త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్‌కి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్.. నర్సాపూర్ కాలువ దుస్థితిని ట్యాగ్ చేస్తున్నా.. చూసుకో

Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. న‌ర్సాపూర్ కాలువలో నీళ్లు పారడానికి బ‌దులు తుమ్మ చెట్లు మొలుస్తున్నాయని మండిప‌డ్డారు. కేసీఆర్ హయాంలో 85% పూర్తయిన టన్నెల్.. మిగిలిన 300 మీటర్లు తవ్వలేని చేతకాని ప్రభుత్వమిద‌ని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Sep 3, 2026, 1.34 pm IST

Harish Rao | రేవంత్‌కి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్.. నర్సాపూర్ కాలువ దుస్థితిని ట్యాగ్ చేస్తున్నా.. చూసుకో

సంక్షిప్త సారాంశం

బీఆర్ఎస్ హయాంలోనే మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్ వచ్చే 18 కిలోమీటర్ల టన్నెల్ పనుల్లో 85 శాతం పూర్తయ్యాయి. కేవలం 300 మీటర్ల పని మాత్రమే మిగిలింది. ఆ కొద్దిపాటి పని చేస్తే.. ఈ కెనాల్ ద్వారా నీళ్లు హల్దీ వాగులో పడి నిజాంసాగర్ వరకు గోదావరి జలాలు పరుగులు పెట్టేవి. అటు నిజామాబాద్, ఇటు మెదక్ జిల్లాల రైతులకు మేలు జరిగేది.

Advertisement
  • కాలువ‌లో నీళ్ల బ‌దులు తుమ్మ చెట్లు మొలుస్తున్న‌య్‌
  • కేసీఆర్ హయాంలో 85% ట‌న్నెల్‌ పూర్తయితే మిగిలిన 300 మీటర్లు తవ్వలేక‌పోతున్న‌వ్
  • పిల్ల కాలువలకు కూడా రూ.50 కోట్లు ఇవ్వలేవా? 50,000 ఎకరాలు ఎండుతున్న‌య్‌
  • బసవేశ్వర, సంగమేశ్వర, ఘనపూర్ ఆనకట్ట పనులు వెంట‌నే పూర్తి చెయ్
  • ఆగిపోయిన నర్సాపూర్ కాళేశ్వరం కాలువ పనులు ప్రారంభించు
  • మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. న‌ర్సాపూర్ కాలువలో నీళ్లు పారడానికి బ‌దులు తుమ్మ చెట్లు మొలుస్తున్నాయని మండిప‌డ్డారు. కేసీఆర్ హయాంలో 85% పూర్తయిన టన్నెల్.. మిగిలిన 300 మీటర్లు తవ్వలేని చేతకాని ప్రభుత్వమిద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పాల‌న‌లో పిల్ల కాలువలకు రూ.50 కోట్లు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి నెల‌కొంద‌న్నారు. దీంతో 50,000 ఎకరాల పంట‌లు ఎండిపోతున్నాయ‌ని వాపోయారు. ఆగిపోయిన నర్సాపూర్ కాళేశ్వరం కాలువ పనులను వెంట‌నే ప్రారంభించాల‌ని డిమాండ్ చేశారు. బసవేశ్వర, సంగమేశ్వర, ఘనపూర్ ఆనకట్ట పనులు నిలిపివేసి ఉమ్మ‌డి మెద‌క్ రైతులను ఆగం చేస్తున్నార‌ని ఆరోపించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి మల్లన్నసాగర్, కాళేశ్వరం కాలువ పనులను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు.

మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ ప్యాకేజీ 18, 19 కింద అద్భుతమైన ప్రణాళిక చేశారు. ఇక్కడి నుంచి చిన్న లిఫ్ట్ ద్వారా సింగూరులో గోదావరి నీళ్లు నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నది ఆయన సంకల్పం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పనులన్నీ పడావు పెట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్ వచ్చే 18 కిలోమీటర్ల టన్నెల్ పనుల్లో 85 శాతం పూర్తయ్యాయి. కేవలం 300 మీటర్ల పని మాత్రమే మిగిలింది. ఆ కొద్దిపాటి పని చేస్తే.. ఈ కెనాల్ ద్వారా నీళ్లు హల్దీ వాగులో పడి నిజాంసాగర్ వరకు గోదావరి జలాలు పరుగులు పెట్టేవి. అటు నిజామాబాద్, ఇటు మెదక్ జిల్లాల రైతులకు మేలు జరిగేది.

కానీ ఆ పని చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది. మొన్న సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉరుములు లేని మెరుపుల్లా ఉచిత సలహాలు ఇచ్చారే తప్ప, జిల్లాలో ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల ఊసెత్తలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ దుకాణం బంద్ చేయాలనుకుంటున్నారా? మెదక్ జిల్లా అంటే మీకు ఎందుకంత చిన్నచూపు.. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ కింద ఉన్న పిల్ల కాలువలు తవ్వడానికి కేవలం రూ.50 కోట్లు ఇస్తే చాలు.. 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి.

ప్రాజెక్టులు, కెనాల్స్ పూర్తయినా.. పిల్ల కాలువలకు ఆ మాత్రం నిధులు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రికి మనసు రావడం లేదు. నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గాల్లో ఐదు లక్షల ఎకరాలకు నీరందించే బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను గాలికి వదిలేశారు. కేసీఆర్ నిధులు మంజూరు చేసిన ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను ఆపేశారు. దుబ్బాకలో 80 శాతం పూర్తయిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేసి రైతులను గోస పెడుతున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు వస్తాయని చెబుతున్నా.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను నీళ్లతో నింపుకోవాలన్న కనీస సోయి ఈ ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలంలోనూ హల్దీ, మంజీరా వాగుల మీద పదుల సంఖ్యలో చెక్ డ్యామ్‌లు మత్తడి దుంకాయి. ఇప్పుడు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. కట్టిన ఇల్లు పుణ్యానికి పోయేలాగా.. అందంగా తీర్చిదిద్ది ఇచ్చిన రాష్ట్రాన్ని నడపడం కూడా రేవంత్ రెడ్డికి చేతకావడం లేదు.

గ‌జం కాలువ కూడా త‌వ్వ‌లేదు..

ఈ మూడేళ్లలో 1000 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క గజం కాలువ కూడా తవ్వలేదు, కనీసం ఒక్క రూపాయి నిధులైనా విడుదల చేయలేదు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల పనులు తక్షణమే ప్రారంభించాలి. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను వెంటనే పూర్తి చేయాలి. మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్‌, ఆందోల్‌కు నీళ్లు తీసుకొచ్చే కాళేశ్వరం కాలువ పనులు పూర్తి చేయాలి.

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేయాలి. ఆగిపోయిన కాలువ పనులకు, వాటిలో మొలిచిన తుమ్మ చెట్లకు సజీవ సాక్ష్యంగా ఇక్కడి నుంచే సెల్ఫీ తీసి రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేస్తున్నాను. ఇప్పటికైనా కళ్లు తెరిచి, నీ వైఫల్యాలను చూసుకో. తక్షణమే ఆగిపోయిన టన్నెల్, కాలువ పనులను, ప్రాజెక్టులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్ రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement