త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cybercriminals | బడా కంపెనీలే లక్ష్యంగా వాట్సాప్‌లో కొత్త తరహా మోసాల‌కు తెర‌లేపిన నేర‌గాళ్లు.. సీపీ స‌జ్జ‌నార్ కీల‌క హెచ్చ‌రిక‌లు

Cybercriminals | బ‌డా కంపెనీలే ల‌క్ష్యంగా నేర‌గాళ్లు (Cybercriminals) వాట్సాప్‌లో కొత్త త‌ర‌హా మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ (Hyderabad CP Sajjanar) హెచ్చ‌రించారు.

D

Telangana | Published On Apr 4, 2026, 11.08 am IST

Cybercriminals | బడా కంపెనీలే లక్ష్యంగా వాట్సాప్‌లో కొత్త తరహా మోసాల‌కు తెర‌లేపిన నేర‌గాళ్లు.. సీపీ స‌జ్జ‌నార్ కీల‌క హెచ్చ‌రిక‌లు
Advertisement

Cybercriminals | దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు విప‌రీతంగా పెరిగిపోయాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. తాజాగా బ‌డా కంపెనీలే ల‌క్ష్యంగా నేర‌గాళ్లు (Cybercriminals) వాట్సాప్‌లో కొత్త త‌ర‌హా మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ (Hyderabad CP Sajjanar) హెచ్చ‌రించారు.

వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త వాట్సాప్ మోసాలకు (WhatsApp Impersonation Fraud) పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లలోకి మాల్వేర్‌ను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సిస్టమ్స్‌పై నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతూ అక్రమాలకు తెరలేపుతున్నారని చెప్పారు. సిస్టమ్ త‌మ‌ నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను నేరగాళ్లు చాకచక్యంగా వినియోగిస్తున్నారని అన్నారు. సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లను తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తూ నమ్మిస్తున్నారని తెలిపారు. తాము అత్యవసర సమావేశంలో ఉన్నామని, ఫోన్ ఎత్తడం వీలుపడదని చెబుతూ కోట్లాది రూపాయలు కాజేస్తున్నారని వివ‌రించారు.

సోషల్ ఇంజినీరింగ్ వ్యూహాలతో తక్షణమే తమ ఖాతాలకు డబ్బును బదిలీ చేయించుకుంటున్నారని చెప్పారు. పై అధికారుల నంబర్ల నుంచే సందేశాలు వస్తుండటంతో అకౌంటెంట్లు కూడా నిజమేనని నమ్మి మోసపోతున్నారని అన్నారు. ఇటీవలే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులే ఎక్కువ‌గా నమోదవుతున్నట్లు సీపీ తెలిపారు. ఇలాంటి సైబ‌ర్ దాడుల ప‌ట్ల కంపెనీలు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వాట్సాప్‌లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదని హెచ్చ‌రించారు. వెంటనే అధికారులకు నేరుగా ఫోన్ చేసి ఆ సందేశం నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలని సూచించారు.

అంతేకాదు, కంపెనీలు త‌మ ఆఫీస్‌ సిస్టమ్స్‌లో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను నిరంతరం అప్‌డేట్ చేస్తూ ఉండాల‌ని సూచించారు. వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయడం మర్చిపోవద్దని హెచ్చ‌రించారు. సాంకేతిక భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారానే ఇటువంటి దాడులను ఎదుర్కోగలమని తెలిపారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని సజ్జనర్ సూచించారు. అలాగే బాధితులు http://cybercrime.gov.in పోర్టల్‌లో తమ ఫిర్యాదును వెంటనే నమోదు చేయాలని అన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

Also Read..

క్యాత‌న‌ప‌ల్లిలో మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక సజావుగా నిర్వహించండి: బాల్క సుమ‌న్‌

విద్యార్థుల నుంచే ఫీజులు వ‌సూలు చేసుకోండి..

ఐటీ రిటర్న్‌లు వేస్తున్నారా..? పాత విధాన‌మేనా, కొత్త‌దానికి మారాలా..?

Advertisement
Advertisement