త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | ఆ పని చేస్తే.. బ్యాంకు అధికారులూ జైలుకే

CP Sajjanar | బ్యాంకు అధికారులు కేవలం ఖాతాల (Mule Accounts) ఓపెనింగ్ టార్గెట్స్ వెంట పడకుండా, కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad Police Commissioner VC Sajjanar) సూచించారు.

D

Telangana | Published On Apr 23, 2026, 2.08 pm IST

CP Sajjanar | ఆ పని చేస్తే.. బ్యాంకు అధికారులూ జైలుకే
Advertisement
  • బ్యాంకుల్లో 'మ్యూల్ ఖాతాలు' ఉంటే కఠిన చర్యలు
  • అలాంటి అకౌంట్లు తెరిపిస్తే బ్యాంకు ఆఫీసర్లకూ జైలు శిక్షే
  • న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ సజ్జనర్ హెచ్చరిక‌
  • 'సేఫ్ కస్టమర్ ఛాలెంజ్' దిశగా బ్యాంకర్లు అడుగులు వేయాల‌ని పిలుపు
  • మ్యూల్ ఖాతాల నియంత్రణపై బ్యాంకు అధికారులతో సమన్వయ సమావేశం

CP Sajjanar | బ్యాంకు అధికారులు కేవలం ఖాతాల (Mule Accounts) ఓపెనింగ్ టార్గెట్స్ వెంట పడకుండా, కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad Police Commissioner VC Sajjanar) సూచించారు. ఒక్క కస్టమర్ కూడా సైబర్ నేరాల బారిన పడకుండా చూడటమే ప్రాథమిక లక్ష్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో గురువారం మ్యూల్ ఖాతాల నియంత్ర‌ణపై బ్యాంకు అధికారుల‌తో హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్, ఐపీఎస్ స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఆర్‌బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, అడిషనల్ సీపీఎం. శ్రీనివాసులుతో పాటు 45 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 75 మంది ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు 'సేఫ్ కస్టమర్ చాలెంజ్'ను బ్యాంకులు స్వీకరించాలని కోరారు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు శాఖ 'జీరో మ్యూల్ అకౌంట్స్' లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఏ బ్యాంకు శాఖలోనూ సైబర్ బాధితులు ఉండకూడదని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా ఆయా బ్రాంచీల పనితీరును అంచనా వేసుకోవాల‌ని స్పష్టం చేశారు.

బ్యాంకు మేనేజ్‌మెంట్లు ఖాతాల సంఖ్యను కాకుండా, కస్టమర్ల భద్రతనే ఉద్యోగుల కీలక పనితీరు సూచికగా (KPIs) పరిగణించాలని హితవు పలికారు. 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0'లో భాగంగా 850 కేసుల్లో రూ. 150 కోట్ల మోసాన్ని గుర్తించామని, మ్యూల్ ఖాతాల ఓపెనింగ్‌లో సహకరించిన 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేసిన‌ట్లు ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌నార్‌ వెల్లడించారు.

ఆ ఉద్యోగుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి..

కంబోడియా, వియత్నాం, దుబాయ్ వంటి దేశాల నుంచి సాగుతున్న అంతర్జాతీయ సైబర్ ముఠాలు.. స్థానిక బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఈ నేరాలకు పాల్పడుతున్నాయని వివరించారు. కేవైసీ (KYC) నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారిని బ్యాంకింగ్ రంగం నుంచే బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించారు. బ్యాంకుల్లో 'మ్యూల్ ఖాతాలు' ఉంటే చ‌ట్ట‌ప్ర‌కారం కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

1930 హెల్ప్‌లైన్ నంబర్‌పై అవ‌గాహ‌న క‌ల్పించండి..

ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ముందస్తుగా క్లోజ్ చేసేందుకు వచ్చే కస్టమర్ల విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఒత్తిడితోనే వారు డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..? అన్నది గమనించి వారిని కాపాడాలని కోరారు. మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు 'మ్యూల్ హంటర్' వంటి ఆధునిక సాంకేతిక పరికరాలను వాడాలని, 1930 హెల్ప్‌లైన్ నంబర్‌పై కస్టమర్లకు విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు సూచించారు.

ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్ కొన‌సాగుతుంది..

సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఆపరేషన్ ఆక్టోపస్ కొనసాగుతుందని ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. బ్యాంకులు పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ స‌మావేశంలో సైబ‌ర్ క్రైమ్స్ డీసీపీ అర‌వింద్ బాబు, ఏసీపీ శివ‌మారుతితో పాటు 45 బ్యాంకుల‌కు చెందిన 75 మంది ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Also Read..

ఎల్లుండి క‌విత కొత్త పార్టీ.. తెలంగాణ ప్రజా జాగృతి కోసం ద‌ర‌ఖాస్తు

ప్రజా పాలన ముసుగులో కాంగ్రెస్ నిరంకుశ పాలన : త‌ల‌సాని

నాటి విమ‌ర్శ‌కుడే.. నేడు ఆప్తుడ‌య్యాడు.. బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే సంజ‌య్ వ్యాఖ్య‌లు

Advertisement
Advertisement