త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IT Returns | ఐటీ రిటర్న్‌లు వేస్తున్నారా..? పాత విధాన‌మేనా, కొత్త‌దానికి మారాలా..?

IT Returns | ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. 1961 చట్టాన్ని భర్తీ చేస్తూ పన్ను విధానాన్ని సరళీకరించేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం పాత ట్యాక్స్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని ఖర్చులపై మినహాయింపులను పెంచారు.

S

Business | Published On Apr 4, 2026, 10.33 am IST

IT Returns | ఐటీ రిటర్న్‌లు వేస్తున్నారా..? పాత విధాన‌మేనా, కొత్త‌దానికి మారాలా..?
Advertisement

IT Returns | ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. 1961 చట్టాన్ని భర్తీ చేస్తూ పన్ను విధానాన్ని సరళీకరించేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం పాత ట్యాక్స్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని ఖర్చులపై మినహాయింపులను పెంచారు. అయితే దీనివల్ల పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళం ఏర్పడింది. సరళమైన, అధిక రిబేట్ కలిగిన కొత్త విధానంలో కొనసాగాలా? లేక మినహాయింపులు ఉన్న పాత విధానంలోనే కొన‌సాగాలా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సి ఉంటుంది. ఈ కొత్త చట్టం ఈ ఏడాది పన్ను రిటర్నులపై ప్రభావం చూపదు. FY26కి సంబంధించిన ITRలను పాత నిబంధనల ప్రకారం ఫైల్ చేయాలి. కొత్త చట్టం FY26-27 ఆదాయానికి వర్తిస్తుంది. అంటే 2027లో ఫైల్ చేసే రిటర్నులపై ఈ మార్పుల ప్రభావం కనిపిస్తుంది.

ఎవ‌రికి ఏది మంచిది..

2025 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినట్లుగా కొత్త ట్యాక్స్ విధానంలో రూ. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. జీతభత్యాలు పొందే వారికి స్టాండర్డ్ డిడక్షన్‌తో ఇది రూ. 12.75 లక్షల వరకు పెరుగుతుంది. అయితే ఈ కొత్త విధానంలో HRA, సెక్షన్ 80C వంటి సాధారణ మినహాయింపులు అందుబాటులో ఉండవు. ఈ ప్రయోజనాలు పాత ట్యాక్స్ విధానంలో మాత్రమే లభిస్తాయి. అందువల్ల పెట్టుబడులు ఎక్కువగా చేసే వారికి పాత విధానం అనుకూలంగా ఉంటుంది. పన్ను విధానం ఎంపిక వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. బీమా ప్రీమియం, HRA, 80C పెట్టుబడులు వంటి మినహాయింపులు ఎక్కువగా ఉంటే పాత విధానం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు.

కొత్త విధానం ఎవ‌రికి..

అయితే మినహాయింపులు తక్కువగా ఉంటే, ముఖ్యంగా నికర ఆదాయం రూ. 12.75 లక్షలకు సమీపంలో ఉంటే, కొత్త విధానం మంచిదిగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది సులభమైంది, ఎక్కువ లెక్కలు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మొత్తం మినహాయింపులు రూ. 4 లక్షలకు మించి ఉంటే మాత్రమే పాత విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త చట్టం FY27 (ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చి 31, 2027 వరకు) ఆదాయానికి వర్తిస్తుంది. 2027లో ఫైల్ చేసే రిటర్నుల్లో ఇది ప్ర‌భావం చూపిస్తుంది. పాత, కొత్త విధానాల ట్యాక్స్ స్లాబ్‌లు మారకుండా ఉన్నప్పటికీ మినహాయింపుల పరంగా కొన్ని కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా పాత ట్యాక్స్ విధానాన్ని ఆకర్షణీయంగా మార్చేలా ఈ మార్పులు ఉన్నాయి.

కొత్త‌గా చేసిన మార్పులు..

పిల్లల విద్య భత్యం నెలకు రూ. 100 నుంచి రూ. 3వేల‌కు పెంచారు. హాస్టల్ అలవెన్స్ రూ. 300 నుంచి రూ. 9వేల‌కు పెరిగింది. HRA మినహాయింపులో అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పుణే నగరాలను కూడా 50 శాతం కేటగిరీలో చేర్చారు. దీంతో ఇవి ఢిల్లీ, ముంబై స్థాయికి చేరాయి. అదనంగా సోడెక్సో వంటి కార్పొరేట్ మీల్ కార్డులు ఒక్కో భోజనానికి రూ. 200 వరకు పన్ను మినహాయింపు పొందాయి. ఇవి అంత‌కు ముందు రూ.50 మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపును క‌లిగి ఉన్నాయి. కార్పొరేట్ గిఫ్ట్ కార్డులు, కూపన్లు సంవత్సరానికి రూ. 15వేల వరకు మినహాయింపు పొందుతాయి. ఈ మార్పుల వల్ల మినహాయింపులు క్లెయిమ్ చేయగలిగే పన్ను చెల్లింపుదారులకు పాత ట్యాక్స్ విధానం మరింత లాభదాయకంగా మారే అవకాశముంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement