుర్తించారు. గోతిలో మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంట‌నే శ్మ‌శాన‌వాటిక సిబ్బందిని నిల‌దీశారు. వారి నుంచి స‌రైన స‌మాధానం రాక‌పోవ‌డంతో రెండో చిన్నారి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిశువు మృతదేహం పూడ్చిన ప్రదేశంలో వస్త్రం, చిన్న కాళ్లు, మాంసపు ముద్దలను ఈ సందర్భంగా క్లూస్ టీం గుర్తించింది. వాటిని డీఎన్‌ఏ (DNA) పరీక్షలకు పోలీసులు పంపారు. అయితే లభ్యమైన కాళ్లు, మాంసపు ముద్దలు పసికందు మృతదేహానివేనా?, ఓ వేళ వాటిని కుక్కలు తిన్నాయా? లేదా మ‌రేదైనా కారణం ఉందా..? అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు. శ్మశానవాటిక కాపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Advertisement
Advertisement