త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagadeesh Reddy | కొండా సుస్మిత వెన‌క మేముంటే… మ‌రి రాజ‌గోపాల్‌రెడ్డి వెన‌కెవ‌రున్న‌రు?

Jagadeesh Reddy | కొండా సుస్మిత వ్యాఖ్య‌ల వెన‌క మేముంటే.. మ‌రి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి వెన‌క ఎవ‌రున్నార‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీశ్‌రెడ్డి ప్ర‌శ్నించారు. 1000 రోజుల పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం సాధించింది ఓ మ‌హిళా మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మేన‌ని ఎద్దేవా చేశారు.

S

Telangana | Published On Sep 4, 2026, 4.37 pm IST

Jagadeesh Reddy | కొండా సుస్మిత వెన‌క మేముంటే… మ‌రి రాజ‌గోపాల్‌రెడ్డి వెన‌కెవ‌రున్న‌రు?
Advertisement
  • అసలు సీఎం రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి
  • కొండా సురేఖ, సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి
  • 1000 రోజుల పాల‌న‌లో కాంగ్రెస్‌ సాధించింది మ‌హిళా మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మే
  • సుస్మిత లేవ‌నెత్తిన విష‌యాల‌పై చ‌ర్చ ఏది?
  • రేవంత్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి ధ్వ‌జం

Jagadeesh Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: కొండా సుస్మిత వ్యాఖ్య‌ల వెన‌క మేముంటే.. మ‌రి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి వెన‌క ఎవ‌రున్నార‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీశ్‌రెడ్డి ప్ర‌శ్నించారు. 1000 రోజుల పాల‌న‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం సాధించింది ఓ మ‌హిళా మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మేన‌ని ఎద్దేవా చేశారు. కొండా సురేఖ‌, సుస్మిత చేసిన వ్యాఖ్య‌ల‌పై అస‌లు సీఎం రేవంత్‌రెడ్డిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల్సింద‌న్నారు. సుస్మిత వ్యాఖ్య‌ల వెన‌క అవినీతి అన‌కొండ ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వరంగల్ జిల్లా కాంట్రాక్టులు, హైదరాబాద్ భూములు, పారిశ్రామిక వేత్తల వద్ద డబ్బుల వసూళ్ల ద‌గ్గ‌ర కాంగ్రెసోళ్ల‌కు పంచాయితీ మొద‌లైంద‌న్నారు. దోపిడీ సొమ్మును పంచుకోవడంలో కాంగ్రెస్‌ ప్రజల ముందే దొరికిపోయింద‌న్నారు. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్ స‌ర్కార్‌పై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు.

సురేఖ మాకు టచ్‌లో లేదు..

కొండా సురేఖ మాకు ట‌చ్‌లో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాలను ప్రజలు స్వాగతిస్తున్నారు. రేవంత్ రెడ్డి 1,000 రోజుల పరిపాలనలో మహిళా మంత్రిని బర్తరఫ్ చేయడ‌మే వారు సాధించిన ఘనత. కొండా సురేఖను బర్తరఫ్ చేశారు. కానీ కొండా సురేఖ కుమార్తె లేవనెత్తిన అంశాలపై చర్చ ఏది? కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలను భయపెడుతున్నారని కొండా సురేఖ కుమార్తె చెప్పింది. రూ.50 కోట్లకు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కొనుకున్నారని ప్రస్తుత మంత్రి మాట్లాడారు. కుంతియాకు 25 కోట్లు ఇచ్చారని, కె.సి.వేణు గోపాల్‌కు మూటలు పంపుతున్నారని కాంగ్రెస్ నేతలు మాట్లాడారు.

కేసీఆర్ ధరణి తీసుకువస్తే కొంతమంది లంచగొండి అధికారులు కాంగ్రెస్ వాళ్ల‌తో మాట్లాడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి తీసివేసి భూ భారతి అనే పేరుతో భూ హారతి చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ పైరవీకారులు తయార‌య్యారు. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి వద్దకు వస్తే వారిని వెళ్లగొట్టి భూ యజమానులతో రెవెన్యూ మంత్రి సెటిల్‌మెంట్స్ చేసుకుంటున్నారు. రెవెన్యూ మంత్రి మంత్రుల వద్ద సైతం కమీషన్లు వసూలు చేస్తున్నారు.

బాబు అక్క‌ర‌కొస్త‌ర‌ని అనుకుంటుండు..

కృష్ణా, గోదావరిలో దుర్మార్గంగా తెలంగాణ నీళ్లను ఏపీ దోచుకుంటుంది. పైన చంద్రబాబు అక్కరకు వస్తారని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు నడుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చంద్రబాబు దీవెనలు సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ మంత్రులకు ఉన్నాయి. ఏపీ కోసం తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది. గోదావరి, కృష్ణాలో మనకు నీళ్లు వచ్చాయి. కృష్ణాలో మన హక్కులను కాపాడుకోవాలి. బీటీపీఎస్, యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించారు. సింగరేణి బొగ్గును మాత్రమే వాడతామని కేసీఆర్ తెగేసి చెప్పారు. కాంగ్రెస్ వెయ్యి రోజులు ప్రజలను ద్రోహం, మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీలో పతనం మొదలయింది. అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.

ఎమ్మెల్యేలు మాట్లాడిన‌దానిపై ఎథిక్స్ క‌మిటీ విచారించాలి..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రైడ్‌పై ఈడీ ఎందుకు ప్రకటన చేయలేదు? పొంగులేటికి రాజకీయ ఓనమాలు తెలియవు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసు వేసింది బీఆర్ఎస్‌యే. పొంగులేటికి పొంగు ఎక్కువ అయింది. రేవంత్ రెడ్డికి అభివృద్ధి, శంకుస్థాపనలు అంటే తెలుసా? రేవంత్ రెడ్డి దోపిడీని అడ్డుకుంటున్నాం. ఎథిక్స్ కమిటీకి ఎథిక్స్ ఉండాలి. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారో దానిపైన ఎథిక్స్ కమిటీ విచారణ చేయాలి.

ఈ స‌మావేశంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, బీఆర్ఎస్ నేత నంద్యాల దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement